మానవజాతి పై నిశ్శబ్దంగా దాడి చేస్తున్న క్యాన్సర్
మానవజాతి పై నిశ్శబ్దంగా దాడి చేస్తున్న క్యాన్సర్...
ఈరోజు వరల్డ్ కేన్సర్ డే ఫిబ్రవరి 04.. సందర్భంగా దీని గురించి తెలుసుకుందాం జాగ్రత్త పడదాం..ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం 2024 థీమ్- "మేము కలిసి అధికారంలో ఉన్నవారిని సవాలు చేస్తాము"
పరిమితి మించి కణజాలం విపరీతంగా పెరిగిపోవడాన్నే క్యాన్సర్ అని అంటారు. సాధారణంగా శరీరంలో కణాల విభజన జరుగుతుంది. ఇలా ప్రతి కణం విభజనకు గురై పుడుతూ చనిపోతూ ఉంటాయి. అయితే, శరీరంలో ఈ ప్రక్రియకు విఘాతం ఏర్పడితే కొన్ని కణాలు చనిపోకుండా అలాగే ఉండిపోతాయి. కణాల్లో ఉండే డీఎన్ఏలో మార్పుల వల్లే ఈ పరిస్థితి ఏర్పడుతుంది. డీఎన్ఏ వల్ల మన తల్లిదండ్రుల్లో ఉండే లక్షణాలే మనకు కూడా వస్తాయి. అలాగే క్యాన్సర్ కూడా వ్యాప్తి చెందే అవకాశాలున్నాయి. ఆహారపు అలవాట్లు, రేడియేషన్, స్మోకింగ్, ఊబకాయం తదితర కారణాల వల్ల కూడా డీఎన్ఏలో మార్పులు వస్తాయి. దీని వల్ల కణాలు చనిపోకుండా అలాగే ఉండిపోతాయి. ఫలితంగా శరీరానికి అవసరమైన కణాల కంటే ఎక్కువ వృద్ధి చెందుతాయి. అవన్నీ కలిసి ట్యూమర్గా ఏర్పడతాయి. దాన్నే క్యాన్సర్ అని అంటారు.
మన దేశంలో క్యాన్సర్ వ్యాధి గురించి, దాని లక్షణాల గురించి ఇప్పటికీ చాలామందికి అవగాహన లేదు. చాలా కేసుల్లో వ్యాధి తీవ్రత పెరిగిన తర్వాత గుర్తిస్తుండటంతో పరిస్థితి చేయి దాటిపోతుంది. ముందుగానే గుర్తిస్తే ఈ మహమ్మారి బారి నుంచి త్వరగా బయటపడే ఛాన్స్ ఉంది. క్యాన్సర్ సోకిన తర్వాత స్టేజ్-1, స్టేజ్-2 లలో గుర్తిస్తే.. దాన్ని నయం చేసే వైద్యం అందుబాటులో ఉంది. ఈ రెండు స్టేజ్లలో గుర్తించి ట్రీట్ మెంట్ తీసుకుంటే దాదాపు 90 శాతం నయమయ్యే అవకాశం ఉంది. స్టేజ్-4లో గుర్తిస్తే వ్యాధి 22 శాతం నయమయ్యే ఛాన్స్ ఉందంది. క్యాన్సర్ను గుర్తించేందుకు ఎన్నో పద్దతులు అందుబాటులో ఉన్నాయి. కచ్చితమైన చికిత్స, వ్యాధి తీవ్రత ఎక్కువ కాకుండా వ్యూహాత్మక చికిత్స విధానాలను అవలంభిస్తుండటంతో క్యాన్సర్కు చెక్ పెడుతున్నారు. వ్యాధి తీవ్రత పెరిగిన వారితో పోలిస్తే ముందుగా గుర్తించిన వారిలో వ్యాధి తగ్గే అవకాశం ఎక్కువగా ఉంది. వ్యాధి తీవ్రత తగ్గడంతో పాటు క్వాలిటీ ఆఫ్ లైఫ్ను లీడ్ చేసే అవకాశం కూడా ఉంటుంది.
ప్రపంచవ్యాప్తంగా జనాలను బలితీసుకుంటున్న వ్యాధుల్లో క్యాన్సర్ మహమ్మారిది రెండో స్థానం. ఒక్క కణజాలంలో మొదలైన ఈ వ్యాధి అంతకంతకూ పెరుగుతూ శారీరక, మానసిక, ఆర్థిక సమస్యలను పెంచుతుంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు వందకు పైగా క్యాన్సర్ వ్యాధి రకాలను గుర్తించారు శాస్త్రవేత్తలు. బ్రెస్ట్, లంగ్స్, స్కిన్, త్రోట్, గర్భాశయం, అండాశయం, జీర్ణాశయం, పేగులు, నోటి క్యాన్సర్ ఇలా పలు రకాల క్యాన్సర్లు గుర్తించబడ్డాయి. ఏటా వీటి బారిన పడుతున్న వారి సంఖ్య దాదాపు 13 లక్షలకు పైనే అని ఎన్నో అధ్యయనాలు చెప్తున్నాయి. కొన్ని దశల్లో క్యాన్సర్ ప్రాణాలను సైతం బలి తీసుకుంటూ మానవాళిపై దాడి చేస్తోంది.
క్యాన్సర్ సోకినప్పుడు చాలా రకాల చికిత్స విధానాలు అవసరం అవుతాయి. తక్కువ ఖర్చుతో కూడిన జీన్ సీక్వెన్సింగ్ ద్వారా అందించే చికిత్స మంచి ఫలితం ఇస్తున్నది. కొన్నాళ్లుగా రేడియేషన్ చికిత్స కూడా మంచి పురోగతి సాధిస్తున్నది. శరీరంలోని క్యాన్సర్ కణాలను టార్గెట్ చేసి రేడియేషన్ క్యాన్సర్ కణాలను సమూలంగా తుడిచి పెట్టేస్తోంది. క్యాన్సర్ సోకిన శరీరాన్ని బట్టి డాక్టర్లు ఈ రేడియేషన్ చికిత్స విధానాలను ఎంచుకుంటారు.
క్యాన్సర్ రావడానికి కారణాలు
వ్యాయామం, శారీరక శ్రమ బొత్తిగా లేకపోవడం, అధిక బరువు మరియు ఊబకాయం కలిగి ఉండడం,రక్తంలో చెక్కర స్థాయిలు అధికంగా ఉండడం, ఉప్పు అధికంగా ఉండే అహారాలను తీసుకోవడం, పండ్లు, పాలను తగినంతగా తీసుకోకపోవడం, పొగాకు వాడకం మరియు మద్యం సేవించడం, వారసత్వంగా కూడా క్యాన్సర్ వ్యాధి వచ్చే అవకాశాలున్నాయి, మన శరీర కణాలు పని చేసే విధానం, విభజన ప్రక్రియలని నియంత్రించే నిర్దిష్ట DNA లోని జన్యు పరమైన మార్పులు కూడా కాన్సర్కి కారణమవుతాయి, రేడియేషన్ ప్రభావానికి గురికావడం మరియు పర్యావరణ కాలుష్యం కూడా క్యాన్సర్లకు దారితీస్తున్నాయి.
క్యాన్సర్ ను గుర్తించే లక్షణాలు
అజీర్ణం లేదా గుండెల్లో మంట, రాత్రుళ్లు ఎక్కువ చెమట పట్టడం, గొంతు మరియు ముక్కు నుంచి రక్తం కారడం, దగ్గు మానకుండా రావడం, ఊపిరి ఆడకపోవడం, ఆకలి లేకపోవడం మరియు అనుకోకుండా బరువు తగ్గడం, మింగడంలో ఇబ్బంది పడడం మరియు రక్త వాంతులవ్వడం, మూత్రంలో రక్తం, మూత్ర విసర్జన సమయంలో ఇబ్బంది పడడం, శరీరంలో కొత్తగా కణితులు మరియు పుట్టుమచ్చలు ఏర్పడడం, నోటి లోపల చిన్నగా తెలుపు లేదా ఎరుపు బొబ్బలు రావడం, రొమ్ములు, చనుమొలల్లో మరియు చర్మంలో మార్పులు రావడం.
సమతుల ఆహారంతో ప్రజలు సరైన జీవన శైలిని అలవరుచుకోవాలి.