ఏపీలో టెట్ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల
AP TET And DSC -2024 Notification: ఏపీలో టెట్ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల ప్రకటించిన విద్యాశాఖ మంత్రి.
విజయవాడ, ఫిబ్రవరి 07 (పీపుల్స్ మోటివేషన్):-
ఆంధ్రప్రదేశ్లో టెట్ మరియు డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల అయ్యింది. మొత్తం 6,100 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ను బుధవారం మధ్యాహ్నాం విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సచివాలయం నుంచి విడుదల చేశారు. ఈ నెల 12వ తేదీ నుంచి ప్రక్రియ ప్రారంభం అవుతుందని.. ఏప్రిల్ 7వ తేదీన ఫలితాలు ప్రకటిస్తామని తెలిపారు.
ఏపీ టెట్ మరియు డీఎస్సీ నోటిఫికేషన్ వివరాల్ని మంత్రి బొత్స మీడియాకు వివరించారు. రాష్ట్రంలో 2024 టెట్ మరియు డీఎస్సీని ప్రకటిస్తున్నామని. ఏడు మేనేజ్ మెంట్ల పరిధిలో 6100 పోస్టులతో డీఎస్సీని వెల్లడించారు. డీఎస్సీలో.. మొత్తం పోస్టుల్లో 2,299 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు, 2,280 ఎస్జీటీ పోస్టులు, 1,264 టీజీటీ పోస్టులు, 215 పీజీటీ పోస్టులు ఉన్నాయి. ఈ నెల 12వ తేదీ నుంచి డీఎస్సీ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. ఏప్రిల్ 7వ తేదీతో ముగస్తుంది. విద్య మా ప్రభుత్వ మొదటి ప్రాధాన్యత. మా ప్రభుత్వం ఈ అయిదేళ్లలో రూ.73 వేల కోట్లు విద్య పై ఖర్చు చేసింది అని మీడియాకు మంత్రి బొత్స వివరించారు.
ఏపీ టెట్ గురించి....ఇలా
ఈ నెల 8వ తేదీ నుంచి టెట్ ప్రక్రియ (నోటిఫికేషన్తో) ప్రారంభం అవుతుంది. ఈ నెల 8వ తేదీ నుంచి 18వ తేదీల్లో https://cse.ap.gov.in/loginhome వెబ్సైట్లో ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించాలి. 19వ తేదీన ఆన్లైన్ మాక్ టెస్ట్ రాసేందుకు అభ్యర్థులకు వీలు కల్పిస్తారు. 23 వ తేదీ నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. 27వ తేదీ నుంచి మార్చి 9వ తేదీ లోపు రెండు సెషన్స్లో ఏపీ టెట్ పరీక్షలు నిర్వహిస్తారు. ప్రాథమిక కీ మార్చి 10వ తేదీన.. కీపై అభ్యంతరాల స్వీకరణ 11వ తేదీ దాకా ఉంటుంది. ఫైనల్ కీ మార్చి 13వ తేదీన రిలీజ్ చేస్తారు. మార్చి 14వ తేదీన టెట్ తుదిఫలితాలు వెల్లడిస్తామని తెలిపారు.
ఏపీ డీఎస్సీ గురించి....ఇలా
ఈ నెల 12వ తేదీ నోటిఫికేషన్ రిలీజ్తో డీఎస్సీ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. ఆన్లైన్లో 12వ తేదీ నుంచి 22వ తేదీ మధ్య https://cse.ap.gov.in/loginhome సైట్ లో దరఖాస్తుల స్వీకరణ ఉంటుందని. 24వ తేదీన ఆన్లైన్ మాక్ టెస్ట్ రాసేందుకు అభ్యర్థులకు వీలు కల్పిస్తామని తెలిపారు. మార్చి 5వ తేదీ నుంచి హల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మార్చి 15వ తేదీ నుంచి 30వ తేదీ వరకు రెండు సెషన్స్లో డీఎస్సీ పరీక్షలు ఉంటాయి. మార్చి 31వ తేదీన ప్రాథమిక కీ విడుదల అవుతుందని.. ఏప్రిల్ 1వ తేదీన కీలో అభ్యంతరాలపై స్వీకరణ ఉంటుందని.. ఆ వెంటనే ఏప్రిల్ 2వ తేదీన ఫైనల్ కీ విడుదల చేస్తామని చెప్పారు. ఏప్రిల్ 7వ తేదీన డీఎస్సీ ఫలితాలు వెల్లడిస్తామని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.