భారీగా అక్రమ నగదు, బంగారం పట్టివేత...
భారీగా అక్రమ నగదు, బంగారం పట్టివేత...
హవాలా కార్యకలాపాలు జరుగుతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం...
కర్ణాటకలో 28 లోక్సభ స్థానాలకు ఏప్రిల్ 26, మే 4వ తేదీన పోలింగ్...
బళ్లారి, (పీపుల్స్ మోటివేషన్):-
దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ కర్ణాటక రాష్ట్రం బళ్లారి లో భారీగా అక్రమ నగదు, బంగారం బయటపడటం తీవ్ర కలకలం రేపింది. ఓ వ్యాపారి ఇంట్లో పోలీసులు సోదాలు జరపగా.. రూ.7.6 కోట్ల నగదు, బంగారు, వెండి ఆభరణాలను గుర్తించారు.
పక్కా సమాచారంతో...బళ్లారిలో హవాలా కార్యకలాపాలు జరుగుతున్నట్లు విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం రావడంతో బ్రూస్ పేట్ పోలీసులు రంగంలోకి దిగారు. స్థానిక ఆభరణాల వ్యాపారి నరేశ్ సోనీ ఇంట్లో ఆకస్మిక సోదాలు చేపట్టారు. లెక్కల్లో కి రాని భారీ నగదు, ఆభరణాలను గుర్తించారు. రూ.5.6 కోట్ల కరెన్సీ, 103 కిలోల వెండి ఆభరణాలు, 68 వెండి కడ్డీలు, 3 కిలోల బంగారు నగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటకలోని మొత్తం 28 లోక్సభ స్థానాలకు రెండు దశల్లో ఏప్రిల్ 26, మే 4వ తేదీన పోలింగ్ జరగనుంది. హవాలా మార్గంలో వీటిని తీసుకొచ్చి ఉంటారన్న అనుమానంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వ్యాపారి నరేశ్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ వివరాలను ఆదాయపు పన్ను విభాగానికి అందజేస్తామని, అనంతరం ఐటీ అధికారులు దీనిపై తదుపరి దర్యాప్తు చేపడుతారని తెలిపారు. పోలింగ్ దగ్గరపడుతున్న వేళ ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.