CEC OF INDIA: నూతన భారత ఎన్నికల ప్రధాన కమిషనర్గా జ్ఞానేశ్ కుమార్
CEC OF INDIA: నూతన భారత ఎన్నికల ప్రధాన కమిషనర్గా జ్ఞానేశ్ కుమార్
భారత ఎన్నికల ప్రధాన కమిషనర్గా జ్ఞానేశ్ కుమార్..
ఎన్నికల కమిషనర్గా వివేక్ జోషి..
భారత ఎన్నికల సంఘం నూతన సారథిగా జ్ఞానేశ్ కుమార్, ఎలక్షన్ కమిషనర్గా వివేక్ జోషి నియమితులయ్యారు. ఈ మేరకు సోమవారం రాత్రి రెండు గెజిట్ నోటిఫికేషన్లు వేర్వేరుగా విడుదలయ్యాయి. ఎన్నికల కమిషనర్ల నియామకంపై తీసుకొచ్చిన కొత్త చట్టం ప్రకారం నియమితులైన తొలి సీఈసీగా జ్ఞానేశ్ కుమార్ నిలిచారు.
ప్రస్తుత ఉన్న రాజీవ్ కుమార్ పదవీకాలం ఫిబ్రవరి 18తో ముగియనుండటం వల్ల నూతన సీఈసీని ఎంపిక చేశారు. అంతకుముందు ఇదే అంశంపై సమావేశమైన ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ తదుపరి సీఈసీ పేరును ఎంపిక చేసి రాష్ట్రపతికి సిఫార్సు చేసింది. రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. ఆ వెంటనే అధికారిక ప్రకటనలు విడుదలయ్యాయి. ఎన్నికల కమిషనర్ల నియామకాలకు సంబంధించి 2023లో తీసుకొచ్చిన చట్టం ప్రకారం చేపట్టిన తొలి ఎంపికలు ఇవి. ప్రస్తుతం ఎన్నికల కమిషనర్గా జ్ఞానేశ్ సీఈసీగా బాధ్యతలు చేపట్టనున్నందున ఆయన స్థానంలో ఈసీగా వివేక్ జోషిని ఎంపిక చేశారు. సుఖ్బీర్ సింగ్ సంధు ఇప్పటికే మరో ఈసీగా ఉన్నారు.
ఎవరీ జ్ఞానేశ్, జోషి
26వ ఎన్నికల ప్రధాన కమిషనర్గా నియమితులైన జ్ఞానేశ్కుమార్ కేరళ క్యాడర్కు చెందిన 1988 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. గతేడాది మార్చిలో ఎన్నికల కమిషనర్ (ఈసీ)గా నియమితులయ్యారు. 2019లో కేంద్ర ప్రభుత్వం అధికరణం 370 రద్దు కోసం పార్లమెంటులో ప్రవేశపెట్టిన బిల్లును రూపొందించడంలో జ్ఞానేశ్ కుమార్ కీలక పాత్ర వహించారు. కేంద్ర హోంశాఖలో అప్పుడు ఆయన సంయుక్త కార్యదర్శి (కశ్మీర్ డివిజన్). ఆ తర్వాత సహకార శాఖ కార్యదర్శిగా 2024 జనవరిలో పదవీ విరమణ చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సన్నిహిత సంబంధాలు ఉన్న నేపథ్యంలో ఎన్నికల కమిషనర్గా నియమితులయ్యారు. జ్ఞానేశ్ సీఈసీగా 2029 జనవరి 26వ తేదీ వరకు కొనసాగుతారు. ఆయన పర్యవేక్షణలోనే ఈ ఏడాది చివరిలో బిహార్, వచ్చే ఏడాదిలో తమిళనాడు, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. హరియాణా క్యాడర్కు చెందిన 1989 బ్యాచ్ ఐఏఎస్ అధికారి వివేక్ జోషి. ప్రస్తుతం హరియాణా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు.