MLC Elections: తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు... షెడ్యూల్ విడుదల
MLC Elections: తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు... షెడ్యూల్ విడుదల
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో త్వరలో మొత్తం 10 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానున్నాయి. దాంతో, ఏపీలో ఐదు, తెలంగాణలో ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ మేరకు నేడు షెడ్యూల్ విడుదలైంది.• ఏపీ తెలంగాణల్లో వచ్చే నెలలో ఖాళీ కానున్న 10 ఎమ్మెల్సీ స్థానాలు
• ఏపీలో 5, తెలంగాణలో 5 స్థానాలకు మార్చి 3న నోటిఫికేషన్ విడుదల
• మార్చి 20న ఎన్నికలు... అదే రోజున లెక్కింపు
ఇక ఈ ఏడాది మార్చి 29వ తేదీతో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైన పలువురు ఎమ్మెల్సీల పదవి కాలం ముగియనుంది. అంటే.. ఆంధ్రప్రదేశ్లో జంగా కృష్ణమూర్తి, దువ్వరపు రామారావు, పరుచూరి అశోక్ బాబు, బి. తిరుమల నాయుడు, యనమల రామకృష్ణుడుతోపాటు తెలంగాణలో మహబూబ్ అలీ, సత్యవతి రాథోడ్, శేరి సుభాష్ రెడ్డి, మల్లేశం ఎగ్గే, మిర్జా రియాజుల్ హసన్ల పదవీ కాలం ముగిసిపోనుంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయడం కేంద్ర ఎన్నికల సంఘానికి అనివార్యమైంది.
మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో చెరో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఫిబ్రవరి 27వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. పట్టభద్రుల కోటాలో జరుగుతోన్న ఈ ఎన్నికల్లో బరిలో దిగిన అభ్యర్థులు ఇప్పటికే తన ప్రచారంలో దూసుకు పోతున్నారు. ఈ ఎన్నికల ఓట్లను మార్చి 3వ తేదీన లెక్కించనున్నారు. అదే రోజు ఈ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.
మరోవైపు గతేడాది జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమిలోని మూడు పార్టీలు మొత్తం164 అసెంబ్లీ స్థానాలకు గెలుచుకున్నాయి. వైసీపీకి కేవలం11 స్థానాలు మాత్రమే వచ్చాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే కోటాలో జరిగే ఐదు ఎమ్మెల్సీ స్థానాలను కూటమి ఖాతాలో పడనున్నాయి. అలాగే తెలంగాణలో సైతం కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకుంది.
దీంతో రేవంత్ సారథ్యంలో ప్రభుత్వం కొలువు తీరింది. ఇక ప్రతిపక్ష పార్టీలు బీఆర్ఎస్, బీజేపీ కొన్ని స్థానాలను గెలుచుకొన్నాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల జరిగితే ఐదు స్థానాల్లో మూడు లేదా నాలుగు స్థానాలు కాంగ్రెస్ పార్టీ ఖాతాలో పడతాయి. ఇక ఒక స్థానం బీఆర్ఎస్ పరమయ్యే అవకాశాలున్నాయన్నది సుస్పష్టం.
ఈ నేపథ్యంలో, ఆయా ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు మార్చి 3న నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. మార్చి 10 నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. మార్చి 11న నామినేషన్ల పరిశీలన చేపడతారు. నామినేషన్ల ఉపసంహరణకు మార్చి 13 వరకు గడువు ఇచ్చారు. మార్చి 20న ఎన్నికలు నిర్వహించనున్నారు.
ఓట్ల లెక్కింపు కూడా మార్చి 20న పోలింగ్ ముగిశాక సాయంత్రం 5 గంటల నుంచి చేపడతారు. కాగా, ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు.