కుటుంబానికి రూ.20,000 అందజేత.. రాష్ట్ర ప్రభుత్వం మరో కొత్త పథకం ప్రారంభం
కుటుంబానికి రూ.20,000 అందజేత.. రాష్ట్ర ప్రభుత్వం మరో కొత్త పథకం ప్రారంభం
రేపు ‘మత్స్యకారుల సేవలో’ పథకం ప్రారంభం
శ్రీకాకుళం జిల్లాలో శ్రీకారం చుట్టనున్న సీఎం చంద్రబాబు
సముద్రంలో వేట విరామ సమయంలో ఆర్ధిక సాయం
1,29,178 కుటుంబాలకు రూ. 258 కోట్ల లబ్ది
మరో ఎన్నికల హామీని నిలబెట్టుకున్న కూటమి ప్రభుత్వం
అమరావతి, ఏప్రిల్ 25 రాష్ట్రంలో సంక్షేమ పాలన సూపర్ స్పీడ్లో దూసుకుపోతోంది. కూటమి ప్రభుత్వం వచ్చిన 10 నెలల్లోనే ఎన్నికల హామీలు ఒకొక్కటి నెరవేరుస్తూ ఇది మంచి ప్రభుత్వం అనిపించుకుంటోంది. పింఛన్ల పెంపు నుంచి అన్న క్యాంటీన్లు తిరిగి ప్రారంభించడం వరకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టింది. ఇప్పుడు కొత్తగా మరో పథకానికి శ్రీకారం చుడుతోంది. మత్స్యకారులను ఆర్ధికంగా ఆదుకునేలా ‘మత్స్యకారుల సేవలో...’ పేరుతో సాయం అందించనుంది. ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు 61 రోజుల పాటు సముద్రంలో వేట నిషేధ సమయంలో మత్స్యకారులు ఇబ్బందులు పడకూడదని ఒక్కో మృత్యాకార కుటుంబానికి రూ.20,000 ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రేపు శ్రీకాకుళం జిల్లా, ఎచ్చెర్ల నియోజకవర్గం, బుడగట్లపాలెం గ్రామంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ‘మత్స్యకారుల సేవలో...’ పథకాన్ని ప్రారంభించనున్నారు. దీంతో 12 తీర ప్రాంత జిల్లాల్లో సముద్రం వేటపై జీవిస్తున్న 1,29,178 కుటుంబాలకు ఆర్ధికంగా రూ. 258 కోట్ల ప్రయోజనం కలుగుతుంది. కూటమి ప్రభుత్వం మత్స్యకారులకు, ఆక్వారంగానికి ఎప్పుడూ అండగా ఉంటుందన్న నమ్మకాన్ని ఈ పథకాన్ని తిరిగి ప్రవేశ పెట్టడం ద్వారా నిజం చేసింది.
ఇచ్చిన మాట నిలబెట్టుకుంది
వేట విరామ సమయంలో గత ప్రభుత్వం ఒక్కో మత్స్యకార కుటుంబానికి రూ.10,000 మాత్రమే ఇచ్చింది. ఎన్నికల ఏడాదిలో అది కూడా ఇవ్వలేదు. 2 నెలల పాటు సముద్రంలో వేటకు వెళ్లకుండా, విరామం ఇవ్వడంతో మత్స్యకార కుటుంబాలకు ఆర్ధికంగా ఇబ్బందికరమైన పరిస్థితి తలెత్తుతుంది. దీనిని అర్థం చేసుకుని ఎన్నికలకు ముందే మత్స్యకారులకు ఆర్ధిక సాయాన్ని రూ.10,000 నుంచి రూ.20,000కు పెంచుతామని ఎన్డీఏ కూటమి మ్యానిఫెస్టోలో చెప్పింది. నాడు మాట ఇచ్చినట్టుగానే... నేడు దానిని నెరవేర్చింది.
మత్స్యకారులకు ఆర్ధిక సాయం ప్రవేశ పెట్టింది చంద్రబాబే:
రాష్ట్ర విభజన అనంతరం 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ ప్రభుత్వం వేట నిషేధ సమయంలో మత్స్యకార కుటుంబాలకు తొలిసారిగా భృతిని ప్రవేశ పెట్టింది. 2014-2019 మధ్య మత్స్యకారుల సంక్షేమం కోసం రూ.788 కోట్లు ఖర్చు పెట్టింది. అంతేకాకుండా వలలు, పడవలు, ఐస్ బాక్సులు అదనంగా ఇచ్చింది. మత్స్యకారుల పిల్లలకు ప్రత్యేకంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పశ్చిమగోదావరి, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో 6 రెసిడెన్షియల్ పాఠశాలు ఏర్పాటు చేసింది.
10 నెలల పాలనలో మరింత సాయం
2024లో మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం ఆక్వారంగం అభివృద్ధికి, మత్స్యకారుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ వచ్చింది. స్వర్ణాంధ్ర-2047 విజన్ లక్ష్యాన్ని చేరుకునేందుకు ఆక్వారంగాన్ని గ్రోత్ ఇంజిన్గా ఎంచుకుంది. రాష్ట్రంలో 68,396 మంది మత్స్యకారులకు నెలనెలా పింఛన్లు ఇస్తోంది. 18 నుంచి 60 ఏళ్లలోపు వయసున్న మత్స్యకారులు... చేపల వేట సమయంలో మరణిస్తే రూ.10 లక్షలు ఎక్స్గ్రేషియో చెల్లిస్తోంది. ఇప్పటికే గతేడాది చనిపోయిన 63 మంది మత్స్యకారుల కుటుంబాలకు సాయం అందించింది. మరో 80 కుటుంబాలకు త్వరలోనే సాయం చేయనుంది. ఈ ఏడాది ఇందుకోసం రూ.8 కోట్లు కేటాయించింది.
డీజిల్పై రూ.9 సబ్సిడీ
వేటకు వెళ్లే బోట్లకు లీటర్ డీజిల్పై రూ.9 సబ్సిడీ ఇస్తోంది. మెకనైజ్డ్ బోట్లకు నెలకు 3,000 లీటర్లు, మోటరైజ్డ్ బోట్లకు నెలకు 300 లీటర్ల వరకు డీజిల్పై సబ్సిడీ అందిస్తోంది. ఈ ఏడాది అర్హత ఉన్న 23,062 బోట్లకు డీజిల్ సబ్సిడీ కోసం రూ.50 కోట్లు కేటాయించింది. మెకనైజ్డ్ బోట్లపై వేటకు వెళ్తున్న మత్స్య సోదరుల రక్షణ కోసం 3 నెలల్లో 4,484 బోట్లలో టూ వే కమ్యూనికేషన్ వ్యవస్థ తీసుకురానుంది. సాగర్మాల పథకం కింద రూ.97 కోట్లతో పులికాట్ సరస్సు దగ్గర చేపట్టే ప్రాజెక్టుతో ఆ ప్రాంతంలోని 20 వేల మత్య్సకార కుటుంబాలకు లబ్ది చేకూరనుంది.
కొత్తగా 9 ఫిషింగ్ హార్బర్లు.. 7 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు..
రూ.1,961 కోట్లతో కొత్తగా 9 ఫిషింగ్ హార్బర్లను రెండు దశల్లో రాష్ట్రంలో నిర్మిస్తోంది. అలాగే, వీటికి అదనంగా రూ.199 కోట్లతో 7 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు కూడా సిద్ధం చేస్తోంది. మత్స్యకార కుటుంబాలకు ఉపకరించేలా బాపట్ల జిల్లా నిజాంపట్నంలో ఆక్వాపార్క్ను రూ.88 కోట్లతో ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఆక్వాకల్చర్కు యూనిట్ విద్యుత్కు రూ.1.50 కే సరఫరా చేస్తోంది. 68,134 సర్వీస్ కనెక్షన్లకు రూ.1,187 కోట్లు ఖర్చు చేస్తోంది. ఇలా ఎన్నో కార్యక్రమాలు మత్స్యకారుల సంక్షేమం కోసం చేపడుతోంది.
10 నెలల్లో ఎన్నో మంచి కార్యక్రమాలు
• పింఛన్ల మొత్తాన్ని రూ.3,000 నుంచి రూ.4,000కు పెంచడమే కాకుండా... దేశంలో అత్యధిక మందికి పింఛన్లు ఇస్తున్న రాష్ట్రంగా ఏపీ ఘనత వహించింది.
• ప్రతీ నెలా 64 లక్షల మందికి పైగా పెన్షన్లు ఇస్తోంది. ఇందుకు నెలకు సుమారు రూ.2,700 కోట్లు ఖర్చు చేస్తోంది.
• పెన్షన్ తీసుకుంటూ భర్త చనిపోతే భార్యకు తక్షణం పెన్షన్ ఇవ్వాలని నిర్ణయం. ఇలా దాదాపు 90 వేల మందికి కొత్తగా పెన్షన్లు ఇచ్చేందుకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ మొదలు.
• దీపం-2 కింద కోటికి పైగా మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ల సరఫరా.
• ఉచిత ఇసుక సరఫరా వల్ల పేదలకు లబ్ది.., నిర్మాణ రంగానికి ఊతం...
• ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోనే రైతుల ఖాతాలో నగదు జమ.
• 16,347 ఉపాధ్యాయ నియామకాలకు DSC నోటిఫికేషన్ విడుదల.
• డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంపు.
• 8,427 పాస్టర్లకు నెలకు రూ.5,000 చొప్పున గౌరవవేతనం.
• అర్చకుల జీతాలు రూ. 10,000 నుంచి రూ. 15,000కు పెంపు.
• దూపదీప నైవేద్యం కింద ఆలయాలకు ఆర్ధిక సాయం రూ.5 వేల నుంచి రూ.10వేలకు పెంపు.
• ఉపాధి కోసం చూస్తున్న వేద విద్యార్ధులకు నెలకు రూ. 3 వేల నిరుద్యోగ భృతి.
• రాష్ట్రంలోని దేవాలయాల్లో పనిచేస్తున్న నాయీ బ్రాహ్మణులకు వేతనాన్ని రూ.20,000 నుంచి రూ.25,000కు గౌరవ వేతనం పెంపు.
• దేవాలయ బోర్డుల్లో బ్రాహ్మణులు, నాయీబ్రాహ్మణులకు చోటు.
• నూతన వక్ఫ్ బోర్డు ఏర్పాటు. ఇమామ్లకు రూ.10 వేలకు, మౌజన్లకు రూ.5 వేలకు గౌరవ వేతనాల పెంపు.
• రాష్ట్రంలో 200కు పైగా అన్న క్యాంటీన్లు ఏర్పాటు.
• చెత్త పన్ను రద్దు - చేనేతలకు జీఎస్టీ ఎత్తివేత.
• గీత కార్మికులకు 10 శాతం మద్యం షాపుల కేటాయింపు.
• రూ.25 లక్షలతో ప్రతి కుటుంబానికి ఆరోగ్య బీమా
• వాట్సప్ ద్వారా 250కి పైగా సేవలు.
• ఎస్సీ, ఎస్టీలకు ఉచితంగా, బీసీలకు అదనంగా రూ.20 వేల సబ్సిడీతో సోలార్ రూఫ్టాప్
• త్వరలో ఆదరణ-3, తల్లికి వందనం, అన్నదాత పథకాల అమలు.