ఎలక్ట్రానిక్ వ్యర్ధాలతో పిల్లలు, గర్భిణీలకు ప్రమాదం
ఎలక్ట్రానిక్ వ్యర్ధాలతో పిల్లలు, గర్భిణీలకు ప్రమాదం
వాటిని శాస్త్రీయంగా రీసైక్లింగ్ చేయడం ముఖ్యం
స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో జోనల్ ప్రత్యేక అధికారి బి.రాజశేఖర్
నగరంలో ఇ-వ్యర్ధాలపై ర్యాలీ, ప్రతిజ్ఞ
విజయనగరం, పీపుల్స్ మోటివేషన్:-
ఇళ్లు, కార్యాలయాలు, వాణిజ్య, వ్యాపార సంస్థల్లో పాడైన ఎలక్ట్రానిక్ పరికరాలు, వస్తువులను శాస్త్రీయ పద్ధతుల్లో తొలగించడం ఎంతో ముఖ్యమని ఉత్తరాంధ్ర జిల్లాల ప్రత్యేక అధికారి, రాష్ట్ర వ్యవసాయ, ఉద్యానశాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్ అన్నారు. ఈ వ్యర్ధాలను సరైన రీతిలో తొలగించకపోతే వాటి నుంచి వెలువడే రసాయనాలు పిల్లలు, గర్భిణీలకు ఎంతో ప్రమాదకరంగా పరిణమిస్తాయని చెప్పారు. ఇ-వ్యర్ధాలను శాస్త్రీయ విధానంలో తొలగించనట్లయితే వాటి నుంచి వెయ్యి రకాల ప్రమాదకర రసాయనాలు వెలువడతాయని, వాటిని పీల్చిన గర్భిణీలకు, వారి గర్భంలోని శిశువుకు ఇవి ఎంతో హానికలిగిస్తాయన్నారు. ప్రజల్లో ఇ-వ్యర్ధాల పై అవగాహన తక్కువగా వుందని, ఈ లక్ష్యంతోనే రాష్ట్ర ప్రభుత్వం స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఇ- వ్యర్ధాలపై ప్రజల్లో అవగాహన కల్పించడం, వాటిని సేకరించి శాస్త్రీయ పద్ధతుల్లో తొలగించేందుకు ప్రాధాన్యత ఇస్తోందన్నారు. మూడో శనివారం సందర్భంగా నగర పాలకసంస్థ ఆధ్వర్యంలో ఇ-వ్యర్ధాలపై నగరంలో శనివారం నిర్వహించిన ర్యాలీలో జోనల్ ప్రత్యేక అధికారి బి.రాజశేఖర్, జిల్లా కలెక్టర్ డా.బి.ఆర్.అంబేద్కర్ పాల్గొన్నారు. పైడితల్లి అమ్మవారి ఆలయం నుంచి కోట వరకు నిర్వహించిన ర్యాలీలో వారు విద్యార్ధులు, మహిళలతో కలసి పాల్గొన్నారు. అనంతరం కోట వద్ద విద్యార్ధులు, మహిళలతో స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేయించారు.
ఈ సందర్భంగా ప్రత్యేక అధికారి బి.రాజశేఖర్ మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా 2022 నాటికి 8 కోట్ల టన్నుల ఇ-వ్యర్ధాలు వున్నట్టు ప్రపంచ ఆరోగ్యసంస్థ తన నివేదికలో వెల్లడించిందని, ఇందులో ఇరవై మిలియన్ టన్నులు మాత్రమే రీసైక్లింగ్ జరుగుతున్నట్టు పేర్కొందని తెలిపారు. మిగిలిన ఇ-వ్యర్ధాలన్నీ అశాస్త్రీయ విధానంలోనే తొలగించడం జరుగుతోందని, ఇది మానవాళి మనుగడకే ప్రమాదకరమన్నారు. అభివృద్ధి చెందిన దేశాలు తమ దేశాల్లో ఉత్పత్తి అయిన ఇ-వ్యర్ధాలను అభివృద్ధి చెందుతున్న దేశాల్లోకి ఓడల ద్వారా పంపిస్తున్నాయని ఇది ఎంతో ఆందోళనకరమన్నారు. ప్రజలు తమ ఇళ్లలోని పాడైన ఎలక్ట్రానిక్ పరికరాలు, వ్యర్ధాలను నగర పాలకసంస్థ ఏర్పాటు చేసిన ఇ-వ్యర్ధాల సేకరణ కేంద్రంలో అందజేస్తే వాటిని సరైన రీతిలో రీసైక్లింగ్ చేసి ముప్పు లేకుండా తొలగించడం జరుగుతుందన్నారు. ఇ-వ్యర్ధాలను శాస్త్రీయంగా తొలగిస్తే వాటి నుంచి ఎంతో విలువైన బంగారం, వెండి, ప్లాటినం వంటి లోహాలను వెలికితీయవచ్చన్నారు.
మునిసిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో కోట వద్ద ఏర్పాటు చేసిన ఇ-వ్యర్ధాల సేకరణ కౌంటర్ను ప్రత్యేక అధికారి పరిశీలించారు. వాటిని ఎక్కడకు తరలించేదీ కమిషనర్ ను అడిగి తెలుసుకున్నారు.
కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డా.బి.ఆర్.అంబేద్కర్, మునిసిపల్ కమిషనర్ పి.నల్లనయ్య, ఆర్.డి.ఓ. కీర్తి, డి.ఆర్.డి.ఏ. ప్రాజెక్టు డైరక్టర్ కళ్యాణచక్రవర్తి, కాలుష్య నియంత్రణ మండలి ఇ.ఇ. బి.బి.సరిత తదితరులు పాల్గొన్నారు.
పైడితల్లి అమ్మవారిని దర్శించుకున్న ప్రత్యేక అధికారి
జిల్లాలో ఒక రోజు పర్యటన నిమిత్తం శనివారం విజయనగరం చేరుకున్న జోనల్ ప్రత్యేక అధికారి, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్ ముందుగా జిల్లాపరిషత్ అతిథిగృహానికి చేరుకున్నారు. అక్కడ జిల్లా కలెక్టర్ డా.బి.ఆర్.అంబేద్కర్ ఆయనకు సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం పైడితల్లి అమ్మవారి ఆలయాన్ని దర్శించారు. ఆలయం వద్ద కార్యనిర్వహణ అధికారి కె.ఎన్.వి.డి.వి. ప్రసాదరావు స్వాగతం పలికారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అమ్మవారి చిత్రపటాన్ని, ప్రసాదాలను అందజేశారు.