భావితరాలకు మార్గదర్శకులు కావాలి
భావితరాలకు మార్గదర్శకులు కావాలి
పదవ తరగతిలో అత్యధిక మార్కులను సాధించిన విద్యార్థులను అభినందించిన జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా
కర్నూలు, ఏప్రిల్ 26 (పీపుల్స్ మోటివేషన్):- విద్యార్థులు కష్టపడి చదువుకుని, ఉన్నత స్థానాలకు చేరుకుని, భావితరాలకు మార్గదర్శకులు కావాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా ఆకాంక్షించారు.
శనివారం ఉదయం కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్ లో కర్నూలు జిల్లాలో పదవ తరగతి పరీక్షలలో అత్యధిక మార్కులు సాధించిన ప్రభుత్వ , ప్రైవేటు పాఠశాలల 17 మంది విద్యార్థులను జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా సన్మానించారు. ఇందులో 600 మార్కులకు గాను 597 మార్కులు సాధించిన విద్యార్థులు 7మంది ఉన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ... మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు, వారిని ప్రోత్సహించిన తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలియచేశారు. ఈ సంవత్సరం పదవ తరగతిలోని విద్యార్థులు అందరూ ఉత్తీర్ణులు కావాలని ప్రత్యేకంగా కృషి చేశామని, అందు కోసం తీసుకున్న చర్యల వల్ల ఉత్తీర్ణత శాతం పెరిగిందని తెలిపారు. కర్నూలు జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల ఖాళీలు 2,700, హిందీ పండిట్ ఉపాధ్యాయుల ఖాళీల సంఖ్య 375 ఉన్నాయని, వీటితో పాటు వలసల సమస్య ఉండడం వల్ల ఉత్తీర్ణత శాతంలో వెనుకబడడం జరుగుతోందన్నారు. అయినప్పటికీ గత నాలుగు సంవత్సరాల తో పోల్చి చూస్తే ఈ సంవత్సరం 3% విద్యార్థులు అంటే 1,000 మంది విద్యార్థులు అధికంగా ఉత్తీర్ణత సాధించారని కలెక్టర్ తెలిపారు..జిల్లాలో 66 శాతం ఉత్తీర్ణత సాధించామని, ఉత్తీర్ణత సాధించిన అందరు విద్యార్థులకు కలెక్టర్ శుభాకాంక్షలు తెలిపారు..చిన్న టీకూరు గురుకుల పాఠశాలలో 65 మంది విద్యార్థులకు గాను 61 మంది విద్యార్థులకు జే
ఈ ఈ మెయిన్స్ సెలెక్ట్ కావడం అభినందనీయం అని కలెక్టర్ పేర్కొన్నారు.
పదవ తరగతి పరీక్షలలో ఉత్తీర్ణత కావడం కెరీర్ లో మొదటి అడుగు అని, విద్యార్థులు క్రమశిక్షణతో, కష్టపడి పై చదువుల పట్ల శ్రద్ధ వహించాలని, తల్లిదండ్రుల ఆశయాలకు అనుగుణంగా సంస్కారంతో ముందుకు సాగాలని కలెక్టర్ కోరారు. ఎన్ని ఆస్తులు ఉన్నా చదువు...సంస్కారమే ముఖ్యమని, ఇప్పటి నుండి మీరు ఏకాగ్రతతో చదువులు కొనసాగించాలని, పక్కదారులకు వెళ్లకూడదని, తల్లిదండ్రులు కూడా వీరిని గమనిస్తూ సూచనలు చేస్తూ వీరి భవిష్యత్తు ను తీర్చిదిద్దాలని కలెక్టర్ కోరారు.
పదవ తరగతి తర్వాత విద్యార్థులకు మంచి కెరీర్ ను ఎంచుకునేందుకు వీలుగా, పోటీ పరీకల్లో పాల్గొనడానికి "నైపుణ్య " అన్న పేరుతో హైదరాబాద్ 21 సెంచరీ ఐఏఎస్ అకాడమీ వారి ద్వారా 2 నెలల ఉచితంగా శిక్షణా తరగతులు ప్రారంభించామని కలెక్టర్ తెలిపారు. ఈ తరగతులను మనబడి కర్నూలు యూట్యూబ్ ఛానెల్ ద్వారా కూడా వీక్షించవచ్చని తెలిపారు. కష్టపడి మార్కులు సాధించిన విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు అందరికీ కలెక్టర్ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా కలెక్టర్ విద్యార్థులను అందరినీ సన్మానించి గ్రూప్ ఫోటో తీసుకున్నారు.
అంతకుముందు జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్ పాల్ మాట్లాడుతూ... జిల్లాలో 7 మంది విద్యార్థులు 600 మార్కులకు గాను 597 మార్కులు సాధించి జిల్లాను అగ్రభాగాన నిలిపారని తెలియజేశారు.
గురుకుల పాఠశాలల కోఆర్డినేటర్ శ్రీదేవి, జిల్లా అవినీతి నిరోధక శాఖ డిఎస్పి కృష్ణారెడ్డి మరియు పోటీ పరీక్షల నిర్వాకుడు గణేష్ విద్యార్థులకు భవిష్యత్తులో ఏ విధంగా సమాజానికి ఉపయోగపడే విధంగా వ్యవహరించాలని, ఏ విధమైన వ్యవహారం తో ఉండాలని, ఏ విధంగా భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలన్న విషయాలను తెలియజేసి విద్యార్థులకు మార్గదర్శనం చేశారు.
ఈ కార్యక్రమంలో డిఈఓ శామ్యూల్ పాల్, జిల్లా బి.సి. వెల్ఫేర్ అధికారి ప్రసూన, అవినీతి నిరోధక శాఖ డిఎస్పి కృష్ణారెడ్డి, ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలల కోఆర్డినేటర్ శ్రీదేవి , వెల్దుర్తి బిసి వెల్ఫేర్ హాస్టల్ ప్రిన్సిపల్ సబీనా, విద్యార్థుల తల్లిదండ్రులు, సంబంధిత పాఠశాలల హెడ్మాస్టర్ లు అధ్యాపకులు హాజరయ్యారు.