నసనకోట దుర్గమాంబ జాతర మహోత్సవాలు వైభవంగా ప్రారంభం
నసనకోట దుర్గమాంబ జాతర మహోత్సవాలు వైభవంగా ప్రారంభం
40లక్షలతో నిర్మించిన పలు కట్టడాలను ప్రారంభించిన ఎమ్మెల్యే పరిటాల సునీత, శ్రీరామ్
దుర్గమ్మ, ముత్యాలమ్మ అమ్మవార్ల ఊరేగింపు
హరియాన చెరువు నుంచి పాల కావడి ఊరేగింపు
నసనకోటలో అంతటా ఆధ్యాత్మిక వాతావరణం
రామగిరి:
శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి మండలం నసనకోటలో దుర్గమాంబ జాతర మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. దేవస్థానం వద్ద 40 లక్షల రూపాయల నిధులతో నిర్మించిన ప్రొటెక్షన్ వాల్ రైలింగ్ అదనపు సౌకర్యాలు నాగలకట్ట నిర్మాణాలను ఎమ్మెల్యే పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్ ప్రారంభించారు. చాలా ఏళ్ల తర్వాత జాతర మహోత్సవం నిర్వహిస్తుండటంతో నసనకోటతోపాటు చుట్టుపక్కల గ్రామాల్లో ఒక ఆధ్యాత్మిక వాతావరణం కనిపిస్తోంది. తొలి రోజు కార్యక్రమంలో భాగంగా దుర్గమ్మ, ముత్యాలమ్మ అమ్మవార్ల ఊరేగింపు వైభవంగా సాగింది. హరియాన్ చెరువు గ్రామం నుంచి పాల కావిడి ఊరేగింపు కూడా భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. శ్రీ అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాలలో భాగంగా స్వామివారికి జలధివాసము కార్యక్రమాన్ని నిర్వహించారు. మూడు రోజుల తర్వాత విగ్రహాన్ని పునఃప్రతిష్టించనున్నట్లు అర్చకులు తెలిపారు. అఖండ దీపారాధన, సభావందనము, గోపూజ, గంగపూజ, గణపతి పూజ, స్వస్తిపుణ్యాహవాచనము, శ్రీ అభయాంజనేయ స్వామికి జలాధివాసము వంటి కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. సాయంకాల వేదపారాయణము, శ్రీ లలితా సహస్ర పారాయణం వంటి కార్యక్రమాలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో ఎమ్మెల్యే పరిటాల సునీత మరియు శ్రీరామ్, సిద్దార్థ దంపతులతో పాటు పంచాయతీ పెద్దలు, ప్రజలు పెద్దఎత్తున పాల్గొన్నారు. నసనకోట గ్రామంలో చాలా ఏళ్ల తర్వాత ఈ ఉత్సవాలు జరుగుతుండటం చాలా సంతోషంగా ఉందని, ఐదు రోజులపాటు జరిగే ఉత్సవాల్లో భక్తులందరూ పాల్గొనాలని శ్రీరామ్, సునీత విజ్ఞప్తి చేశారు. ఉత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లన్నీ వారు దగ్గరుండి పర్యవేక్షించారు.
