వేరుశనగ విత్తన పంపిణీకి అన్ని విధాలా సిద్ధం కావాలి
వేరుశనగ విత్తన పంపిణీకి అన్ని విధాలా సిద్ధం కావాలి
కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్
వచ్చే ఖరీఫ్ నేపథ్యంలో వేరుశనగ విత్తన పంపిణీకి అన్ని విధాలా సిద్ధం కావాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు. బుధవారం అనంతపురం కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో ప్రైమరీ సెక్టర్ పై సంబంధిత శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఖరీఫ్ - 2025లో 50,592 క్వింటాల విత్తన వేరుశనగను పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. విత్తన పంపిణీకి సంబంధించి రోజువారి యాక్టివిటీలను తయారు చేయాలని, ఏ రోజు ఎక్కడ నిల్వ పెట్టాలి, పంపిణీ ఎప్పుడు చేపట్టాలనేది ప్రణాళిక రూపొందించాలన్నారు. కిసాన్ డ్రోన్స్ సిహెచ్సికి సంబంధించి జిల్లాలోని 31 మండలాల్లో 26 గ్రూపులను గుర్తించడం జరిగిందని, ఆయా గ్రూపులకు రుణాలు మంజూరయ్యేలా చూడాలన్నారు. కిసాన్ డ్రోన్లకు సంబంధించి రైతుల గ్రూపులను ఎంపిక చేయాలని, జిల్లాలో 35 డ్రోన్లను కేటాయించగా 26 గ్రూపులను ఎంపిక చేయడం జరిగిందని, మిగిలిన గ్రూపులను ఎంపిక చేసి, ఈనెలాఖరు డ్రోన్ల పంపిణీ పూర్తి కావాలని, ఇందులో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలన్నారు. అకాల వర్షాల వల్ల పంటలు నష్టపోయిన రైతులకు నష్టపరిహారం త్వరగా అందించేలా చూడాలన్నారు. హెచ్ఎన్ఎస్ఎస్ కాలవ ఇరువైపుల రైతులు ఉద్యాన పంటలు సాగుచేసేలా చూడాలని, ఇప్పటికి ఎంతమంది రైతులు ఉద్యాన పంటలను సాగు చేశారు అనే వివరాలను అందించాలని, కాలువ ఇరువైపులా మరింతమంది రైతులు ఉద్యాన పంటలు సాగు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. కాలువ గట్లపై టేకు మొక్కల బౌండరీ ప్లాంటేషన్ చేపట్టాలన్నారు.
ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి ఉమామహేశ్వరమ్మ, పశుసంవర్ధక శాఖ జెడి వెంకటస్వామి, హార్టికల్చర్ డిడి రఘునాథరెడ్డి, ఏడి ఫిరోజ్ ఖాన్, మార్కెటింగ్ ఏడి సత్యనారాయణ చౌదరి, డిసిఓ అరుణకుమారి, ప్రకృతి వ్యవసాయం డీపీఎం లక్ష్మానాయక్, ఎడిఎలు, ఏడి రాకేష్, ఏవో బాలు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.
