Mahanadu 2025: కడప మహానాడు సూపర్ సక్సెస్- టీడీపీ శ్రేణుల్లో ఫుల్ జోష్
Mahanadu 2025: కడప మహానాడు సూపర్ సక్సెస్- టీడీపీ శ్రేణుల్లో ఫుల్ జోష్
పార్టీ పెట్టిన తర్వాత తొలిసారి కడప నగరంలో నిర్వహించిన మహానాడు సూపర్ సక్సెస్ అని తెలుగు తమ్ముళ్లు అంటున్నారు. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన మహానాడులతో పోలిస్తే కడప మహానాడు బెస్ట్ అంటున్నారు వారు. కడపలో మహానాడు ఎనౌన్స్ చేసినప్పటి నుంచి చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించిన తెలుగుదేశం అధిష్టానం కొన్ని కీలకమైన మార్పులను ఈసారి తీసుకొచ్చింది. దానికి తోడు వాతావరణ పరిస్థితులు కూడా కలిసి రావడంతో మహానాడు కారణం అంటున్నారు ఆర్గనైజర్స్. వివరంగా చూస్తే కొన్ని ముఖ్యమైన కారణాలు కనిపిస్తాయి.
1) ఊకదంపుడు ప్రసంగాలకు చెక్
సాధారణంగా మహానాడు అంటేనే నేతల ప్రసంగాలతో నిండిపోతుంది. అధినేత దృష్టిలో పడాలని ప్రతీ నాయకుడూ వారిని పొగడ్తలతో ముంచుతూ ఊకదంపుడు ప్రసంగాలు చేస్తూ ఉంటారు. ఈసారి ఆర్గనైజర్స్ అలాంటి వాటికి చెక్ పెట్టారు. అధినేత చంద్రబాబు సహా వక్తలందరూ మహానాడు ఎజెండాకు మాత్రమే కట్టుబడి ఉన్నారు. మితిమీరిన పొగడ్తలు లేకుండా వారి ప్రసంగాలు సాగాయి.
2) నిర్వహణలో అడుగడుగునా కనిపించిన యువరక్తం
ఈసారి మహానాడు ఆర్గనైజింగ్ కమిటీల్లో ప్రధాన పాత్ర వహించింది ఎక్కువ శాతం యువకులే. ముఖ్యంగా లోకేష్ టీం ఈసారి ఆర్గనైజింగ్ బాధ్యతలు వహించింది. కడపలో తొలిసారి జరుగుతున్న మహానాడు కావడంతో ఎలాగైనా దీన్ని సక్సెస్ చేసేలా ఎక్కడా సమన్వయ లోపాలు లేకుండా జాగ్రత్త వహించారు. ఎక్కడికక్కడ వాలంటీర్లకు బాధ్యతలు అప్పజెప్తూ పోలీసులతో సమన్వయం చేసుకుంటూ పెద్ద సంఖ్యలో వచ్చిన టిడిపి కార్యకర్తలకు ఇబ్బంది లేకుండా చూసుకున్నారు. దీనికోసం సాంకేతిక సహాయం ఎక్కువగా వాడుకున్నారు.
3) టెక్నాలజీని బలంగా వాడుకున్న టీడీపీ
ఈసారి మహానాడులో టెక్నాలజీని బలంగా వాడుకున్నారు ఆర్గనైజర్స్. ఎంతెలా అంటే సంప్రదాయబద్దంగా ఎప్పుడూ ఏర్పాటు చేసే సీనియర్ ఎన్టీఆర్ ఫోటో గ్యాలరీ కూడా డిజిటల్ రూపంలో నిర్వహించారు. వాకీ టాకీలు డ్రోన్ల సాయంతో ఎక్కడ ఎవరికి ఇబ్బంది అనిపించినా వెంటనే అడ్రస్ చేస్తూ మూడు రోజుల పసుపు పండుగ సజావుగా సాగేలా జాగ్రత్తలు తీసుకున్నారు.
4) ట్రాఫిక్ సమస్యలు ఏర్పడకుండా జాగ్రత్తలు
ఇంతకుముందు జరిగిన వైజాగ్, రాజమండ్రి, విజయవాడ, ఒంగోలు మహానాడుల్లో ప్రధానంగా కనిపించిన సమస్య ట్రాఫిక్.అవన్నీ టౌన్కి దగ్గర్లోనో సిటీ మధ్యనో జరగడంతో సాధారణ ప్రజలు ట్రాఫిక్ సమస్యలు ఎదుర్కొనే వారు. కానీ కడపలో మాత్రం ఆ సమస్య ఎదురు కాలేదు. టౌన్కి ఏడు కిలోమీటర్ల దూరంలోని ఒక లూప్ లైన్లో మహానాడు ఏర్పాటు చేయడం వల్ల కడప ప్రజలు ఈ మూడు రోజులు ట్రాఫిక్ సమస్య వల్ల ఇబ్బందులు పడలేదు. ఈ మహానాడు ప్రత్యేకతల్లో ఇదొకటిగా చెప్పుకోవచ్చు.
5) అడుగడుగునా రాయలసీమకు ప్రాధాన్యం
ఈ మహానాడులో కడప, రాయలసీమ అభివృద్ధికి పెద్దపేట వేసేలా నేతల ప్రసంగాలు సాగాయి. కడప స్టీల్ ప్లాంట్ పనులు మరో 10 రోజుల్లో మొదలుపెడతామని చంద్రబాబు స్వయంగా హామీ ఇచ్చారు. అలాగే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పోలవరం బనకచర్ల నదుల అనుసంధానంపై మరోసారి భరోసా ఇచ్చారు. అంతేకాదు మహానాడు సంప్రదాయానికి వ్యతిరేకంగా భోజనాల్లో రాయలసీమ ప్రజల కోసం నాన్ వెజ్ ను చేర్చారు.
6) కలిసి వచ్చిన వాతావరణం
ఈసారి మహానాడు ఇంత సక్సెస్ కావడానికి ప్రధానమైన కారణం వాతావరణం. ఎన్టీఆర్ జన్మదినం మే 28 సందర్భంగా జరిగే మహానాడు ఎప్పుడూ వేసవి తాపానికి గురవుతూనే ఉంటుంది. రాజమండ్రి విజయవాడ ఒంగోలులో జరిగిన మహానాడు సమయంలో ఎండ వల్ల అందరూ తీవ్ర ఇబ్బందులు పాలయ్యారు. కానీ విచిత్రంగా ఈసారి కడప మహానాడుకు వాతావరణం పూర్తిగా అనుకూలించింది. 26వ తారీఖున వర్షం కురిసి నిర్వాహకులను భయపెట్టినా తర్వాత మూడు రోజులు ఆహ్లాదకర వాతావరణమే ఉండడంతో టిడిపి కార్యకర్తలు అందరూ చక్కటి వాతావరణంలో గడిపారు. వరుస స్పీచ్లు వినబడుతున్నా సభ ప్రాంగణం వదిలి ఎవరూ బయటికి వెళ్లలేదు. దానితో చివరి రోజున సభకు టిడిపి నేతలు ఊహించిన దానికంటే ఎక్కువ మంది పసుపు తమ్ముళ్లు బహిరంగ సభకు హాజరై మహానాడు ను సూపర్ సక్సెస్ చేశారని పార్టీ అధినాయకత్వం సంతృప్తి గా ఉంది.