10 రోజులు ముందుగానే లక్ష్యాన్ని దాటిన యోగాంధ్ర
10 రోజులు ముందుగానే లక్ష్యాన్ని దాటిన యోగాంధ్ర
2 కోట్లకు పైగా రిజిస్ట్రేషన్లు చేసుకున్న యోగాభిలాషులు
ప్రజా స్పందనపై హర్షం వెలిబుచ్చిన మంత్రి సత్యకుమార్ యాదవ్
రాష్ఠ్ర ప్రజల్లో యోగాభ్యాసం పట్ల అవగాహనను పెంచడానికి ప్రభుత్వం చేపట్టిన నెల రోజుల యోగాంధ్ర కార్యక్రమం 10 రోజులు ముందుగానే నిర్దేశించిన లక్ష్యాలను దాటి ముందుకు సాగుతోంది. జూన్ 21న జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలో మే 31న యోగాంధ్ర కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది.
జూన్ 21న విశాఖపట్నంలో జరిగే ప్రధాన కార్యక్రమంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా లక్షకు పైగా ఎంపిక చేసిన కేంద్రాంల్లో 2 కోట్ల మంది యోగాభిలాషులు పాల్గొనే దిశగా రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ మేరకు నెల రోజుల పాటు సాగే యోగాంధ్ర కార్యక్రమంలో రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు వీలు కల్పించారు. 2 కోట్ల రిజిస్ట్రేషన్ లక్ష్యాన్ని అధిగమించి జూన్ 10 రాత్రి వరకు 2,04,64,831 యోగాభిమానులు, యోగాసక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.
యోగా శిక్షకుల రిజిస్ట్రేషన్ మరియు వారి శిక్షణ, యోగా పోటీల నిర్వహణ, స్థలాల ఎంపికలో కూడా నెల రోజుల యోగాంధ్ర కార్యక్రమ లక్ష్యాలను దాటి ప్రగతి నమోదైంది. రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 21న యోగా కార్యక్రమాల్ని చేపట్టేందుకు ఇప్పటికే 1,36,175 ప్రాంతాల రిజిస్ట్రేషన్ జరిగింది.
రాష్ట్రంలో యోగా పట్ల వెల్లడవుతున్న భారీ ప్రజా స్పందనపై రాష్ట్ర వైద్యారోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ హర్షాన్ని వ్యక్తం చేశారు. దేశంలో యోగా వ్యాప్తిని ఉద్యమంలా చేపట్టి ప్రజలందరూ యోగాభ్యాసం చేసే దిశగా ప్రధాని నరేంద్ర మోడీ సంకల్పం సాకారమవడానికి, రాష్ట్రంలో ఈ దిశగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేస్తున్న కృషికి యోగాంధ్ర పట్ల ప్రజా స్పందన అద్దం పడుతోందని మంత్రి తెలిపారు.
జూన్ 10 రాత్రి వరకు జరిగిన యోగాంధ్ర కార్యక్రమ ప్రగతి వివరాల్ని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మరియు యోగాంధ్ర రాష్ట్ర నోడల్ అధికారి ఎం.టి.కృష్ణబాబు మంత్రి నారా లోకేష్ నేతృత్వంలోని మంత్రుల కమిటీకి నివేదించారు.
జిల్లాకొక ఇతివృత్తం ఆధారంగా చేపట్టిన యోగా కార్యక్రమాలు ఇప్పటి వరకు 16 జిల్లాల్లో జరిగాయి. గుర్తించబడిన 100 పర్యాటక కేంద్రాల్లో ఇప్పటివరకు 62 చోట్ల యోగా కార్యక్రమాల్ని నిర్వహించారు.