ప్రజా పంపిణీలో అక్రమాలు నిరోధించేందుకే రేషన్ షాపుల పునరుద్దరణ
ప్రజా పంపిణీలో అక్రమాలు నిరోధించేందుకే రేషన్ షాపుల పునరుద్దరణ
@ 65 ఏళ్లు పైబడిన వారికి ఇంటికే రేషన్ అందించేందుకు ఏర్పాట్లు
@ బొండపల్లిలో రేషన్ షాపులు ప్రారంభించిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్
విజయనగరం(బొండపల్లి), జూన్ 01
ప్రజాపంపిణీ వ్యవస్థలో అక్రమాలు నిరోధించేందుకే రాష్ట్ర ప్రభుత్వం రేషన్ షాపుల ద్వారా నిత్యావసరాల పంపిణీని చేపట్టాలని నిర్ణయించిందని రాష్ట్ర చిన్న,మధ్యతరహా పరిశ్రమలు, సెర్ప్, ఎన్నారై వ్యవహారాల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. ప్రజాభిప్రాయం తెలుసుకున్న తర్వాత, ప్రజలంతా పాత పద్దతిలోనే రేషన్ సరుకులు పంపిణీ చేయాలని కోరిన మీదట ఈ వ్యవస్థ పునరుద్దరించాలని నిర్ణయించామన్నారు. గతంలో ఎండిఎం వాహనాల పేరుతో రేషన్ పంపిణీలో అక్రమాలకు అవకాశం ఏర్పడిందని, అందువల్లే వాటి స్థానంలో రేషన్ షాపులను పునరుద్దరించామన్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంలో భాగంగా జిల్లాలోని బొండపల్లి మండలంలో నూతన రేషన్ షాపుల ప్రారంభోత్సవంలో ఆదివారం మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ 65 ఏళ్ల పైబడిన వారికి ఇంటి వద్దకే రేషన్ డీలర్లు సరుకులను తీసుకెళ్లి అందజేస్తారని చెప్పారు. ప్రతి నెలలో ఐదో తేదీ లోపల వృద్ధులకు ఇంటికే రేషన్ సరుకులు తీసుకువెళ్లి అందజేయాలని ఆదేశించామన్నారు. జిల్లాలో 65,906 మంది వృద్దులకు ఇంటివద్దకే సరుకులు అందజేస్తామన్నారు. జిల్లా వ్యాప్తంగా 1249 రేషన్ షాపులను నేడు ప్రారంభిస్తున్నామని, ఈ షాపుల ద్వారా 5,71,358 మంది కార్డుదారులకు రేషన్ సరఫరా చేస్తామన్నారు. రేషన్ షాపుల ద్వారా ప్రతినెలా 1 నుంచి 15వ తేదీలోగా సరుకులు సరఫరా చేయాలని డీలర్లకు ఆదేశాలిచ్చామని, ప్రతిరోజూ ఉదయం 8 నుంచి 12 వరకు, సాయంత్రం 4 నుంచి 8 గంటల వరకు రేషన్ షాపులు తెరచివుంచి సరుకులు అందించేందుకు చర్యలు చేపడతున్నట్టు పేర్కొన్నారు.
రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకునేందుకు, ప్రస్తుతం వున్న కార్డుల్లో సవరణలకు అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయించిందని, దీనిలో భాగంగా అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు జారీ చేస్తామన్నారు. ప్రజా సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి వుందని, దీనిలో భాగంగా ఈ నెలలోనే తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ కార్యక్రమాలను ప్రారంభించనున్నట్టు వెల్లడించారు.
అన్ని రేషన్ షాపుల వద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి దానిపై క్యూ.ఆర్.కోడ్ ఏర్పాటు చేస్తున్నామని, మొబైల్ ఫోన్ ద్వారా దీనిని స్కాన్ చేసి రేషన్ సరఫరాపై కార్డుదారులు తమ అభిప్రాయాన్ని తెలియజేయవచ్చని డి.ఎస్.ఓ. మదుసూధనరావు చెప్పారు.
ఈ కార్యక్రమాల్లో జిల్లా పౌరసరఫరాల అధికారి మదుసూధనరావు, ఇన్ చార్జి తహశీల్దార్ వి.రాజేశ్వరరావు, ఏఎంసి ఛైర్మన్ గోపాలరాజు, తెలుగుదేశం నాయకులు గంట్యాడ శ్రీదేవి, మక్కువ శ్రీధర్, బండారు బాలాజీ, కోరాడ కృష్ణ, ఎన్.రాజేష్ తదితరులు పాల్గొన్నారు.