చరిత్రలో నిలిచిపోయేలా మసులా ఉత్సవాలు
చరిత్రలో నిలిచిపోయేలా మసులా ఉత్సవాలు
మచిలీపట్నం జూన్ 2:
ఈనెల 5 నుండి 8 వ తేదీ వరకు మంగినపూడి బీచ్ లో మసులా ఉత్సవాలను చరిత్రలో నిలిచిపోయే విధంగా అత్యద్భుతంగా నిర్వహిస్తామని రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర పేర్కొన్నారు.
సోమవారం మధ్యాహ్నం మంత్రివర్యులు జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, జిల్లా ఎస్పీ ఆర్ గంగాధర్ రావుతో కలిసి నగరంలోని జిల్లా పరిషత్ కన్వెన్షన్ హాలులో మసుల ఉత్సవాల ఏర్పాట్లపై పాత్రికేయుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రివర్యులు మాట్లాడుతూ ప్రభుత్వ యంత్రాంగం ఈనెల 5, 6, 7, 8 తేదీలలో 4 రోజులపాటు మంగినపూడి బీచ్ లో మసుల ఫెస్ట్ 2025 నిర్వహిస్తున్నామన్నారు.
భారతదేశంలోనే అతిపెద్ద ఉత్సవంగా పర్యాటక పురోభివృద్ధి దిశగా అత్యద్భుతంగా తీర్చిదిద్దుతున్నామన్నారు
ఈ ఉత్సవాల్లో భాగంగా జల క్రీడలు, సాహస క్రీడలు, వినోద కార్యక్రమాలు, బీచ్ వాలీబాల్, బీచ్ కబడ్డీ వంటి జాతీయ క్రీడలు ఏర్పాటు చేస్తున్నామన్నారు.
పోటీలలో 24 రాష్ట్రాల నుండి స్త్రీ, పురుష క్రీడాకారుల బృందాలు పాల్గొంటున్నాయన్నారు.
కయాకింగ్ జల క్రీడలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే తొలిసారిగా మంగినపూడి బీచ్ లో నిర్వహిస్తున్నామన్నారు.
జాతీయస్థాయి పోటీలలో పాల్గొనేందుకు వివిధ రాష్ట్రాల నుండి ఉత్తమ క్రీడాకారులు 2000 మంది వస్తున్నారన్నారు.
ఈనెల 5 వ తేదీన ఉదయం 9 గంటలకు మసులా వుత్సవాలు ప్రారంభిస్తామని, అందులో భాగంగా 60 అడుగుల అమరావతి అసెంబ్లీ టవర్ ను పోలి ఉన్న ముఖద్వార నిర్మాణాన్ని తొలుత ప్రారంభిస్తామన్నారు.
తదుపరి 100 అడుగుల జాతీయ పతాకాన్ని ఎగురవేసి జెండా వందనం చేస్తామన్నారు.
అదే రోజు సాయంత్రం వివిధ రకాల ప్రదర్శనశాలలు ప్రారంభిస్తామన్నారు.
ఈ ఉత్సవాల్లో పాల్గొనేందుకు రాష్ట్రస్థాయిలో పలువురు ప్రముఖులు రాబోతున్నారన్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రిని, ఉప ముఖ్యమంత్రిని, ఇతర ప్రముఖులను, వివిధ రాష్ట్రాల ప్రముఖులను ఉత్సవాలకు ఆహ్వానించామన్నారు.
ఈనెల 3 వ తేదీ మంగళవారం ఉదయం 9 గంటలకు కోనేరు సెంటర్ నుండి లక్ష్మీ టాకీస్ వరకు 2 కిలోమీటర్ల పరుగు నిర్వహిస్తున్నామన్నారు.
ఈ పరుగులో భైరవం చిత్ర యూనిట్ నారా రోహిత్, మంచు మనోజ్ , బెల్లంకొండ సాయి శ్రీనివాస్, దర్శకులు పాల్గొంటున్నారన్నారు.
వినోద కార్యక్రమాలు ఈనెల 6 వ తేదీ సాయంత్రం నుండి మొదలవుతాయన్నారు. ప్రముఖ సంగీత కళాకారులు, సినిమా కళాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారన్నారు.
తెలుగు సంస్కృతి ప్రతిబింబించే విధంగా కలంకారి వస్త్రాలు, ఏటికొప్పాక వస్తువులతో పాటు 100 ప్రదర్శనశాలలు ఏర్పాటు చేస్తున్నామన్నారు.
దేశంలోని వివిధ ప్రాంతాల ఆహారపు అలవాట్లకు తగ్గట్టుగా పలు రకాల వంటకాలను ప్రదర్శనశాలల్లో ఏర్పాటు చేస్తామన్నారు.
ఉత్సవాలకు వచ్చే పర్యాటకులకు రాకపోకలకుగాను ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు పక్కాగా చేస్తామన్నారు
ఈసారి పోలీసులను ఎక్కువగా వినియోగించి సీసీ కెమెరాలు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ప్రణాళిక బద్ధంగా రాకపోకలను నియంత్రిస్తామన్నారు
ఒక సమాచార కేంద్రాన్ని ఏర్పాటు చేసి ప్రజలు ముఖ్యంగా పర్యాటకులకు ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందించే ఏర్పాటు చేస్తామన్నారు.
ఉత్సవాల్లో 25 వీడియో కెమెరాలు, వినియోగించి అత్యద్భుతంగా ప్రత్యక్ష ప్రసారం ఏర్పాటు చేస్తున్నామన్నారు.
సముద్ర సారం చేసే పర్యాటకులకు ఎలాంటి ప్రమాదం సంభవించకుండా మెరైన్, పోలీసు, మత్స్యశాఖల సంయుక్త ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన సురక్షితమైన ఏర్పాటు చేస్తున్నామన్నారు.
ఈ ఉత్సవాలతో ఈ ప్రాంతం లో (జిడిపి) స్థూల ఆదాయ ఉత్పత్తి పెంచుకునే అవకాశం ఉందన్నారు.
మచిలీపట్నం నగరంలోని అన్ని హోటల్స్, వివిధ రకాల సంఘాలు, మీడియా ప్రతినిధులు పుర ప్రముఖులు అందరూ కూడా ఒక సంఘంగా ఏర్పడి ఉత్సవాలను జయప్రదం చేయాలన్నారు.
జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మాట్లాడుతూ మసుల ఉత్సవాలను ఎంతో ఘనంగా వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
కయా కింగ్ ,బీచ్ కబడి వంటి జాతీయ క్రీడలు సాహస క్రీడలు, జల క్రీడలు, హెలి రైడింగులు ఏర్పాటు చేస్తున్నామన్నారు.
జిల్లా ప్రజలకు జాతీయ క్రీడలు తిలకించే మంచి అవకాశం లభించిందన్నారు.
ప్రతిరోజు సాయంత్రం అన్ని రకాల సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయన్నారు.
ముఖ్యంగా కూచిపూడి వంటి శాస్త్రీయ నృత్యాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు.
కలంకారి చేనేత వస్త్రాలు ఏర్పాటు చేస్తున్నామని తద్వారా చేనేతలకు మంచి మార్కెటింగ్ లభిస్తుందన్నారు.
జిల్లా ఎస్పీ గంగాధర్ రావు మాట్లాడుతూ ఉత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు. మొత్తం 1000 మంది పోలీసులు బందోబస్తు విధుల్లో నియమిస్తున్నామన్నారు. మంగినపూడి బీచ్ పరిసరాలను పూర్తిగా పరిశీలించి వాహనాల రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ముందస్తుగా పక్కా ప్రణాళిక, రూట్ మ్యాప్ సిద్ధం చేశామన్నారు.
మొత్తం 4 చోట్ల పార్కింగ్ ప్రదేశాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రజల అవగాహన కోసం వాహనాల రూట్ మ్యాప్ ముందుగా పత్రికలకు విడుదల చేస్తామన్నారు. అమరావతి ముఖద్వారం ఐకానిక్ నిర్మాణం, 100 అడుగుల జాతీయ పతాకము ఏర్పాటు బీచ్ ఉత్సవాలతో ప్రతి వారాంతపు సెలవు రోజుల్లో రాష్ట్రంలో ప్రముఖ పర్యాటక కేంద్రంగా వెలుగొందుతుందన్నారు.
ఈ బీచ్ ఉత్సవాలు అందరి మదిలో జీవితాంతం గుర్తుండిపోయే విధంగా అన్ని విధాలా కృషి చేస్తుందన్నారు.
బీచ్ కు వచ్చే వారందరూ మన అతిధులని వారికి సాధార పూర్వకంగా ఆహ్వానం పలికి అతిథ్యం ఇవ్వాల్సి ఉందన్నారు.
ఈ సమావేశంలో మెప్మా పీడీ సాయిబాబు, తహసిల్దారు హరినాథ్, జిల్లా గ్రంధాలయ సంస్థ మాజీ చైర్మన్ గొర్రెపాటి గోపీచంద్, జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గోపు సత్యనారాయణ, స్థానిక ప్రముఖులు కుంచే దుర్గాప్రసాద్, రొండి కృష్ణ, డాక్టర్ ధన్వంతరాచారి, ఆర్ట్ డైరెక్టర్ రమణ వంక తదితర అధికారులు అనధికారులు పాల్గొన్నారు.