ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి
ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి
- ట్యాంకర్ లారీని వెనుక నుంచి ఢీకొన్న కారు..
- రాజమహేంద్రవరం నుంచి కాకినాడ వైపు వెళ్తుండగా ప్రమాదం..
- భారీగా నిలిచిన వాహనాల రాకపోకలు..
- ఉప ముఖ్యమంత్రి, మంత్రులు లోకేశ్, రాంప్రసాద్ రెడ్డి, కందుల దుర్గేష్ దిగ్భ్రాంతి
తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం వడిశలేరు సమీపంలో రాజమహేంద్రవరం కాకినాడ ఏడీబీ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. పాల ట్యాంకర్ను వెనుక నుంచి కారు ఢీ కొట్టడంతో ఐదుగురు మృకి చెందగా ఇద్దరు గాయపడ్డారు. ఈ ప్రమాదంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేశ్, మండవల్లి రాంప్రసాద్ రెడ్డి, కందుల దుర్గేష్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
వేగంగా వెనక నుంచి లారీని ఢీ..
వివరాల్లోకి వెళ్తే జిల్లాలోని రాజానగరం మండలం రఘుదేవపురం, రాజమహేంద్రవరం కలవచర్లకు చెందిన 2 కుటుంబాలు కాకినాడలోని ఎన్టీఆర్ బీచ్కి వెళ్లి తిరిగి స్వస్థలాలకు వస్తున్నారు. ఏడీబీ రహదారి నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో వెనక నుంచి కారు వేగంగా లారీని ఢీకొట్టింది.
ఈ దుర్ఘటనలో రాజానగరం మండలం రఘునాథపురంకు చెందిన రేలంగి శివన్నారాయణ (40), భార్య దేవి లలిత (34) కుమార్తె వర్షిత (13), రాజమహేంద్రవరం సమీపంలోని కవలగొయ్యికి చెందిన తీగిరెడ్డి శివ (30), కుమార్తె సాన్వి(4) అక్కడికక్కడే మృతి చెందారు. తీగిరెడ్డి భవాని (26), రేలంగి హర్షిత (13) గాయపడ్డారు. వీరిని రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృత దేహాలను రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
దుర్ఘటన బాధాకరం- మంత్రి లోకేశ్
రోడ్డు ప్రమాదంలో ఐదుగురు వ్యక్తులు దుర్మరణం పాలవడం తీవ్రంగా కలచివేసిందని మంత్రి లోకేశ్ తెలిపారు. రాజమహేంద్రవరం నుంచి కాకినాడకు కారులో వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకోవడం బాధాకరమన్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. రోడ్డు ప్రమాదాల పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలని కోరారు. మృతుల కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఏడీబీ రోడ్డుపై ప్రమాదం దురదృష్టకరం- ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
రాజమండ్రి – కాకినాడ ఏడీబీ రోడ్డుపై వడిశలేరు వద్ద చోటు చేసుకున్న ప్రమాదం లో అయిదుగురు దుర్మరణం పాలయ్యారని తెలిసి చింతిస్తున్నాను. ఈ ప్రమాదం దురదృష్టకరమైనది. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. ఏడీబీ రహదారి పునర్నిర్మాణ పనులు వేగవంతం చేయాలని ఇప్పటికే సంబంధిత శాఖలకు, జిల్లా అధికారులకు దిశానిర్దేశం చేయడమైనది.
తూ.గో జిల్లాలో రోడ్డు ప్రమాద ఘటనపై మంత్రి కందుల దుర్గేష్ దిగ్భ్రాంతి
తూర్పు గోదావరి జిల్లాలో సోమవారం రాత్రి చోటుచేసుకున్న రోడ్డు ప్రమాద ఘటనపై మంత్రి కందుల దుర్గేష్ దిగ్భ్రాంతి చెందారు. సమాచారం తెలిసిన వెంటనే అప్రమత్తమైన మంత్రి దుర్గేష్ హుటాహుటిన రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లారు.విగతజీవులై ఉన్న మృతదేహాలను పరిశీలించి బాధిత కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. తరుచు రోడ్డు ప్రమాద ఘటనలు,గోదావరిలో మునిగి పలువురు మృతి చెందుతుండటం శోచనీయమని ఆవేదన వ్యక్తం చేశారు. రంగంపేట మండలం వడిశలేరు సమీపంలో రోడ్డు మలుపు కనిపించకపోవడంతో ప్రమాదం సంభవించిందన్నారు. ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు అక్కడికక్కడే చనిపోయారని, మరో ఇద్దరికి గాయాలయ్యాయని తెలిపారు.ఘటనలో చిన్నారులు చనిపోవడం మనసు కలిచివేసిందన్నారు.బాధిత కుటుంబాలను ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.స్థానిక సాయి ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఘటనాస్థలం నుండే వైద్య సిబ్బందికి, అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మృతదేహాలకు పోస్టుమార్టం ప్రక్రియ త్వరితగతిన చేయాలని ఆదేశించారు.తరుచు రోడ్డు ప్రమాదాలు జరగకుండా యాక్షన్ ప్లాన్ తయారు చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. భవిష్యత్ లో రోడ్డు ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకునేలా నిర్ణయాలు చేస్తామన్నారు. జనసేన సభ్యత్వం ఉన్న వారికి పార్టీ తరపున సాయం అందించేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం-మంత్రి మండిపల్లి రాంప్రసాద్
ఈ ఘటనపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వ పరంగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యాధికారులను ఆదేశించారు. ఘటనలు పునరావృత్తంకాకుండా పటిష్ట భద్రతా చర్యలు తీసుకోవాలని రవాణా అధికారులకు తెలిపారు. బాధిత కుటుంబాలకు అవసరమైన అన్ని సహాయాలు అందిస్తామన్నారు.