యోగాంధ్ర గొప్ప క్రతువు
యోగాంధ్ర గొప్ప క్రతువు
- జూన్ 21న అత్యంత ప్రతిష్టాత్మకంగా యోగా దినోత్సవం
- భారతదేశ చరిత్రలో నిలిచేలా దాదాపు 5 లక్షల మందితో కార్యక్రమం
- రాష్ట్రవ్యాప్తంగా 2 కోట్ల మంది పాల్గొంటారని అంచనా
- జూన్ 21 అనంతరం యోగా కొనసాగింపు
- 9వ తరగతి పాఠ్యాంశాల్లో యోగా అభ్యసనం
- ప్రతి ఒక్కరి జీవితంలో యోగా అంతర్భాగం చేసుకోవాలి
- పెందుర్తి నియోజకవర్గంలోని జనసేన పార్టీ కార్యాలయంలో మంత్రి కందుల దుర్గేష్ వెల్లడి
పెందుర్తి: జూన్ 21న రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న అంతర్జాతీయ యోగా దినోత్సవానికి విశాఖ బీచ్ రోడ్డులో ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. 11వ అంతర్జాతీయ యోగాంధ్ర -2025 దినోత్సవం పురస్కరించుకొని గురువారం పెందుర్తి నియోజకవర్గంలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఉమ్మడి ఎన్ డీఏ మహాకూటమి నాయకుల సమావేశంలో మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా యోగా ఆవశ్యకతను, యోగా దినోత్సవ ఏర్పాట్లను వివరించారు. యోగా డేను ఒక్కరోజుకే పరిమితం చేయకుండా యోగా గొప్పతనాన్ని ప్రజలందరికీ వివరించి అన్ని వర్గాల ప్రజలు జీవితంలో భాగం చేసుకునేలా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేతృత్వంలో పలు కార్యక్రమాలు చేపట్టిందన్నారు. సీఎం సూచనల మేరకు జూన్ 21 తర్వాత యోగా కార్యక్రమాన్ని కొనసాగిస్తామన్నారు. యోగా ప్రతి ఒక్కరి జీవితంలో అంతర్భాగం కావాలని ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ జూన్ 21 న ఉదయం 7 గంటల నుండి 8 గంటల వరకు విశాఖలోని ఆర్కే బీచ్ పొడవునా దాదాపు 5 లక్షల మందితో యోగా సాధన కార్యక్రమం ఉంటుందన్నారు. తద్వారా రికార్డు నెలకొల్పుతామన్నారు. అదే సమయంలో రాష్ట్రంలోని ప్రతి గ్రామం, పట్టణం, నగరాల్లో 2 కోట్ల మంది యోగా సాధన చేసేలా ఏర్పాట్లు చేశామన్నారు. యోగాలో పాల్గొనే వారికి యోగా మ్యాట్, టీ షర్ట్ అందిస్తామన్నారు. ఉదయం 6 గం.లకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ, సీఎం చంద్రబాబునాయుడు ప్రసంగిస్తారని తెలిపారు. ఈ క్రమంలో తెల్లవారుఝామున 5.30 గం.లకే యోగా చేసే వారు వేదిక వద్దకు చేరుకోవాలన్నారు. యోగా వేదిక వద్ద కంపార్ట్ మెంట్లను కేటాయించామని, ఎవరికి ఏ కంపార్ట్ మెంట్ కేటాయించారో తెలుసుకొని ఆ నెంబర్ వాళ్లు వెళ్లే బస్సు పైన రాయడం జరుగుతుందన్నారు. ఈ క్రమంలో 30-40 కంపార్ట్ మెంట్లను చూడాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. ఇప్పటికే బస్సుల్లో వచ్చే వారికి తిరిగి సురక్షితంగా గమ్యస్థానాలకు వెళ్లేవరకు అన్ని ఏర్పాట్లు సక్రమంగా చేశామన్నారు. రేపు యోగా డేకు సంబంధించిన రిహార్సల్ కార్యక్రమం ఉంటుందన్నారు. ప్రపంచానికి యోగాను పరిచయం చేసి భారతదేశాన్ని విశ్వగురుగా అందించిన నాయకులు ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. ఆయన చొరవతో దాదాపు 175 దేశాలకు యోగా చేరువైందన్నారు. ఈ ఏడాది ఏపీలో యోగా డేను నిర్వహించాలన్న ప్రధాని ఆకాంక్షల మేరకు కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున యోగా డే కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఇప్పటికే ప్రత్యేక కార్యాచరణ రూపొందించడం జరిగిందన్నారు.
ప్రపంచంలోనే యోగాకు ప్రత్యేక స్థానం ఉందన్న మంత్రి దుర్గేష్ యోగాను ప్రతి ఒక్కరూ జీవనశైలిలో భాగం చేసుకోవాలని తద్వారా శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలని సూచించారు.. జూన్ 21 తర్వాత 9వ తరగతి చదువుతున్న పిల్లలకి పాఠ్యాంశాల్లో యోగాను అంతర్భాగం చేయాలని ఆలోచిస్తున్నామన్నారు. యోగా ద్వారా మానసిక, శారీరక ఆనందం కలుగుతుందన్నారు. ఇప్పటికే మే 21 నుండి జూన్ 21 వరకు రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో యోగా డేను నిర్వహించామని తద్వారా ప్రజలందరినీ సన్నద్ధం చేశామని మంత్రి గుర్తుచేశారు. అన్ని నియోజకవర్గాల్లో యోగాను అభ్యసించే ఆవశ్యకతను తెలియజేశామన్నారు. కొన్ని ప్రాంతాల్లో జైల్లోని ఖైదీలు కూడా యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ఘటనలు చూశామన్నారు.
ఇటీవల తాను బెర్లిన్ పర్యటనకు వెళ్లినప్పడు అక్కడి ఇన్వెస్టర్లను ఆకర్షించే క్రమంలో ఏపీలో యోగా, వెల్ నెస్ సెంటర్ల ఏర్పాటుకు తాము ముందుకు వస్తామని యూరోపియన్లు తనతో అన్నట్లు మంత్రి దుర్గేష్ గుర్తుచేశారు. అడ్వెంచర్, ఎకో టూరిజం తమ దగ్గర కూడా ఉన్నాయని, ఏపీలోని సుదీర్ఘ సముద్రతీరంలో యోగా, వెల్ నెస్ సెంటర్లు వృద్ధి చేయాలని సూచించినట్లు తెలిపారు. ఇప్పటికే యోగా విషయమై దీర్ఘకాలిక ప్రణాళిక ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరూ యోగాలో పాలుపంచుకునేలా రాజకీయ నాయకులు, అధికారులు, సిబ్బంది కలిసి యోగా డే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు, కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.