ప్రియురాలని హత్య చేసిన కేసులో నిందితుడు అరెస్ట్
ప్రియురాలని హత్య చేసిన కేసులో నిందితుడు అరెస్ట్
- మీడియాకు వివరాలు వెల్లడించిన శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ వి.రత్న
- శ్రీ సత్యసాయి జిల్లా:
ప్రియురాలు మరొకరితో చనువుగా ఉంటూ నిత్యం ఫోన్లో మాట్లాడుతుందని అనుమానం పెంచుకున్న ప్రియుడు,ఎలాగైనా ఆమెను చంపాలని నిర్ణయించుకొని ఆమెను కడతేర్చాడు. ఈ కేసులో ఆమె ప్రియుడైన, ముద్దాయిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలిస్తున్నట్లు జిల్లా ఎస్పీ శ్రీమతి వి రత్న ఐపీఎస్ గారు తెలిపారు
జిల్లా పోలీస్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో ఆదివారం విలేకరుల సమావేశంలో పుట్టపర్తి డిఎస్పి విజయ్ కుమార్ తో కలిసి జిల్లా ఎస్పీ గారు కేసు వివరాలను వెల్లడించారు.
కేసు వివరాలు...
గాండ్లపెంట మండలం సాదులవాండ్లపల్లికి చెందిన ఆంజినేయులు, సరస్వతి (35) దంపతులు. భర్తతో విభేదాలు రావడంతో, కోర్టులో విడాకులకు దరఖాస్తు చేసుకున్నారు. ఆమె తన ఇద్దరు కుమా రులను తీసుకుని ఎనిమిదేళ్ల కిందట తలుపులకు వచ్చేసింది.
బలిజపేటలో నివాసముంటూ కూలి పనులు చేసుకొంటూ జీవనం సాగిస్తోంది.
ఈ క్రమంలో స్థానికంగా ఉండే బేల్దారి సికిందర్ తో పరిచయం ఏర్పడింది. అదికాస్తా వారిద్దరి మధ్య సహజీవనానికి దారితీసింది. ముద్దాయి బేల్దారి పని చేసుకుంటూ భార్యతోపాటు, సరస్వతి తో సహజీవనం కొనసాగించేవాడని,
అయితే ఆమె ఇటీవల మరొకరితో చనువుగా ఫోన్లో గంటల తరబడి మాట్లాడుతోందని అనుమానం పెంచుకున్న సికిందర్, పలు మార్లు గొడవపడ్డాడు.
అప్పటి నుంచి ఇద్దరి మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి. ఏప్రిల్ 22 ,న పిల్లలు కదిరిలో ఫంక్షన్కు వెళ్లారు. ఇదే అదనుగా భావించిన సికిందర్ ఇంట్లో ఒంటరిగా ఉన్న సరస్వతితో మరోమారు గొడవపడి.. నైలాన్ దారంతో గొంతుకు బిగించి ఊపిరాడకుండా చంపేశాడు. అదే రోజు మధ్యాహ్నం ద్విచక్రవాహనం లో తలుపుల గండి రోడ్డు సమీపంలో గల జమ్ముగడ్డవంక గడ్డ కింద పూడ్చేసి, రాళ్లు పేర్చేశాడు.
తనపై అనుమానం రాకుండా ఉండేందుకు సరస్వతి ఇంటికి యథావిధిగా రాకపోకలు సాగించేవాడు. నెలన్నర దాటినా తల్లి జాడ కనిపించకపోవడంతో పెద్దకు మారుడు తలుపుల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ హత్య కేసు పై జిల్లా ఎస్పీ గారు సీరియస్ గా తీసుకొని విచారణ చేపట్టి నిందితున్ని అరెస్టు చేయాలని పుట్టపర్తి డిఎస్పి విజయ్ కుమార్ గారికి ఆదేశించారు.
ఆదిశగా విచారణ చేపట్టిన పోలీసులు
అనుమానితునిగా ఉన్న సికిందర్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ముద్దాయి రాజంపేట వద్ద ఉన్నారన్న సమాచారం రావడంతో, పోలీసులు ముద్దాయిని అరెస్ట్ చేసేందుకు వెళ్ళగా, ఈ విషయం పసిగట్టిన ముద్దాయి నేరం అంగీకరించి, వెంటనే తలుపుల తహశీల్దార్ ఎదుట లొంగిపోవడం జరిగిందన్నారు. ముద్దాయి ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం, రికార్డు చేసిన తహశీల్దార్ తలుపుల ఎస్ఐకి ఈ కేసుకు సంబంధించిన వివరాలు ముద్దాయిని అప్పగించారు. ప్రియురాలైన సరస్వతిని ఎలా చంపారు అన్న కోణంలో విచారణ చేపట్టారు. ముద్దాయి తన నేరాన్ని అంగీకరిస్తూ సరస్వతిని నూలు తాడుతో మెడకు బిగించి హత్య చేయడం జరిగిందన్నారు. అనంతరం శవాన్ని తన మోటార్ బైక్ పై మూట కట్టుకొని తలుపుల గండి రోడ్డు సమీపంలో గల జమ్ముగడ్డివంక వద్ద గడ్డ కింద పూడ్చివేసినట్లు ముద్దాయి ఒప్పుకోవడం జరిగిందని తెలిపారు. హత్యకు ఉపయోగించిన పరికరాలు స్వాధీనం చేసుకోవడంతో పాటు ముద్దాయిని అరెస్టు చేసినట్లు ఎస్పీ గారు వెల్లడించారు.
అనుమతులు లేకుండా ధర్నాలు రాస్తారోకోలు చేపట్టరాదు.. జిల్లా ఎస్పీ గారు...
మీటింగులు సభలు ఏర్పాటు చేసుకోవాలంటే పోలీసుల అనుమతి తప్పనిసరిగా ఉండాలని జిల్లా ఎస్పీ శ్రీమతి వి.రత్న ఐపీఎస్ గారు సూచించారు. ఒక నేరం జరిగినప్పుడు అనుమతులు లేకుండా ఎటువంటి ధర్నాలు రాస్తారోకలు చేపట్టరాదని 30 యాక్ట్ అమలులో ఉంటుందని వీటిని ప్రతి ఒక్కరూ గమనించాలన్నారు. మహిళలు చిన్నారులతో పాటు తల్లిదండ్రి లేని పిల్లల పట్ల ఒంటరి మహిళల పట్ల జరిగే నేరాలను అరికట్టడానికి శక్తి టీంను ఏర్పాటు చేసి చురుకుగా పనిచేసేలా చూస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరూ ప్రభుత్వం ఏర్పాటుచేసిన శక్తి యాప్ ను వినియోగించుకోవాలని దీనితో చాలా వరకు నేరాలను ఆపవచ్చని అందుకోసం శక్తి యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. అంతేకాకుండా శక్తి వాట్సాప్ నెంబర్, 7993485111 ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చున్నారు. ఈ నెంబర్ 24 /7 ప్రజలకు అందుబాటులో ఉంటుందన్నారు. అదేవిధంగా డయల్ 100,112,1930,1098, నెంబర్లకు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చని ఎస్పీ గారు తెలిపారు. ప్రజలు కూడా తమ ఎదుట నేరం జరుగుతున్నప్పుడు వాటిని నివారించేందుకు వీలుగా బాధ్యతగా పోలీసులకు సమాచారం అందించాలన్నారు
మహిళలు బాలికల పట్ల జరుగుతున్న అఘాయిత్యాలను అడ్డుకట్ట వేయడానికి ప్రతి పాఠశాలలు, కళాశాలలతో పాటు మరియు హాస్టల్లో స్వీయ రక్షణ శిక్షణ( "సెల్ఫ్ డిఫెన్స్" ) కోర్సులు అమలు చేయడం జరుగుతుందని వాటి ద్వారా బాలికలు సాహసం నమ్మకం పెంచుకొని తమని రక్షించుకోవాలన్నారు.
ఫోక్సో కేసుల్లో బాధితుల వివరాలు వెల్లడించకూడదన్నారు. నేరస్తుల వివరాలను సేకరించడంలో పోలీసులకు సహకరించిన వ్యక్తుల పేర్లను గోప్యంగా ఉంచడంతో పాటు, వారికి గుర్తింపు ఇవ్వడం జరుగుతుందన్నారు. నేర నియంత్రణ పట్ల అవగాహన కల్పించుటకు ప్రతి ఒక్కరూ సహకరించాల్సి ఉందని ఎస్పీ కోరారు.
ఈ కార్యక్రమంలో పుట్టపర్తి డిఎస్పి విజయ్ కుమార్ , తలుపులు ఎస్సై నర్సింహులు సిబ్బంది పాల్గొన్నారు.