క్రమశిక్షణ, మంచి ఆలోచనలతోనే ఉజ్వల భవిష్యత్
క్రమశిక్షణ, మంచి ఆలోచనలతోనే ఉజ్వల భవిష్యత్
కష్టపడితేనే ఉన్నత లక్ష్యాలు సొంతమవుతాయి
రాష్ట్ర గృహనిర్మాణ, ఐ అండ్ పిఆర్ మంత్రి కొలుసు పార్థసారథి
ఘనంగా విద్యార్థిని విద్యార్థుల ప్రతిభా పురస్కారాల కార్యక్రమం
లక్ష్యం నిర్దేశించుకుని ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని విద్యార్థులకు మంత్రి పార్థసారధి పిలుపు
నెల్లూరు, జూన్ 1 : క్రమశిక్షణ, మంచి ఆలోచనతో ముందుకు సాగితే లక్ష్యాలు సాధించి ఉజ్వల భవిష్యత్ పొందవచ్చని, ప్రతిఒక్కరూ ఉన్నతస్థానాలు అధిరోహించవచ్చని రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార పౌర సంబంధాలశాఖ మంత్రి కొలుసు పార్థసారధి విద్యార్థులకు ఉద్బోధించారు.
ఆదివారం ఉదయం నెల్లూరు నగరంలోని కొండాయపాలెం గొలగమూడిరోడ్డులో గల యాదవ భవన్లో యాదవ ఉద్యోగులు, ప్రొఫెషనల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పదోతరగతిలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థిని , విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గృహనిర్మాణ, ఐ అండ్ పిఆర్ మంత్రి పార్థసారధి, రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్రావు, రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహయాదవ్, యాదవ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు మాదాల వెంకటేశ్వర్లు, పలువురు యాదవ సంఘ నేతలు హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి పార్థసారధి మాట్లాడుతూ యాదవ సంఘం ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందించి ప్రోత్సహించడం అభినందనీయమన్నారు. యాదవ విద్యార్థులతో పాటు ఇతర బీసీ, ఎస్సీ, ఎస్టీ కులాల్లోని ప్రతిభ గల విద్యార్థులను కూడా ప్రోత్సహించేందుకు యాదవ సంఘం నేతలు నిర్ణయం తీసుకోవడం సంతోషకరమైన విషయమన్నారు. ఒక వర్గానికే కాకుండా ప్రతిభ ఉన్న బడుగు బలహీన దళిత విద్యార్థులకు కూడా చేయూత ఇవ్వాలని నిర్ణయించడం, అందరిని కలుపుకుని సమాజాభివృద్ధికి కృషి చేయడం యాదవ సంఘం గొప్పతనానికి నిదర్శనంగా మంత్రి చెప్పారు.
యాదవులు ఆరాధ్య దైవం కృష్ణుడి అవతారాలు ప్రపంచానికి మార్గదర్శనం చేశాయని, ప్రపంచాన్ని జయించగల శక్తియుక్తులు కృష్ణతత్వంతో సాధ్యమన్నారు. ప్రతిఒక్కరూ కూడా కృష్ణుడి నుంచి స్ఫూర్తి పొంది సంస్కారవంతమైన ఆదర్శమైన జీవితాన్ని గడపాలని సూచించారు. ఏదీ కూడా కష్టపడకుండా ఊరికే రాదని, ప్రణాళికాబద్దంగా తెలివితో సాధన చేస్తే అన్ని అవరోధాలు తొలగి మంచి భవిష్యత్ లభిస్తుందన్నారు.
ఎందరికో మార్గదర్శకులు, పరిశ్రమల రంగంపై మంచి పట్టుగల చుక్కా కొండయ్యను స్ఫూర్తిగా తీసుకుని పారిశ్రామిక రంగాల వైపు పయనించేందుకు యువత ఆలోచనలు చేయాలన్నారు. రాష్ట్రప్రభుత్వం విద్యార్థులకు, యువత భవిష్యత్ కోసం ప్రణాళికాబద్ధంగా పరిశ్రమలను ఆహ్వానిస్తుందని, రాష్ట్రంలో యువనేత లోకేష్బాబు పరిశ్రమల ఏర్పాటుకు, ఉద్యోగ ఉపాధి కల్పనపై ప్రత్యేక శ్రద్ధపెట్టారని చెప్పారు. సమాజంలో ఉన్నతంగా ఎదిగేందుకు అనేక అవకాశాలు ప్రస్తుతం ఉన్నాయని, ప్రతిఒక్క అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలన్నారు.
యాదవ సంఘం అభివృద్ధికి తన సంపూర్ణ సహాయసహకారాలు అందిస్తామని చెప్పిన మంత్రి, యాదవ భవన్ పూర్తి చేసేందుకు తనవంతుగా రూ.లక్ష విరాళాన్ని అందించారు.
అనంతరం పదోతరగతి పరీక్షా ఫలితాల్లో మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు నగదు పురస్కారాలు, సర్టిఫికెట్లు, బ్యాగులను మంత్రి, ఎంపీ బీద మస్తాన్రావు అందించారు.
మంత్రి పార్థసారధిని యాదవ సంఘం నేతలు ఘనంగా సత్కరించారు.
తొలుత చుక్కా కొండయ్య, మాదాల వెంకటేశ్వర్లు, సుజాతమ్మ దంపతులను, యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహయాదవ్, పలువురు యాదవ సంఘ ప్రముఖులను మంత్రి, ఎంపీ ఘనంగా సత్కరించారు.
తొలుత విద్యార్థులు ప్రదర్శించిన నృత్యప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి.
ఈ కార్యక్రమంలో యాదవ సంఘ నేతలు, ఉద్యోగులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.