గత ప్రభుత్వంలో గంజాయికి అడ్డాగా తెనాలిని మార్చేశారు
గత ప్రభుత్వంలో గంజాయికి అడ్డాగా తెనాలిని మార్చేశారు
- రెండు గ్యాంగ్ లను సృష్టించి గంజాయి అమ్ముకునే హక్కు కల్పించారు
- గంజాయి మత్తులో ఆ గ్యాంగ్ లు అనేక అరాచకాలకు పాల్పడ్డారు
- ప్రజలు భయభ్రాంతులకి లోనయ్యారు
- దారి కాచి అకారణంగా దాడులు చేసేవారు
- గంజాయి ముఠాల వల్ల బాధితులకి జగన్ ఏం సమాధానం చెబుతారు?
- రాజకీయ లబ్ధి... సమాజంలో చీలికల కోసమే జగన్ తెనాలి పర్యటన
- గతంలో అమలాపురంలో ఇలాంటి అలజడే సృష్టించారు
- రెండు రోజుల్లో 35.81 లక్షల మందికి రేషన్ పంపిణీ
- విజయవాడలోని మీడియా సమావేశంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి Nadendla Manohar
‘ఎంతో చరిత్ర కలిగిన... కళల కాణాచిగా ఉన్న తెనాలిని గత వైసీపీ ప్రభుత్వం గంజాయికి అడ్డాగా మార్చేసింది. రెండు గ్యాంగ్ లను సృష్టించి ప్రాంతాలవారీగా గంజాయి అమ్ముకునే హక్కు కల్పించింది. గంజాయి మత్తులో ఈ గ్యాంగ్ లు సృష్టిస్తున్న అరాచకాలకు ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నార’ని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెనాలి పర్యటనతో రాద్ధాంతం సృష్టించి తద్వారా రాజకీయ లబ్ధి పొందాలని, సమాజంలో చీలికలు తేవాలని జగన్ చూస్తున్నారని మండిపడ్డారు. గంజాయి మత్తులో అరాచకాలు చేసే రౌడీ షీటర్లను పరామర్శించడానికి జగన్ వస్తున్నారా..? అంటూ సూటిగా ప్రశ్నించారు. శాంతి భద్రతలను కంట్రోల్ చేయాల్సింది పోలీసులేనని, తప్పు చేసిన వారికి కులం ఏమిటిని ప్రశ్నించారు. జగన్ వాస్తవాలు తెలుసుకుని తెనాలిలో పరామర్శకు రావాలని హితవు పలికారు. సోమవారం విజయవాడలో మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ “గంజాయి గ్యాంగ్ ల వల్ల తెనాలి ప్రజలు పడుతున్న ఇబ్బందులు, కష్టాలు తెలుసుకొని జగన్ పరామర్శకు రావాలి. గంజాయి మత్తులో ఆ గ్యాంగులు చేస్తున్న అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. వాళ్లలో వాళ్లు చంపుకోవడంతోపాటు ప్రజలపై దాడులకు పాల్పడుతున్నారు. ఈదర పూర్ణచంద్ అనే ఆదర్శ రైతు కుమారుడు కార్తీక్ ముంబయిలో సాఫ్ట్వేర్ ఇంజనీర్. గత ఏడాది మే 1వ తేదీన ఆ యువకుడు తెనాలి వచ్చి బైక్ మీద వెళ్తుంటే గంజాయి బ్యాచ్ అడ్డగించి దారుణంగా దాడి చేశారు.
గంజాయి గ్యాంగుల అండతో గత ఎమ్మెల్యే రెచ్చిపోయారు
గంజాయి గ్యాంగ్ లు తన పక్కన ఉన్నాయని గత వైసీపీ శాసనసభ్యుడు ఎంత అహంకారంతో మాట్లాడారో మనందరికి తెలుసు. తెనాలిలో ఎలక్షన్లను ఐదు నిమిషాల్లో ముగిస్తామని, కళ్లు మూసి తెరిచేలోపు మొత్తం పని ముగిస్తామని వ్యాఖ్యలు చేశారు. అందులో భాగంగానే పోలింగ్ బూత్ లో సుధాకర్ అనే ఓటరుపై విచక్షణ లేకుండా దాడి చేశారు. అలజడి సృష్టించాలని చూశారు. అయితే పోలీసులు, ఎన్నికల సిబ్బంది అప్రమత్తంగా ఉండటంతో ఆయన ప్లాన్ విఫలమయింది. గంజాయి మత్తులో ఆ గ్యాంగ్ లు ఎంతకైనా తెగిస్తున్నాయి. ఐతానగర్ ఏరియా లో ఇళ్లలోనే గంజాయి పెంచారు. తెనాలి దగ్గర్లో తేలప్రోలు ఉంది. అక్కడ ముస్లిం కుటుంబాలు ఎక్కువ. వారి పిల్లలు స్కూళ్లు, కాలేజీలకి వెళ్ళి రావాలంటే ఐతా నగర్ మీదుగా రాకపోకలు సాగించాలి. తేలప్రోలు ప్రజలు గంజాయి ముఠాలకి భయపడిపోయారు. కొల్లిపర మండలం వల్లభాపురం అనే ఊరు ప్రశాంతంగా ఉండేది. అక్కడా గంజాయి అమ్మి యువతను తప్పుదోవ పట్టించారు.
గంజాయి ముఠాలను పట్టుకోవడానికి వస్తే దాడులు
గంజాయి మూలాలు వెదుకుతూ స్మగ్లర్లను పట్టుకోవడానికి రాష్ట్రానికి వచ్చిన తెలంగాణ పోలీసులపై దాడి చేశారు. అదీ వైసీపీ అరాచక తీరు. వైసీపీ వాళ్లు శాంతి భద్రతలు అంటే లెక్కలేనట్లు వ్యవహరిస్తూ ఎంతోమందిని ఇబ్బందుల పాలు చేస్తున్నారు. గంజాయి నిర్మూలనకు ఏజెన్సీ ప్రాంతాల్లో పర్యటించి నిప్పుపెడితే... అటువంటి అధికారులను ట్రాన్స్ ఫర్ చేసిన చరిత్ర గత పాలకులది. ప్రశాంత వాతావరణంలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పని చేస్తుంటే... కావాలని లేనిపోని వివాదం సృష్టించి సమాజంలో చీలిక తీసుకురావాలని జగన్ చూస్తున్నారు. గతంలో అమలాపురంలో ఇలాంటి వివాదమే సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలని చూశారు. ఇప్పుడు తెనాలిలో కూడా అలాంటి పథకమే రచించారు. జగన్ ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకొని తన నిర్ణయాన్ని పున:పరిశీలించుకోవాలి.
34.81 లక్షల మందికి రేషన్ సరుకులు
ప్రజా పంపిణీ వ్యవస్థలో ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా పారదర్శకత ఉండాలనే ప్రభుత్వం రేషన్ దుకాణాల ద్వారా సరకుల పంపిణీ చేపడుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా గత రెండు రోజులుగా 29,760 రేషన్ దుకాణాల ద్వారా ఇప్పటి వరకు 34.81 లక్షల మందికి రేషన్ సరకులు అందించాం. 3.73 లక్షల మంది వృద్ధులు, దివ్యాంగులకు ఇంటింటికీ వెళ్లి రేషన్ సరకులు ఇచ్చాం. గత ఏడాది ఇదే సమయానికి అప్పటి ప్రభుత్వం 9260 ఎండీయూ వాహనాలతో 25.18 లక్షల మందికి మాత్రమే సరుకులు పంపిణీ చేసింది. వాళ్లతో పోల్చుకుంటే మనం 60 శాతం ఎక్కువగానే ఇచ్చాం. వృద్ధులు, దివ్యాంగులకు ఎవరూ రేషన్ షాపులకు రావాల్సిన అవసరం లేదు. ఈ నెల 5లోగా రేషన్ ఇంటికే ఇవ్వాలని డీలర్లను ఆదేశించాం. కొన్ని చౌక ధరల దుకాణాల వద్ద సర్వర్ సమస్యలు తలెత్తాయని తెలిసి, వెంటనే పరిష్కరించి పంపిణీ కొనసాగించాం. ప్రతి నెలా 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు రేషన్ దుకాణాలు తెరిచే ఉంటాయి. పనులు మానుకొని రేషన్ దుకాణాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. కార్డుదారులకు మరింత సౌకర్యం కల్పిస్తూ.. ఏ దుకాణానికైనా వెళ్లి రేషన్ తీసుకునేలా పోర్టబులిటీ తీసుకొచ్చాం. ఇందుకోసం ప్రతి డీలర్కు 10 శాతం ఎక్కువగా సరకులు సరఫరా చేశాం” అన్నారు.