రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

మాది పేదల కోసం పనిచేసే ప్రభుత్వం

General News telugu latest news telugu intresting news telugu intresting facts Job news health news TS TET TS DSC AP TET AP DSC Tenth Hall Tickets
Mounikadesk

మాది పేదల కోసం పనిచేసే ప్రభుత్వం

ఏడాదికి రూ.34 వేల కోట్లు పింఛన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీనే

3 గ్యాస్ సిలిండర్ల డబ్బులు అకౌంట్లో జమ చేస్తాం

జూన్‌లో అన్నదాత, తల్లికి వందనం పథకాలు ప్రారంభం

నరేగా పనులు పూర్తి చేసి గ్రామాల్లో వెలుగులు నింపుతాం

ఏపీలో సీబీఎన్ ఉన్నాడు...పెట్టుబడులతో రమ్మని పారిశ్రామికవేత్తలకు భరోసా ఇచ్చా

ప్రతినెలా 1వ తేదీ నుంచి 15 వరకు దుకాణాల ద్వారా రేషన్ పంపిణీ

దివ్యాంగులు, వృద్ధులకు ఇంటివద్దే అందజేత

రేషన్ వద్దనుకున్న వారికి డీబీటీ పద్దతిలో నగదు చెల్లింపు

గత పాలకులు స్కీముల పేరుతో స్కాములు చేశారు

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

ముమ్మిడివరం నియోజకవర్గం, చెయ్యేరులో పేదల సేవలో కార్యక్రమంలో పాల్గొన్న సీఎం

ఉపాధి హామీ శ్రామికులతో ముచ్చటించిన ముఖ్యమంత్రి

ముమ్మిడివరం మే 30  అధికారం చేపట్టిన 11 నెలల్లోనే కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకు సంక్షేమం అందిస్తున్నామని, ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తున్నామని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. దేశంలోనే ఏడాదికి రూ.34 వేల కోట్లు పింఛన్లకు ఖర్చు చేస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీనే అని, భగవంతుడు కనికరిస్తే భవిష్యత్‌లో పెన్షన్లు పెంచుతామని చెప్పారు. అవినీతి లేని వ్యవస్థకు శ్రీకారం చుట్టామన్నారు. గత పాలకులు స్కీముల పేరుతో స్కాములు చేశారని, రాజకీయ ముసుగులో నేరాలు-ఘోరాలకు పాల్పడ్డారని అన్నారు. ఇప్పుడు ప్రజా ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు కుట్రలు చేస్తున్నారని అన్నారు. తప్పు చేసే వారిని చండశాసనుడిలా వెంటాడుతానని అన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం చెయ్యేరులో పేదల సేవలో కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ శ్రామికులు రత్నమ్మ, మరియమ్మకు ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా పింఛన్లు అందజేశారు. అనంతరం ప్రజావేదిక బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. 

పింఛన్లతో పేదల కళ్లలో ఆనందం

మనది పేదల కోసం పనిచేసే ప్రభుత్వం. మన దేశంలో పింఛన్లు ప్రతి నెలా 64 లక్షల మందికి ఇస్తున్నాం. 1వ తేదీ ఆదివారం కావడంతో ఒకరోజు ముందుగానే పింఛన్లు అందించాం. గత ప్రభుత్వంలో ముక్కుతూ మూలుగుతూ పింఛన్లు ఇచ్చారు. రూ.200 పింఛన్ని రూ.2 వేలు చేసింది మన ప్రభుత్వమే. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు రూ.3,000 పింఛను రూ 4000 వేలు చేశాను. డయాలసిస్ రోగులకు రూ.10 వేలు ఇస్తున్నాం. మంచానికే పరిమితమైన వారికి రూ.15 వేలు పింఛను ఇస్తూ మానవత్వాన్ని నిరూపించుకున్నాం. ప్రతి నెలా ఒకటో తేదీన ఉద్యోగులకు జీతాలు ఇచ్చినట్టే పింఛన్లూ అందిస్తున్నాము. భగవంతుడు కనికరిస్తే భవిష్యత్‌లో పెన్షన్లు పెంచుతాం. భర్త చనిపోతే భార్య కు పెన్షన్ ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం. గత ప్రభుత్వంలో భర్త చనిపోతే భార్యకు వితంతు పింఛను ఇవ్వలేదు. నేడు 71,380 మందికి రూ. 4 వేలు అందించాము. భర్త చనిపోయిన వారు అనాథగా మిగిలిపోకూడదని ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. అలాగే ఈ నెలలో 2 నెలల పింఛను కలిపి తీసుకునే లబ్ధిదారులు 1,22,975 మంది ఉండగా, 3 నెలల ఫింఛను కలిపి తీసుకునేవారు 9176 మంది ఉన్నారు. వీరికి రూ.111.41 కోట్లను విడుదల చేశాము. మనకంటే ధనిక రాష్ట్రాలున్నాయి. వారికి ఆదాయమూ ఎక్కువ వస్తోంది. కానీ వారికంటే మనమే ఎక్కువ పింఛను ఇస్తున్నాం. మహారాష్ట్రకు దేశంలోనే అన్ని రాష్ట్రాలకంటే ఎక్కువ ఆదాయం వస్తున్నప్పటికీ వారు పింఛను కింద ఇచ్చేది రూ. 1000 మాత్రమే. తెలంగాణలో రూ. 2,500 ఇస్తున్నారు. ప్రతి ఇంటికీ పెద్ద కొడుకుగా ఉంటానని నేను చెప్పిన మాట నిలబెట్టుకున్నాను. ఏడాదిలో 100 రోజులు కష్టపడితే రూ. 30 వేలు వస్తాయి. నేను నెలకు రూ. 4 వేలు లెక్కన 12 నెలల్లో రూ. 48 వేలు ఇస్తున్నాను. వారికొచ్చే ఆదాయం కంటే నేనిచ్చే పింఛనే ఎక్కువ. 

దుకాణాల ద్వారా రేషన్ పంపిణీ

జూన్ 1 నుంచి రేషన్ దుకాణాల ద్వారా రేషన్ పంపిణీ చేయబోతున్నాము. దివ్యాంగులు, వృద్ధులకు ఇంటివద్దకే రేషన్ సరుకులు పంపిణీ చేస్తాము. రేషన్ వద్దనుకునే వారికి డీబీటీ పద్ధతిలో నగదు ఇస్తాము. గతంలో డోర్ డెలివరీ పేరిట ఇచ్చినట్లే ఇచ్చి మళ్లీ వాళ్లే తీసుకుని కాకినాడ పోర్టుకు తీసుకొచ్చి మాఫియా రాజ్యాన్ని నడిపారు. 

అండగా ఉండి ఆదుకుంటాం

కోనసీమలో వరి ఎక్కువ పండటంతో ఇక్కడి ప్రజలు ఎక్కువగా రైస్ తిని అనారోగ్యం పాలవుతున్నారు. డయాబెటీస్ వల్ల పోలిశెట్టి దుర్గాప్రసాద్ కాలు కోల్పోయాడు. అతనికి పింఛను మంజూరు చేస్తున్నాను. బీటెక్ చదివిన అతని కుమార్తె సత్య అనితకు ప్రభుత్వం తరపున రూ. లక్షా 50 వేలు , ఉద్యోగం ఇస్తాము. అలాగే బీఎస్సీ కంప్యూటర్స్ చేసిన సాయి లక్ష్మీ చంద్రకు కూడా ఉద్యోగం ఇచ్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. రాష్ట్రంలో 5 లక్షలమంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. దీనిపై మరింత శ్రద్ధ పెడతాము. 

నాలుగు నెలలకు ఒకసారి గ్యాస్ డబ్బులు

ఈ ఏడాది జూన్‌లో డీఎస్సీ ద్వారా 16,347 ఉపాధ్యాయ పోస్టులు భర్తి చేసి పోస్టింగులు ఇస్తాం. తల్లికి వందనం పథకం కింద ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ రూ.15 వేలు చొప్పున జమ చేస్తాం. అన్నదాత కింద అర్హులైన ప్రతి రైతుకూ ఏటా రూ.20 వేలు ఇస్తాం. మత్య్సకారుల పొట్టగొట్టే 217 జీవో రద్దు చేశాం. మత్సకారుల సేవలో భాగంగా రూ.20వేలు ఆర్థిక సాయం అందిస్తున్నాం. రూ.5 కే అన్నా క్యాంటీన్ల ద్వారా పేదలకు నాణ్యమైన ఆహారం అందిస్తున్నాం. త్వరలో నియోజకవర్గానికో అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేస్తాం. ఇప్పటికే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశాం. చేనేత ఉత్పత్తులపై జీఎస్టీ రీయింబర్స్ మెంట్ కు ఉత్తర్వులు ఇచ్చాం. పవర్ లూమ్ లకు 500, హ్యాండ్ లూమ్‌కు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నాము. స్వర్ణకారుల కార్పొరేషన్ ఏర్పాటు చేశాము. గీత కార్మికులకు 10 శాతం మద్యం దుకాణాలు కేటాయించాము. ఎస్సీ వర్గీకరణ ద్వారా సామాజిక న్యాయం సాధించాము. దేవాలయాల్లో బ్రాహ్మణులు, నాయూ బ్రాహ్మణులను పాలకమండళ్ల సభ్యులుగా నియమించాము. వేద విద్య అభ్యసించే నిరుద్యోగులకు యువగళం కింద నెలకు రూ.3 వేలు ఇస్తున్నాము. దీపం పథకం కింద ఆడబిడ్డలకు 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాము. ఇకపై ప్రతి నాలుగు నెలలకు ఒకసారి ఆడబిడ్డల అకౌంట్‌కే నేరుగా గ్యాస్ డబ్బులు జమ చేస్తాం. 

వెనకబడిన వర్గాలకు ఆర్థిక చేయూత

వెనకబడిన వర్గాల కోసం పనిచేసే పార్టీ తెలుగుదేశం. మొన్నటి బడ్జెట్ లో బీసీలకు రూ.47,456 వేల కోట్లు వీరి అభివృద్ధికి కేటాయించాము. అధికారంలోకి రాగానే ధాన్యం రైతులకు రూ.1,670 కోట్లు విడుదల చేశాం. ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లో రైతుల ఖాతాలకు డబ్బులు జమ చేస్తున్నాం. గత ప్రభుత్వంలో పంచాయతీలకు రూ.990 కోట్లు బకాయిలు పెట్టి పోయారు. ఆ డబ్బులు ఇచ్చి ఫైనాన్స్ కమిషన్ డబ్బులు తెచ్చాం. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఒక్క రోజులోనే అన్ని పంచాయతీల్లో పనులు ప్రారంభించారు. పల్లె పండుగ కింద రూ.4,500 కోట్లు వెచ్చించి 30 వేల పనులకు శ్రీకారం చుట్టాం. ఇప్పుడు మళ్లీ ప్రారంభిస్తున్నాం. వాట్సాప్ సేవలకు శ్రీకారం చుట్టాం. నరేగా పనులు పూర్తి చేసి గ్రామాల్లో వెలుగులు తెస్తున్నాం. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల 94 పథకాలకు కేంద్రం ఇచ్చిన డబ్బులు దారి మళ్లించి రాష్ట్రాన్ని బ్లాక్ లిస్ట్ లో పెట్టే పరిస్థితి తెచ్చారు. వీళ్లు దుర్వినియోగం చేసిన డబ్బులు తిరిగి చెల్లించి కేంద్ర పథకాలు పునరుద్ధరించాం. ప్రతి ఇంటిపై సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేసి విద్యుదుత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. సోలార్ రూఫ్ టాప్ పథకం కింద 35 లక్షల కుటుంబాలకు సౌర విద్యుత్ యూనిట్లు ఇవ్వాలనుకుంటున్నాం. అనుమతులు రాగానే ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 10 వేల సూర్యఘర్ యూనిట్లు ఇస్తాం. ఎస్సీ, ఎస్టీలకు 2 కిలోవాట్ల వరకు సౌర ప్యానెళ్లు ఉచితంగా ఇస్తాం. బీసీలకు కేంద్రం ఇచ్చే సబ్సిడీకి అదనంగా రూ.20 వేలు సమకూరుస్తాం. కరెంటు ఉత్పత్తి చేసుకుని ఎలక్ట్రికల్ వాహనాలు కూడా ఉపయోగించుకోవచ్చు. 

మహిళా భద్రతకు ప్రత్యేక చర్యలు

మహిళల భద్రతకు శక్తి టీం లు ఏర్పాటు చేశాం. గత ప్రభుత్వంలో గంజాయి, డ్రగ్స్ విచ్చలవిడిగా దొరికింది. డగ్స్ అమ్మినా, తీసుకున్నా తాటతీస్తాను. ఈగల్ వ్యవస్థ తెచ్చి కట్టడి చేశాం. గత ప్రభుత్వం ఐదేళ్లలో కనీసం ఒక్క రోడ్డు కూడా వేయలేదు. రాష్ట్రమంతటా రోడ్లపై గోతులు పెట్టి పోయారు. ఆ గోతులు పూడ్చేందుకు రూ.1,200 కోట్లు ఖర్చయింది. 20 వేల కిలోమీటర్ల రోడ్లు మరమ్మతులు చేశాం. గత ప్రభుత్వంలో చెత్త పైనా పన్ను వేశారుకానీ చెత్త మాత్రం తీయలేదు. మేం రాగానే చెత్త పన్ను రద్దు చేశాము. 83 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను ఈ ఏడాది అక్టోబర్ నాటికి తీసేస్తాం. ఆర్య వైశ్యుల ఇలవేల్పు కన్యకా పరమేశ్వరి ఆత్మార్పణ దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తున్నాం. అమరావతిలో ఐదు ఎకరాల్లో పొట్టి శ్రీరాములు విగ్రహం నెలకొల్పుతాం. టీచర్ల కు మేలు జరిగేందుకు 177 జీవో రద్దు చేశాం. పోలీసులకు రూ. 213 కోట్ల సరండర్ లీవ్ లకు డబ్బులు ఇచ్చాం. ఉద్యోగుల డబ్బులు, ప్రావిడెంట్ ఫండ్ లు గత పాలకులు వాడేసుకున్నారు. మేం అధికారంలోకి వచ్చాక రూ.7,500 కోట్లు చెల్లించాం. అంగన్వాడీ , ఆశాలకు రూ. లక్షా5 0 వేల మేర లబ్ధి చేకూర్చేలా గ్యాట్యుటీ ఇచ్చాం. నవజాత శిశువులు కోసం 11 వస్తువులతో ఎన్టీఆర్ బేబీ కిట్లు తెస్తున్నాం. యువత కోసం పెద్ద ఎత్తున పెట్టుబుడులు వస్తున్నాయి. 20 లక్షల ఉద్యోగాల హామీ నిలబెట్టుకుంటాను. ఏపీలో ఎలా పెట్టుబడులు పెట్టాలని ఢిల్లీలో పారిశ్రామికవేత్తలు అడిగారు. ఇక్కడ సీబీఎన్ ఉన్నాడు...రండి అని చెప్పాను. జనాభా తగ్గుదల ఆందోళన కలిగిస్తోంది. ప్రతి ఒక్కరూ ఇద్దరికంటే తక్కువ కాకుండా పిల్లల్ని కనాలి. 

కోనసీమ ఒకప్పుడు అందాలసీమ

కోనసీమ ఒకప్పుడు అందాలసీమ. ఇక్కడ తలసరి ఆదాయం తగ్గింది. తలసరి ఆదాయం, అభివృద్ధిలో కోనసీమ కంటే అనంతపురం ముందుంది. ఆక్వా పెంపకం, కొబ్బరి తోటల సాగుతో కొంత వరకే ఆదాయం వస్తోంది. పాడి పరిశ్రమలు కూడా అభివృద్ధి కావాలి. కోకో వేస్తే అదనపు ఆదాయం వస్తుంది. 90 వేల ఎకరాల్లో కొబ్బరి సాగువుతోంది. వీటిలో కోకో లేదా పశుగ్రాసం వేస్తే ఆదాయం రెట్టింపవుతుంది. కోనసీమ జిల్లాలో పేదలకు రెండు గేదెలు అందిస్తే వారు ఆర్థికంగా ఎంతోకొంత సంపాదించుకుంటారు. వీరికి సాయంపై చర్యలు తీసుకుంటాము. ఈ జిల్లాకు నా మిత్రుడు బాలయోగి గుర్తొస్తాడు. అతడు మామూలు కుటుంబంలో పుట్టి లా చేశాడు. దళితుడిని పార్లమెంటు స్పీకర్ చేసిన ఘనత టీడీపీదే . టీడీపీ అన్ని కులాలు, అన్ని వర్గాల పార్టీ. 1996లో గోదావరి తుఫాను సమయంలో నేను రాజమండ్రికి సచివాలయాన్ని తీసుకొచ్చి 15 రోజులు ఇక్కడి నుంచే పనిచేశాను. 

తప్పు చేస్తే తాట తీస్తా

ఇటీవల ఒక పాస్టర్ మరణాన్ని హత్యగా చిత్రీకరించి కొందరు విష ప్రచారం చేశారు. రాజకీయ ముసుగులో నేరాలు, ఘోరాలు చేయడం వారికి అలవాటుగా మారింది. బాబాయ్‌ని చంపి గుండెపోటుగా ప్రకారం చేసి తెల్లారేసరికి నారాసుర రక్త చరిత్రగా చిత్రీకరించి డ్రామాలాడారు. గత ప్రభుత్వంలో టీటీడీలో కూడా అరాచకాలు చేసి ఇప్పుడు మనమేదో విఫలమైనట్టు విష ప్రచారం చేస్తున్నారు. ఒకప్పుడు హైదరాబాద్ లో మత కల్లోలాలు సృష్టిస్తే టీడీపీ వచ్చాక మత సామరస్యాన్ని కాపాడింది. రాయలసీమలో ఎన్నికలు వస్తే బాంబులు అడిగేవారు. మేమొచ్చాక ఫ్యాక్షన్ జాడ లేకుండా చేశాం. అంబేద్కర్, ఎన్టీఆర్, రంగా విగ్రహాలనూ వదలకుండా విగ్రహాల రాజకీయం చేస్తున్నారు. ఆర్థిక ఉగ్రవాదులు సమాజాన్ని అతలాకుతలం చేద్దామనుకుంటున్నారు. వారి ఆటలు సాగనివ్వను.

గోదావరి మృతులు కుటుంబాలకు రూ.2 లక్షల సాయం

పల్లంకుర్రు, మూలపాడు బ్రిడ్జ్, ముమ్మిడివరం, కాట్రేని కూడా ఆర్ అండ్ బి రోడ్డు, గోగులంక బ్రిడ్జ్ నిర్మాణం చేపడతాము. కుండలేశ్వరం ఫ్లడ్ బ్యాంక్ ఆధునీకరణ పనులకు నిధులు మంజూరు చేస్తాం. చెయ్యేరు గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులు పూర్తి చేస్తాం. నియోజకవర్గంలో విద్యార్థినుల కోసం బీసీ రెసిడెన్షియల్ స్కూలు, కాలేజీ మంజూరు చేస్తున్నాను. ఇటీవల గోదావరిలో స్నానానికి వెళ్లి విద్యార్థుల మృతి బాధించింది. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల ఎక్స్ గ్రేషియా అందిస్తాము.  

పీ4తో పేదరిక నిర్మూలన

మడికి లక్ష్మి, చెయ్యేరు  నా భర్త కేన్సర్ తో చనిపోయాడు. నాకు ముగ్గురు ఆడపిల్లలు. నాకు సొంత ఇల్లు కూడా లేదు. పూట గడవడం కష్టంగా ఉంది. వితంతు పింఛను ఇప్పించి, ఇల్లు కట్టించండి.  

సీఎం  మడికి లక్ష్మి భర్త కేన్సర్ తో చనిపోవడం బాధిస్తోంది. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి. బిల్ గేట్స్ ఫౌండేషన్ ద్వారా బిల్ గేట్స్ ఫౌండేషన్ ద్వారా రాష్ట్రంలో విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో మెరుగైన సేవలకు ఒప్పందం కుదుర్చుకున్నాము. లక్ష్మి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది. ఆమెకు పెన్షన్ తో పాటు ఇల్లు కూడా కట్టించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. 

నాగేంద్ర రావు, మార్గదర్శి  మేము చిన్న కుటుంబం నుంచి వచ్చాము. ఆక్వాలో సంపాదించాము. పేదలకు సాయం చేయాలని అనుకుంటున్నాము. మడికి లక్ష్మి కుటుంబానికి ఆర్థిక చేయూత అందిస్తాము. ఆమె ముగ్గురు పిల్లల చదువు, వైద్య ఖర్చు లు నేను భరిస్తాను. 

సత్యవతి, చెయ్యేరు  నా భర్త ఇస్త్రీపని చేస్తాడు. మాకు ఉండటానికి ఇల్లు కూడా లేదు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుకుంటున్నాము. 

రామరాజు, మార్గదర్శి :  సత్యవతి కుటుంబానికి ఎటువంటి ఆర్థిక సాయం చేయడానికైనా మేము సిద్ధంగా ఉన్నాము. అలాగే మరో ఐదు కుటుంబాలను దత్తత తీసుకుని ఆర్థికంగా ఆదుకుంటాను.

Comments

-Advertisement-