కార్పొరేట్ కు ధీటుగా 'ఎంజేపీ'లు
కార్పొరేట్ కు ధీటుగా 'ఎంజేపీ'లు.
నెల్లిమర్ల/విజయనగరం : కార్పొరేట్ విద్యా సంస్థలకు ధీటుగా ఎంజేపీ బీసీ గురుకుల పాఠశాలలో విద్యా బోధన సాగిస్తున్నామని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. ఇటీవల విడుదలైన ఇంటర్, టెన్త్ ఫలితాల్లో ఎంజేపీ విద్యార్థులు అద్భుతమైన ప్రతిభ చాటారన్నారు.విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండల కేంద్రంలో ఉన్న ఎంజేపీ బీసీ బాలికల గురుకుల పాఠశాలను ఎమ్మెల్యే లోకం నాగ మాధవితో కలిసి మంత్రి సవిత పరిశీలించారు. ఈ సందర్భంగా గురుకుల పాఠశాలలో తరగతి గదులను, విశ్రాంతి గదులను, ల్యాబ్ ను పరిశీలించారు. విద్యార్థినులతో ముఖాముఖి మాట్లాడారు. తల్లికి వందనం, విద్యా మిత్ర కిట్లు అందాయా..? అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో మంత్రి సవిత మాట్లాడుతూ, విద్యాభివృద్ధికి కూటమి అధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో విద్యా వ్యవస్థలో పెను మార్పులు తీసుకొస్తున్నారన్నారు. యోగా ప్రతిరోజూ చేయాలని విద్యార్థినులకు సూచించారు. ఈ నెల 21న విశాఖలో నిర్వహించే యోగాంద్ర కార్యక్రమంలో ఎంతమంది విద్యార్థినులు పాల్గొనబోతున్నారని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థినులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు, యోగాసనాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, విద్యార్థినులు పాల్గొన్నారు.