ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొనేలా విపత్తు నిర్వహణ సంస్ధ బలోపేతం
ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొనేలా విపత్తు నిర్వహణ సంస్ధ బలోపేతం
ప్రకృతి వైపరీత్యాలను సమర్ధవంతంగా ఎదుర్కొని వీలైనంత వరకు ప్రాణ నష్టం, ఆస్ధి నష్టం జరగకుండా ఉండేలా తెలంగాణ డిజాస్టర్ మేనేజిమెంట్ అధారిటీ (తెలంగాణ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్ధ)ని బలోపేతం చేస్తున్నామని రాష్ట్ర రెవెన్యూ,హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. దేశానికి ఒక మోడల్గా ఉండేలా వ్యవస్ధను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఇందుకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర విపత్తు నిర్వహణా సంస్ధ (TGSDMA) ను పునర్వ్యవస్ధీకరించినట్లు వెల్లడించారు. ఈ సంస్ధకు గౌరవ ముఖ్యమంత్రి ఛైర్మన్గా ఉంటారని ఇందులో రెవెన్యూ, హోమ్, ఆర్ధిక, వైద్య ఆరోగ్యం, భారీ నీటిపారుదల, రహదారులు భవనాలు, పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖల మంత్రులు సభ్యులుగానూ, చీఫ్ సెక్రటర్ మెంబర్ కన్వీనర్గాను, రెవెన్యూశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ప్రత్యేక ఆహ్వానితునిగా ఉంటారని తెలిపారు.
బుధవారం రాష్ట్ర సచివాలయంలో గోదావరి మరియు కృష్ణా నదీ పరివాహక జిల్లాల్లో వరద నిర్వహణపై ఆయా జిల్లాల కలెక్టర్లు , ఇతర ఉన్నతాధికారులతో చీఫ్ సెక్రటరీ కె. రామకృష్ణారావు, విపత్తుల నిర్వహణ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్తో కలిసి సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రిగారు మాట్లాడుతూ "వాతావరణ మార్పుల వల్ల ఆకస్మికంగా వచ్చే వరదలు, వర్షాల సమాచారాన్ని ఐఎండీతో సమన్వయం చేసుకొని శాస్త్రీయంగా విశ్లేషించుకొని ఎప్పటికప్పుడు పై స్ధాయి నుంచి కింది స్ధాయి వరకు అందించేలా వ్యవస్ధను రూపొందించుకోవాలి.సమాచార వ్యవస్ధ మరింత బలోపేతం కావాలి.
రాష్ట్ర స్దాయిలో వర్షాలు, వరదలకు సంబంధం ఉన్న ఇరిగేషన్, విద్యుత్, హెల్త్, వ్యవసాయం, పోలీస్, రవాణా తదితర విభాగాలకు ప్రత్యేక నోడల్ అధికారులను నియమిస్తున్నాం. ప్రకృతి వైపరీత్యాలను మనం అడ్డుకోలేం కానీ వాటి ప్రభావాన్ని తగ్గించడానికి ముందస్తుగా పటిష్టమైన చర్యలు తీసుకుంటే నష్టాన్ని వీలైనంతవరకు తగ్గించగలుగుతాం. ప్రధానంగా కృష్ణా గోదావరి పరీవాహక ప్రాంతాల అధికార యంత్రాంగం వరద ముంపును ముందుగానే గుర్తించి ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి. దీనివలన మనం నష్టాన్ని తగ్గించినవారమవుతాం.
నదీపరివాహక ప్రాంతాల్లో ఏ మేరకు వరద ఉధృతి వస్తే ఏఏ గ్రామాలు ముంపునకు గురౌతాయోనన్న సమాచారాన్ని నీటిపారుదల శాఖ ముందుగానే అందించాలి. ఇతర రాష్ట్రాలలో వచ్చే వరద వివరాలు, స్ధానికంగా పడిన వర్షం వివరాలు, ఎంత నీటిని విడుదల చే్స్తారనే విషయాలు సవివరంగా ఉండాలి. నదీ పరివాహక ప్రాంతాల్లోని నివాసితులను వరదలు వచ్చిన ప్రతిసారీ సురక్షిత ప్రాంతాలకు తరలించడం కంటే వారికి శాశ్వత నివాసం కల్పించాలి. ఇందుకు సంబంధించి నివాసితుల వివరాలను గుర్తిస్తే అదనపు కోటా కింద ఇందిరమ్మ ఇండ్లను నిర్మించి ఇస్తాం."
భారీ వర్షాలు, వరదల సమయంలో వాగుల్లో వంకల్లో చెరువుల్లో చిక్కుకు్న్నవారిని రక్షించడానికి ఎయిర్ లిఫ్ట్ మెకానిజాన్ని సిద్దం చేసుకోవాలి. ఈ ఎయిర్ లిఫ్ట్ వ్యవస్ద సరిగా లేకపోవడం వల్ల గత ఏడాది నా నియోజకవర్గం పాలేరులో చిక్కుకున్న బాధితులను రక్షించుకోలేకపోయానని ఈ సందర్బంగా మంత్రిగారు ఆవేదన వ్యక్తం చేశారు. ఎయిర్ లిఫ్ట్ మెకానిజం ఏవిధంగా ఉండాలి, విపత్తు సంభవించిన ప్రాంతానికి ఏవిధంగా చేరుకోవాలి వంటి అంశాలపై అధ్యయనం చేయాలని అధికారులకు సూచించారు.
ఈ సమావేశంలో రాష్ట్ర విపత్తుల నిర్వహణ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్, సెక్రటరీ శివశంకర్, అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్ నాగిరెడ్డి, హైడ్రా కమీషనర్ రంగనాధ్, పంచాయితీరాజ్ కమీషనర్ సృజన, సిపి డిసిఎల్ డైరెక్టర్ ముష్రాఫ్ అలీ, వ్యవసాయ సహకార శాఖ డైరెక్టర్ బి. గోపి. ఐఎండీ అధికారిణి నాగరత్నం. సివిల్ సప్లయిస్ డైరెక్టర్ ముజముల్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.