ఈ ఏడాది 17.11 శాతం వృద్ధి రేటు లక్ష్యం
ఈ ఏడాది 17.11 శాతం వృద్ధి రేటు లక్ష్యం
- 2029కి 16.26 శాతం నమోదవుతుందని అంచనా
- ఇబ్బందులున్నా ఆర్థికంగా పరుగులు తీస్తున్న ఏపీ
- ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ వెల్లడి
అమరావతి: ఆర్థిక ఇబ్బందులున్నా రాష్ట్రం ఆర్థికంగా పరుగులు తీస్తోందని ఆర్థిక శాఖ వెల్లడించింది. ఆ ఈ ఆర్థిక సంవత్సరం 17.11 శాతం వృద్ధి రేటు సాధించాలన్నదే ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకున్నామని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ వెల్లడించారు. కలెక్టర్ల సదస్సులో భాగంగా సోమవారం రాష్ట్ర స్థూలోత్పత్తి (జీఎస్డీపీ)పైన ఆయన ప్రజంటేషన్ ఇచ్చారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో కేవలం 8.60 శాతం జీఎసడీపీ వృద్ధి రేటు నమోదు చేసుకున్న ఆంధ్రప్రదేశ్, ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో వృద్ది రేటు పరుగులు తీస్తోందని తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరం 17,11 శాతం వృద్ధిరేటు సాధించాలన్నదే లక్ష్యమని, అలాగే 2028-209 ఆర్థిక సంవత్సరానికి 16.26 శాతం వృద్ది రేటు నమోదవుతుందని అంచనా వేశారు. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలోనే 19.18 శాతం వృద్ధి రేటు సాధించిందని, ఇది ఆలిండియా వృద్ధి రేటు 8.8 శాతం కంటే మించి 10.50 శాతం సాధించామని తెలిపారు. మొదటి త్రేమాసికంలో వ్యవసాయ రంగం రూ.81,496 కోట్లతో 13.52 శాతం, పరిశ్రమల రంగం రూ.92,843 కోట్లతో 23.25 శాతం, సేవల రంగం రూ.1,57,321 కోట్లతో 22.14 శాతం వృద్ది రేటును నమోదు చేసుకుందన్నారు. గత ఆర్థిక సంవత్సరానికి ఈ సంవత్సరానికి మధ్య గణనీయమైన వృద్ది రేటు సాధించనున్నట్లు తెలిపారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.15,93,063 కోట్లతో 12.02 శాతం వృద్ది రేటు నమోదు చేసుకుంటే ఈ ఆర్థిక సంవత్సరం దానికంటే ఎక్కువగా 18,65,704 కోట్లతో 17.11 శాతం వృద్ది రేటు సాధించనున్నట్లు చెప్పారు. గ్రాస్ వేల్యూ యాడెడ్ (స్థూల విలువ జోడింపులో) గత ఏడాది 9.4 శాతం నమోదు కాగా, ఈ ఏడాది 10.76 శాతం నమోదైందన్నారు. తయారీ రంగంలో 10 శాతం వృద్ధి నమోదు చేస్తోందన్నారు. 2028-29 నాటికి ఈ వృద్ది రేటు దాదాపుగా 30వేల కోట్లకు చేరుకోనుందని తాము అంచనా వేస్తున్నట్లు చెప్పారు.
తొలిసారిగా మండల స్థాయిలోనూ వృద్ది రేటు మథింపు
రాష్ట్రంలో మొట్టమొదటి సారిగా ప్రణాళిక శాఖ జిల్లాల్లోని మండల స్థాయి వరకు కూడా వృద్ది రేటును మథింపు చేస్తూ జిల్లా స్థూల ఉత్పత్తి (గ్రాస్ డిస్ట్రిక్ట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ – జీడీడీపీ) విధానాన్ని ప్రారంభించామని తెలిపారు. జిల్లా కలెక్టర్లందరూ తప్పనిసరిగా తమ జిల్లాల్లోని వృద్ది రేటు వివరాలన్నీ కూడా ప్రతి నెలా మండల స్థాయిలో డేటా ఎంట్రీ 5వ తేదీలోపు జిల్లా స్థాయిలో 8వ తేదీలోపు పూర్తి చేయాలని, ప్రతి నెలా 15వ తేదీ ముఖ్యమంత్రి ఆయా జిల్లాలు సాధిస్తున్న జీఎస్డీపీ వృద్ది రేటు వివరాలను సమీక్షిస్తారని తెలిపారు. కాబట్టి జిల్లా కలెక్టర్లందరూ కూడా దీనిపైన ప్రత్యేక శ్రద్ద కనపరచాలని కోరారు.
పీ4లో 21 లక్షల కుటుంబాల గుర్తింపు
రాష్ట్రంలో పేదరిక నిర్మూలనలో భాగంగా ప్రభుత్వం చేపట్టిన పీ4 బంగారు కుటుంబం మార్గదర్శి కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే 21 లక్షల కుటుంబాలను గుర్తించామని అలాగే 10 లక్షల కుటుంబాలను అనుసంధానించామన్నారు.
సర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యాల సాధన లక్ష్యం
స్వర్ణాంధ్ర విజన్ 2047లో భాగంగా ఈ ఆర్థిక సంవత్సరం రూ.18.65 లక్షల జీఎస్డీపీ సాధించాలనేది లక్ష్యంగా పెట్టుకున్నామని పీయూష్ కుమార్ తెలిపారు. ఇందులోభాగంగా స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ ప్లాన్ సాధన కోసం జిల్లాకో ప్రత్యేక అధికారిని నియమించామన్నారు. 28 శాఖల్లో 512 కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ (కేపీఐ) రూపొందించి వాటి సాధిస్తున్న క్రమాన్ని మండల స్థాయిలో మదింపు చేస్తున్నామన్నారు. ఇందులో మొదటి ఐదు స్థానాల్లో పశ్చిమ గోదావరి, నంద్యాల, ఎన్టీఆర్, అనంతపురం, విశాఖపట్నం జిల్లాలు, అనంతపురం అర్బన్, రాయదుర్గ (అనంతపురం), నందిగామ, విజయవాడ వెస్ట్ (ఎన్టీఆర్ జిల్లా), పలాస (శ్రీకాకుళం) మండలాలు నిలిచాయన్నారు.
