ప్రభుత్వ సేవలను పారదర్శకంగా ముందుకు తీసుకెళ్తాం
ప్రభుత్వ సేవలను పారదర్శకంగా ముందుకు తీసుకెళ్తాం
జిల్లా కలెక్టర్ గా శ్యాం ప్రసాద్ పదవి బాధ్యతలు స్వీకరణ
పుట్టపర్తి, సెప్టెంబర్ 13:-
ప్రజా ప్రతినిధులు, అధికారులు, ప్రజల సహకారంతో ప్రభుత్వ సేవలను పారదర్శకంగా ముందుకు తీసుకెళ్లి జిల్లాను అన్ని విధాల అభివృద్ధి చేస్తానని జిల్లా కలెక్టర్ శ్యాం ప్రసాద్ పేర్కొన్నారు. శనివారం పుట్టపర్తి కలెక్టరేట్లోని తన చాంబర్లో నూతనంగా జిల్లా కలెక్టర్గా పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ను పలువురు అధికారులు, సిబ్బంది పరిచయం చేసుకొని శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా కలిసిన మీడియా విలేకరులతో జిల్లా కలెక్టర్ శ్యాం ప్రసాద్ మాట్లాడుతూ తాను పార్వతీపురం మన్యం జిల్లా నుండి కలెక్టర్ గా బదిలీ అయి శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించానన్నారు. సత్యసాయి జిల్లాతో తనకు అవినాభావ సంబంధం ఉందని, తన కుమార్తె విద్యాభ్యాసం కూడా ఇదే ప్రాంతంలో జరిగిందన్నారు. శ్రీసత్యసాయి జిల్లాలో రాబోయే వంద సంవత్సరాల శ్రీసత్య సాయిబాబా జన్మదినోత్సవ వేడుకలను కూడా విజయవంతంగా నిర్వహించేందుకు అందరూ సహకారం అందించాలని కలెక్టర్ కోరారు. కర్ణాటక రాష్ట్రానికి సమీపంలో ఉండి వెనుకబడిన శ్రీసత్యసాయి జిల్లాను అన్ని విధాల ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తానన్నారు. వ్యవసాయ ఆధారిత జిల్లా అయిన సత్య సాయి జిల్లాలో పారిశ్రామిక రంగానికి కూడా ఎక్కువ అవకాశాలు ఉన్నాయన్నారు. జిల్లాలో పరిశుభ్రత, నీటి సరఫరా, విద్యుత్, జల సంరక్షణ, ఆరోగ్యము విద్య తదితర ప్రధానమైన అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తానని తెలియజేశారు.
ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను మరింత సమర్థంగా అమలు చేసి ప్రజలకు చేరవేయడమే తన ముఖ్య లక్ష్యంగా ఉంటుందని తెలిపారు. ప్రభుత్వ ఆదేశాలు, అభిప్రాయాలకు ప్రాధాన్యత ఇస్తూ పారదర్శకంగా, బాధ్యతాయుతంగా పనిచేస్తానని కలెక్టర్ తెలిపారు. ప్రతి పౌరుడికి అవసరమైన సేవలను త్వరితగతిన అందించేందుకు కృషి చేస్తామని, సేవాభావంతో, పారదర్శకంగా పని చేస్తానని కలెక్టర్ స్పష్టం చేశారు.
పదవి బాధ్యతలు స్వీకరించిన అనంతరం కలెక్టర్ జిల్లా అధికారులను, సిబ్బందిని పరిచయం చేసుకుని, పరిపాలనను సమర్థంగా నడిపేందుకు అందరూ సహకరించాలని సూచించారు.
ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, ఇంఛార్జి డిఆర్ఓ రామసుబ్బయ్య, ఆర్డీవోలు సువర్ణ, మహేష్, వివిఎస్ శర్మ, ఆనంద్ కుమార్, జిల్లా అధికారులు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
