గత ప్రభుత్వ హయాంలో శాంతిభద్రతలు లేవు
గత ప్రభుత్వ హయాంలో శాంతిభద్రతలు లేవు
- గతంలో స్కూల్ పిల్లలకు గంజాయి పంపిణీ చేసే దుస్థితి
- సీఎం కఠినంగా వ్యవహరించడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది
- ఈగల్ విభాగం ద్వారా గంజాయిని కట్టడి చేశాం
- రాజకీయ ముసుగులో ఉన్న నేరగాళ్లు సోషల్ మీడియాలో రెచ్చిపోతున్నారు
- శాసనసభలో హోం మంత్రి అనిత
అమరావతి,సెప్టెంబర్ 25 :- రాష్ట్రంలో నేరాల నియంత్రణకు కఠిన చర్యలు తీసుకుంటున్నామని హోం మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. శాసనసభలో మాట్లాడిన ఆమె, గత ప్రభుత్వ హయాంలో శాంతిభద్రతలు లేనని, మద్యం ధరల భయంతో యువత గంజాయి వైపు మొగ్గుచూపిన దుస్థితిని గుర్తుచేశారు. అప్పట్లో స్కూల్ పిల్లలకే గంజాయి పంపిణీ చేసే దుస్థితి ఉండేదని, సీఎం చంద్రబాబు నాయుడు కఠినంగా వ్యవహరించడంతో పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చింది అని అన్నారు. గంజాయి మాఫియాను అరికట్టేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ‘ఈగల్’ విభాగం ద్వారా 40 వేలకు పైగా ఈగల్ క్లబ్స్ ఏర్పాటు చేశామని వెల్లడించారు.
నేరాలపై శాతం తగ్గుదల
జాతీయ స్థాయిలో వచ్చిన నివేదికల ప్రకారం రాష్ట్రంలో నేరాలు 60 శాతం మేరకు తగ్గాయని మంత్రి తెలిపారు. మహిళల భద్రత కోసం ప్రత్యేకంగా 'శక్తి' మొబైల్ యాప్ను తీసుకువచ్చాం. అలాగే న్యాయవ్యవస్థను పటిష్ఠం చేయడం వల్ల కేసుల్లో నిందితులకు శిక్షలు పడుతున్నాయి అని చెప్పారు.
ఫోరెన్సిక్ వ్యవస్థ పునరుద్ధరణ
గత పాలనలో ఫోరెన్సిక్ ప్రయోగశాల నిర్మాణాన్ని నిలిపివేశారు. మేము ప్రభుత్వంలోకి వచ్చేసరికి 25 వేల ఫోరెన్సిక్ నివేదికలు పెండింగ్లో ఉండగా, వాటిని 1600 కు తగ్గించాం. ఇది మా కట్టుబాటును చూపిస్తుంది అని అనిత పేర్కొన్నారు.
సోషల్ మీడియా ముప్పు పై ఆందోళన
రాజకీయ ముసుగులో ఉన్న నేరగాళ్లు సోషల్ మీడియాలో రెచ్చిపోతున్నారని, వారి ఉన్మాదం పరిశ్రమల అభివృద్ధికే అడ్డంకిగా మారిందన్నారు. సీఎం, డిప్యూటీ సీఎం పట్ల విద్వేష ప్రచారం జరుగుతోందని, కొందరు కులాల పేర్లు మార్చుకుని అసభ్య పోస్టులు పెడుతున్నారని తెలిపారు. పవన్ కళ్యాణ్ కుమార్తెపైనా అసభ్యంగా మాట్లాడటం దారుణమని చెప్పారు. ఈ తరహా సోషల్ మీడియా నేరాలను అరికట్టేందుకు చట్టాల్లో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని హోం మంత్రి హితవు పలికారు. ఆర్థిక నేరాలు, డిజిటల్ నేరాల నియంత్రణకు మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేశామని తెలిపారు.
రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని హోం మంత్రి స్పష్టం చేశారు.
