శాంతి భద్రతల పరిరక్షణే ధ్యేయం
శాంతి భద్రతల పరిరక్షణే ధ్యేయం
- 24 గంటలు అందుబాటులో ఉంటాం
- సైబర్ నేరాలపై అవగాహన
- మహిళల రక్షణకు పెద్ద పీఠ
- డ్రగ్స్ ఫ్రీ తిరుపతిగా మార్చేందుకు కృషి
- తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు
తిరుపతి
శాంతి భద్రతల పరిరక్షణే పోలీసుల ధ్యేయమని తిరుపతి జిల్లా ఎస్పీగా ఎల్. సుబ్బారాయుడు తెలియజేశారు. ఆదివారం మొదట తిరుమల లో శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఎస్పీ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మాట్లాడుతూ లా అండ్ ఆర్డర్ పటిష్టంగా ఉంచడమే పోలీసుల ధ్యేయమని, 24 గంటల పాటు అందుబాటులో ఉండి ప్రజలకు సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. జిల్లా ప్రజలు సమస్యలు ఉంటే నేరుగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని, పోలీస్ శాఖకు సహకరించాలన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలు చేయడంతో పాటు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారి పట్ల అత్యంత కఠినంగా ఉంటామన్నారు. విజిబుల్ పోలీసింగ్ ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. దేశంలోని అన్ని ప్రాంతాల నుండే కాకుండా ప్రపంచంలోని అన్ని దేశాల నుండి శ్రీవారిని దర్శించుకునేందుకు ప్రతినిత్యం వేలాది సంఖ్యలో భక్తులు వస్తారని, వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా పోలీస్ శాఖ చర్యలు చేపడుతుందన్నారు.
మహిళల రక్షణకు పెద్దపీట
జిల్లాలో మహిళల రక్షణ కోసం పటిష్టమైన చర్యలు చేపడతాం. మహిళలు బాలికల పట్ల జరుగుతున్న నేరాల నియంత్రణకు కృషి చేస్తాం. షీ టీం వ్యవస్థను బలోపేతం చేసి మహిళల పట్ల విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించే వారి పట్ల అత్యంత కఠినంగా వ్యవహరించడంతోపాటు చట్టపరంగా చర్యలు తీసుకుంటాం.
సైబర్ నేరాలపై అవగాహన
రోజురోజుకు సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయని వాటి బారిన పడకుండా ఉండేందుకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సులు నిర్వహిస్తాం. ప్రజలు సైబర్ నేరగాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, బ్యాంకు వివరాలు, ఓటీపీలు అపరిచిత వ్యక్తులకు ఎట్టి పరిస్థితుల్లో చెప్పరాదన్నారు.
డ్రగ్స్ ఫ్రీ తిరుపతిగా మార్చేందుకు కృషి
తిరుపతి నగరం తో పాటు జిల్లా పరిధిలో డ్రగ్స్ పూర్తిగా నిర్మూలించి డ్రగ్స్ ఫ్రీ తిరుపతిగా మార్చేందుకు పటిష్టమైన చర్యలు తీసుకుంటాం. అందుకోసం ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నాం. గంజాయి రవాణాతోపాటు విక్రయించినా, వినియోగించినాచట్టపరమైన చర్యలు తీసుకుంటాం.
