ఆటోమిత్ర పథకం మార్గదర్శకాలు విడుదల చేసిన ప్రభుత్వం.. అర్హులు ఎవరంటే?
ఆటోమిత్ర పథకం మార్గదర్శకాలు విడుదల చేసిన ప్రభుత్వం.. అర్హులు ఎవరంటే?
- ఏపీలో ఆటోడ్రైవర్లకు ఆర్థిక సాయం
- ఈనెల 17 నుంచి 19 వరకు ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ
ఆటోమిత్ర పథకం కింద దసరా రోజున ఆటోడ్రైవర్ల ఖాతాలో రూ.15 వేల చొప్పున జమ చేస్తామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించిన నేపథ్యంలో ప్రభుత్వం తాజాగా మార్గదర్శకాలు విడుదల చేసింది. సొంత ఆటో రిక్షా, మోటార్ క్యాబ్, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు ఈ ఆర్థిక సాయం వర్తించనున్నట్లు పేర్కొంది. ఈ మేరకు పథకం అమలు, అర్హతలు, తదితర వివరాలతో ఆదేశాలు జారీ చేసింది. బీమా, ఫిట్నెస్, మరమ్మతులు, ఇతర అవసరాల కోసం ఈ ఆర్థిక సాయం చేస్తున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు రవాణాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి. కృష్ణబాబు ఆదేశాలు జారీ చేశారు.
మార్గదర్శకాలు ఇవే
• లబ్ధిదారులు సొంత వాహనం, డ్రైవింగ్ లైసెన్సు కలిగి ఉండాలి.
• లబ్ధిదారులు తమ వాహనానికి ఏపీ రిజిస్ట్రేషన్, ఫిట్ నెస్, టాక్స్ చెల్లింపు ధ్రువపత్రాలు కలిగి ఉండాలి.
• మూడు, నాలుగు చక్రాల సరకు రవాణా వాహనాలకు పథకం వర్తించదు.
• లబ్ధిదారుడు తప్పని సరిగా ఆధార్, రేషన్ కార్డు కలిగి ఉండాలి.
• కుటుంబంలో ఒకవాహనదారుడికి మాత్రమే పథకం వర్తింపు.
• లబ్ధిదారుల ఎంపిక , పథకం అమలు కోసం చర్యలు చేపట్టనున్న గ్రామ వార్డు సచివాలయాలు, రవాణాశాఖ.
• ఈనెల 17 నుంచి 19 వరకు ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ.
• ఈ నెల 24 నాటికి దరఖాస్తులను పరిశీలించి లబ్ధిదారుల తుది జాబితా సిద్ధం చేయనున్న ప్రభుత్వం
• అక్టోబర్ 1న సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఆర్థిక సాయం
అందజేయనున్న ప్రభుత్వం
• వాహనమిత్ర పథకంతో 2.90 లక్షల మందికి లబ్ధి - రూ.435 కోట్ల మేర ఆర్థికసాయం
ఆటో డ్రైవర్లకు అండగా నిలుస్తామని స్త్రీశక్తి పథకం కింద ప్రారంభించిన రోజున ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు. ఆ మేరకు వాహన మిత్ర పథకం ద్వారా అర్హులైన వారికి రూ.15 వేల చొప్పున ఆర్థిక సాయం అందించనున్నట్లు అనంతపురంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆటోలతో పాటు ట్యాక్సీలు, మ్యాక్సీ క్యాబ్ చోదకులకూ లబ్ధి అందించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. వైఎస్సార్సీపీ హయాంలో సొంత ఆటో కలిగినవారికి వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం ద్వారా లబ్ధి అందించారు. ఆ సమయంలో వివిధ నిబంధనల కారణంగా అర్హతలున్నా కొందరు పథకానికి దూరమైనట్లు విమర్శలు వినిపించాయి. అలా కాకుండా పారదర్శకంగా పథకం అమలు చేసేలా కసరత్తు చేస్తున్నారు.
ఉచిత బస్సు పథకానికి ఆటోవాలాల రైట్ రైట్ : మరోవైపు సూపర్ సిక్స్ హామీల అమల్లో భాగంగా ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో తాము నష్టపోతున్నామంటూ ఆటోవాలాలు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో దసరాకు ఆటోడ్రైవర్లకు ఆటోమిత్ర పథకం కింద రూ.15 వేలు వారి ఖాతాల్లో వేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు సూపర్సిక్స్ - సూపర్హిట్ సభలో ప్రకటించడంతో వారంతా ఆనందంలో మునిగిపోయారు. గురువారం కాకినాడలో ఆటో యూనియన్ నాయకులే ఆటోలపై ఉచిత బస్సు ప్రయాణ పథకం స్టిక్కర్లను అంటించి ప్రచారం చేయడం విశేషం.
