బలహీనంగా ఉన్న స్థానిక సంస్థలకు ఊతమిస్తాం
బలహీనంగా ఉన్న స్థానిక సంస్థలకు ఊతమిస్తాం
- ఆదాయార్జన ఆధారంగా పంచాయతీల కేటగిరీ
- ఆర్ధిక వనరులు పెంచుకునేలా ప్రత్యేక కార్యాచరణ
- 5వ రాష్ట్ర ఆర్ధిక సంఘం సమావేశంలో సీఎం చంద్రబాబు
- పంచాయతీ రికార్డుల ఆన్లైన్కు డిప్యూటీ సీఎం సూచన
- 2025-29 కాలానికి రాష్ట్ర ఆర్ధిక సంఘం సిఫార్సులు
అమరావతి, సెప్టెంబర్ 3: స్థానిక సంస్థల బలోపేతానికి కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు అందించే ఆర్ధిక సాయంతో పాటు సొంత ఆదాయ వనరులు పెంచుకోవడం ద్వారా వేగంగా అభివృద్ధి సాధించడంపై అధికారులు దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. వెనకబడిన, తలసరి ఆదాయం తక్కువ ఉన్న స్థానిక సంస్థలను కేటగిరీలుగా విభజించాలని ఆదేశించారు. దీంతో వాటికి ప్రత్యేక సాయం అందించే వీలు కలుగుతుందన్నారు. స్థానిక సంస్థల వర్గీకరణ ప్రక్రియను నిర్ణీత కాల వ్యవధిలో పూర్తి చేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సూచించారు. ఇందుకు అవసరమైన చట్టసవరణ చేయాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. బుధవారం సచివాలయంలో 5వ రాష్ట్ర ఆర్ధిక సంఘం సభ్యులు ముఖ్యమంత్రితో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఆర్ధిక సంఘం సిఫారుసులను సీఎంకు అందజేశారు. స్థానిక సంస్థల బలోపేతానికి ఆర్ధిక-ఆర్ధికేతర అంశాలపై ఆర్ధిక సంఘం సిఫార్సులు చేసింది.
స్థానిక సంస్థల స్వయం సమృద్ధే లక్ష్యంగా
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ... ‘పంచాయతీల అభివృద్ధికి ఏటా నరేగా సహా వివిధ రూపాల్లో సమకూరుతున్న నిధుల మొత్తాన్ని క్రోడీకరించాలి. పంచాయతీల నిర్వహణకు ఏ మేరకు అవసరాలు ఉన్నాయో గుర్తించాలి. ఈ ప్రక్రియను పూర్తి చేస్తే ఏ విధంగా సాయం అందించాలి...? స్థానిక సంస్థల్ని ఏ విధంగా బలోపేతం చేయాలి...? అనే అంశాలపై విధి విధానాలు రూపొందించడానికి వీలు కలుగుతుంది. ఉపాధి హామీ పధకం కింద పెద్ద ఎత్తున కేంద్రం నుంచి నిధులు వస్తున్నాయి. అయితే ఆ మేరకు ఆస్తుల కల్పన జరుగుతుందో, లేదో అనే విషయాన్ని నిరంతరం పరిశీలించుకోవాలి. స్థానిక సంస్థలు స్వయం సమృద్ధి సాధించేలా అధికారులు ప్రయత్నించాలి. ఇదే విధంగా పట్టణ స్థానిక సంస్థలనూ ఆర్ధికంగా బలోపేతం చేస్తూ, మరిన్ని ఆదాయార్జన మార్గాలను అన్వేషించాలి. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఫైనాన్స్ కమిషన్ నిధులతో పాటు, రాష్ట్ర ప్రభుత్వం కూడా మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చే నిధులను కొంత మేర పెంచితే వాటిని స్థానిక సంస్థలు సద్వినియోగం చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే, వనరులు తక్కువగా ఉండి... సామాజికంగా వెనకబడి ఉన్న స్థానిక సంస్థల్ని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. ఇదే సమయంలో స్థానిక సంస్థలు బాధ్యతాయుతంగా వ్యవహరించేలా అవగాహన కల్పించాలి. నిధులు తీసుకోవడంతో పాటు, వాటిని సద్వినియోగం చేసుకునేలా స్థానిక ప్రజాప్రతినిధులు వ్యవహరించాలి. ప్రజలకు ప్రత్యక్షంగా సేవలందించేది స్థానిక సంస్థలు. దీనిని దృష్టిలో పెట్టుకుని స్థానిక సంస్థల్లో పని చేసే ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు విధులు నిర్వర్తించాలి. స్థానిక సంస్థల్లో విధులు నిర్వహించే వారు సమర్థవంతంగా పని చేస్తే... ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. ఆర్ధిక సంవత్సరం చివరికి పంచాయతీల్లోనూ, పట్టణాభివృద్ధి సంస్థల్లోనూ ఆడిటింగ్ పూర్తి చేయాలి.’ అన్నారు.
ఆదాయాలు-బకాయిల లెక్కలు తేల్చండి: డెప్యూటీ సీఎం
2019 నుంచి 2024 మధ్య కాలంలో స్థానిక సంస్థలు ఆస్తి పన్నుల వసూళ్లు ఎంత జరిగాయి...? ఇంకెంత బకాయిలు ఉన్నాయో...? లెక్కలు తేల్చాలని అధికారులకు ఉప ముఖ్యమంత్రి సూచించారు. ప్రజలు చెల్లించే పన్నుల వివరాలు ప్రతీది ఆన్లైన్ చేయాలని నిర్దేశించారు. గ్రామాల్లో పౌల్ట్రీ పరిశ్రమలకు సంబంధించిన వివిధ అంశాలపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేయాలని చెప్పారు. గ్రామ ప్రజలకు, పౌల్ట్రీ పరిశ్రమలకు ఇబ్బందిలేని విధానాన్ని తీసుకురావాలన్నారు.
స్థానిక సంస్థల రిసోర్స్ గ్యాప్-రాష్ట్ర ఆర్థిక సంఘం నివేదిక
ఆర్ధికంగా రాష్ట్రం కొన్ని సవాళ్లు ఎదుర్కొంటోందని 5వ రాష్ట్ర ఆర్ధిక సంఘం పేర్కొంది. 2023-24 ఆర్ధిక సంవసత్సరాన్ని పరిశీలిస్తే రాష్ట్ర సొంత ఆదాయం కన్నా జీతాలు, పెన్షన్లు, వడ్డీ చెల్లింపులకు ఖర్చు పెట్టే మొత్తం 111 శాతంగా ఉందని వెల్లడించింది. అంతేకాకుండా... రాజధాని నిర్మాణం, సూపర్ సిక్స్ సంక్షేమ పథకాల అమలు వంటి లక్ష్యాలు ఉన్నాయని స్పష్టం చేసింది. 2025-26 నుంచి 2029-30 వరకు పంచాయతీరాజ్ సంస్థల రిసోర్స్ గ్యాప్ రూ.7,033 కోట్లు ఉంటుందని ఆర్ధిక సంఘం లెక్క తేల్చింది. అలాగే ఇదే కాలానికి పట్టణ స్థానిక సంస్థల రిసోర్స్ గ్యాప్ రూ.2,016 కోట్లుగా ఉంది. అలాగే ఆస్తి పన్నుల డిమాండ్-కలెక్షన్ మధ్య భారీ వ్యత్యాసం ఉందని చెప్పింది.
విద్యుత్ బిల్లులు చెల్లించని గత ప్రభుత్వం
జూన్ 2024 వరకు గత ప్రభుత్వం చెల్లించకుండా వదిలేసిన గ్రామ పంచాయతీల విద్యుత్ బిల్లులు రూ.5,851.58 కోట్లు ఉన్నాయి. గ్రామ పంచాయతీలకు వివిధ రూపాల్లో నిధుల సమీకరణ రూ.2,617 కోట్లుగా ఉంది. ఇందులో అత్యధికంగా సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్ అందిస్తున్న గ్రాంట్స్ రూపంలోనే ఉన్నాయి. ఆ తర్వాత ఆస్తి పన్నులతో ఎక్కువ నిధులు సమకూరుతున్నాయి. పంచాయతీరాజ్ సిబ్బందికి ఏటా జీతాల రూపంలో రూ.393.77 కోట్లు, మున్సిపల్ సిబ్బందికి రూ.1,672.45 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. ఈ సమావేశంలో రాష్ట్ర 5వ ఆర్థిక సంఘం ఛైర్ పర్సన్ రత్నకుమారి, సభ్యులు ప్రసాదరావు, కృపారావు సహా ఆర్థిక, పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.