ఉద్యోగులకు శుభవార్త: 8వ వేతన సంఘం ఏర్పాటు
ఉద్యోగులకు శుభవార్త: 8వ వేతన సంఘం ఏర్పాటు
న్యూఢిల్లీ, నవంబర్ 4 (పీపుల్స్ మోటివేషన్):
ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కేంద్రం భారీ శుభవార్త అందించింది. చాలా కాలంగా ఎదురుచూస్తున్న 8వ వేతన సంఘం ఏర్పాటు చేసిందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ మేరకు అధికారిక గెజిట్ నోటిఫికేషన్ జారీ చేస్తూ, కమిషన్లో సభ్యుల నియామకాలను కూడా వెల్లడించింది. మొత్తం ముగ్గురు సభ్యులతో కూడిన ఈ కొత్త వేతన సంఘానికి న్యాయమూర్తి రంజనా ప్రకాశ్ దేశాయ్ను చైర్పర్సన్గా నియమించింది. ఇదే తొలిసారి వేతన సంఘానికి ఒక మహిళ చైర్పర్సన్గా నియమితురాలవడం విశేషం.
కమిషన్లో ప్రొఫెసర్ పులక్ ఘోష్ను పార్ట్టైమ్ సభ్యుడిగా, పంకజ్ జైన్ను సభ్య కార్యదర్శిగా కేంద్రం నియమించింది. ప్రస్తుత ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా హేతుబద్ధమైన, పని తీరు ఆధారిత వేతన విధానాన్ని రూపొందించడమే కమిషన్ ప్రధాన ఉద్దేశమని తెలిపింది.
కమిషన్ పరిధి – ఎవరికీ వర్తిస్తుంది?
8వ వేతన సంఘం సిఫార్సులు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, రక్షణ దళ సిబ్బంది, అఖిల భారత సర్వీసుల సభ్యులు, కేంద్ర పాలిత ప్రాంతాల సిబ్బంది, భారత ఆడిట్–అకౌంట్స్ విభాగం అధికారులు, పార్లమెంటు చట్టాల ప్రకారం ఏర్పాటైన నియంత్రణ సంస్థల సభ్యులు (ఆర్బీఐ మినహా), సుప్రీంకోర్టు అధికారులు, కేంద్ర పాలిత ప్రాంతాల హైకోర్టులు, సబార్డినేట్ కోర్టుల న్యాయాధికారులకు వర్తించనున్నాయి.
ఇవే కాకుండా, కేంద్రం పరిధిలోని అనేక విభాగాల ఉద్యోగులు, పారిశ్రామిక, పారిశ్రామికేతర విభాగాల్లో పనిచేసే సిబ్బందికి కూడా ఈ వేతన సంఘం సిఫార్సులు ప్రయోజనం చేకూరుస్తాయి.
కమిషన్ బాధ్యతలు
వేతన సంఘం, ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు, ద్రవ్యోల్బణం, ఉద్యోగుల జీవన ప్రమాణాలు, ప్రభుత్వ ఆర్థిక స్థోమతలను పరిగణనలోకి తీసుకుని, వేతనాలు, భత్యాలు, ఇతర సౌకర్యాలు, నగదు లేదా వస్తు రూపంలో ఉన్న ప్రయోజనాల్లో అవసరమైన మార్పులను సిఫార్సు చేయనుంది.
అలాగే, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతన చట్రం, అలవెన్సులు, ప్రోత్సాహక పథకాలు, పనితీరు ఆధారిత ప్రోత్సాహాలను సమీక్షించి, ప్రస్తుత తరానికి అనుకూలంగా ఉండే విధంగా మార్పులు చేయాలనే దిశగా సూచనలు ఇవ్వనుంది.
కేంద్రంలోని ఆర్థిక మంత్రిత్వ శాఖలోని వ్యయ నిర్వహణ విభాగం జారీ చేసిన గెజిట్ ప్రకారం, కమిషన్ ప్రధాన కార్యాలయం ఢిల్లీలో ఉండనుంది.
నివేదిక సమర్పణ గడువు
8వ వేతన సంఘం తన ఏర్పాటు తేదీ నుంచి 18 నెలల్లోపు తుది నివేదికను సమర్పించాల్సి ఉంటుంది. అవసరమైతే, మధ్యంతర నివేదికలను కూడా ఇవ్వవచ్చని నోటిఫికేషన్లో స్పష్టంగా పేర్కొంది.
ఉద్యోగుల అంచనాలు
ఇప్పటికే దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు వేతన పెంపుపై పెద్ద ఎత్తున ఎదురుచూస్తున్నారు. గతంలో 7వ వేతన సంఘం సిఫార్సుల మేరకు వేతనాలు పెరిగిన సంగతి తెలిసిందే. ఆ సిఫార్సులు 2016 జనవరి 1న అమలులోకి వచ్చాయి. అదే విధంగా 8వ వేతన సంఘం సిఫార్సులు 2026 జనవరి నుంచి అమలులోకి వచ్చే అవకాశం ఉందని అంచనాలు ఉన్నాయి.
మొత్తానికి, కేంద్రం ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా లక్షలాది మంది ఉద్యోగుల్లో ఉత్సాహం నెలకొంది. వేతనాలు, భత్యాలు, సౌకర్యాల పెంపుతో జీవన ప్రమాణాలు మెరుగుపడతాయనే ఆశాభావం వ్యక్తమవుతోంది.
ఇక కేంద్రం సకాలంలో నివేదిక స్వీకరించి, అమలు దిశగా ముందడుగు వేస్తే, రాబోయే ఏడాది ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో పెద్ద ఎత్తున పెరుగుదల చోటు చేసుకునే అవకాశం ఉన్నట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు.
