రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

తెలంగాణ ప్రభుత్వ స్కూళ్లకు గుడ్ న్యూస్.. ఇకపై ఫ్రీ ఇంటర్నెట్ సేవలు

Telangana Government Telangana schools free internet BSNL T-Fiber digital education government schools school education department Samagra Sikshana
Mounikadesk

తెలంగాణ ప్రభుత్వ స్కూళ్లకు గుడ్ న్యూస్.. ఇకపై ఫ్రీ ఇంటర్నెట్ సేవలు

  • డిజిటల్ విద్యను ప్రోత్సహించేందుకు రేవంత్ సర్కార్ నిర్ణయం
  • రాష్ట్రవ్యాప్తంగా 22 వేలకు పైగా స్కూళ్లకు ప్రయోజనం
  • బీఎస్ఎన్ఎల్, టీ-ఫైబర్‌తో విద్యాశాఖ ఒప్పందం
  • రెండు దశల్లో ఇంటర్నెట్ కనెక్షన్ల ఏర్పాటుకు ప్రణాళిక
  • సమగ్ర శిక్ష నిధుల ద్వారా ప్రాజెక్టు అమలు

డిజిటల్ విద్యా విధానాన్ని బలోపేతం చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలకు ఉచితంగా ఇంటర్నెట్ సౌకర్యం కల్పించాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వరంగ సంస్థలైన బీఎస్ఎన్ఎల్, టీ-ఫైబర్‌తో పాఠశాల విద్యాశాఖ అధికారులు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ నిర్ణయంతో సర్కారీ బడుల్లో చదువుతున్న విద్యార్థులకు ఆధునిక సాంకేతిక విద్య మరింత అందుబాటులోకి రానుంది.


రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 26,887 ప్రభుత్వ విద్యా సంస్థలు ఉండగా, వాటిలో కంప్యూటర్లు అందుబాటులో ఉన్న 22,730 పాఠశాలలకు ఇంటర్నెట్ కనెక్షన్లు ఇవ్వాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ప్రక్రియను రెండు దశల్లో పూర్తి చేయనున్నారు. మొదటి విడతలో భాగంగా 10,342 పాఠశాలలకు కనెక్షన్లు ఇస్తారు. ఇందులో 5,342 స్కూళ్లకు బీఎస్ఎన్ఎల్, మిగిలిన 5,000 స్కూళ్లకు టీ-ఫైబర్ ఉచితంగా ఇంటర్నెట్ సేవలను అందిస్తాయి. బీఎస్ఎన్ఎల్ ఇప్పటికే వెయ్యి పాఠశాలల్లో కనెక్షన్ల ఏర్పాటును పూర్తి చేసింది.

రెండో విడతలో మిగిలిన 12,388 పాఠశాలలకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తారు. ఇందులో 9,404 పాఠశాలలకు బీఎస్ఎన్ఎల్, 2,984 పాఠశాలలకు టీ-ఫైబర్ కనెక్షన్లు ఇస్తాయి. ఈ ప్రాజెక్టుకు అవసరమైన నిధులను సమగ్ర శిక్షా అభియాన్ ద్వారా ప్రభుత్వం ఆయా సంస్థలకు చెల్లించనుంది. వాస్తవానికి, రాష్ట్రంలో 2025-26 విద్యా సంవత్సరం నుంచే పలు ఫౌండేషన్ల సహకారంతో డిజిటల్ తరగతులు ప్రారంభమైనప్పటికీ, ఇంటర్నెట్ సౌకర్యం లేకపోవడంతో అవి పూర్తిస్థాయిలో విద్యార్థులకు చేరలేదు. ఈ సమస్యను అధిగమించేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.



ఒకవేళ కనెక్షన్ల ఏర్పాటులో జాప్యం జరిగితే, ప్రత్యామ్నాయంగా ప్రైవేటు కనెక్షన్లు తీసుకునేందుకు పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు వెసులుబాటు కల్పించారు. ఇందుకు అయ్యే ఖర్చును స్కూల్ గ్రాంట్ల నుంచి వినియోగించుకోవాలని ఉన్నతాధికారులు సూచించారు. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో కంప్యూటర్ టీచర్ల నియామకానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా, ఇప్పుడు ఇంటర్నెట్ సౌకర్యం కూడా తోడవడంతో డిజిటల్ విద్యకు కొత్త ఊపు వస్తుందని అధికారులు భావిస్తున్నారు.




Comments

-Advertisement-