దైవం మానుష రూపేణ అన్నట్టుగా సత్యసాయి సేవలందించారు
దైవం మానుష రూపేణ అన్నట్టుగా సత్యసాయి సేవలందించారు
- సత్యసాయి బాబా స్థాపించిన ట్రస్ట్తో సేవలకు రూపం
- భారతీయుల మూలం... వసుధైక కుటుంబం దాన్ని నిలబెట్టుకుందాం
- సత్యసాయిబాబా శతజయంతి ఉత్సవ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
- వేడుకలకు హాజరైన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి, మంత్రి నారా లోకేష్, పలువురు ప్రముఖులు
పుట్టపర్తి, నవంబర్ 23 : సమాజ సేవ, సమస్యకు పరిష్కారం, ఆధ్యాత్మిక భావన, ప్రశాంత జీవనం, ముక్తిమార్గంతో కోట్ల మంది జీవితాలను సత్యసాయి బాబా ప్రభావితం చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. 86 ఏళ్ల పాటు ఈ పవిత్ర నేలపై తన జీవన ప్రయాణాన్ని సాగించి ఆయన సిద్ధాంతాన్ని ప్రపంచానికి అందించి జ్ఞానాన్ని బోధించి సన్మార్గం చూపించారని తెలిపారు. సత్యసాయి బాబా జయంతిని పురస్కరించుకుని ఆదివారం పుట్టపర్తిలో శతజయంతి వేడుకల్లో పాల్గొన్నారు. ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్తో కలిసి సత్యసాయి మహా సమాధిని దర్శించుకున్నారు. అనంతరం ఉత్సవాల్లో పాల్గొని సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ....‘1926 నవంబర్ 23వ తేదీన భగవాన్ సత్యసాయి ఈ పుణ్యభూమిలో ఒకలక్ష్యం కోసం అవతరించారు. 8 ఏళ్ల వయసు నుంచే ప్రార్థనలు, కీర్తనలు, భజనలతో దైవ చింతన కలిగిన వ్యక్తిగా వ్యవహరించేవారు. 14 ఏళ్ల వయసులోనే సత్యనారాయణరాజుగా ఉన్న పూర్వపు నామాన్ని వదలుకుని సత్యసాయిగా సాక్షాత్కరించారు. దేవుళ్లు ఎక్కడో ఒకచోట అవతరిస్తారు. సతస్యాయి ఈ పుణ్యభూమిని ఎంచుకున్నారు. చిత్రావతి నది ఒడ్డున పుట్టపర్తిని ఆధ్యాత్మికతకు, దైవత్యానికి నిలయంగా మార్చారు. మావన రూపంలో మనం చూసిన దైవమే సత్యసాయి బాబా. సత్యసాయి శత జయంతి సందర్భంగా ఆయన సేవలను స్మరించుకోవడం అందరి అదృష్టం’ అని సీఎం చంద్రబాబు అన్నారు.
ప్రశాంతి నిలయానికి 75 ఏళ్లు
లవ్ ఆల్, సర్వ్ ఆల్వ్.. హెల్ప్ ఎవర్, హర్ట్ నెవర్ అని సత్యసాయి బోధించారని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింసా సిద్ధాంతాలతో నూతన అధ్యాయం ప్రారంభించారని అన్నారు. ‘1960లో బాబా స్థాపించిన సత్యసాయి సంస్థలతో సేవలకు రూపం వచ్చింది. విశ్వశాంతి, విశ్వ సౌభాగ్యం, సకల జనుల సంక్షేమాన్ని కోరుకున్నారు. భగవాన్ మనోదర్శనం ద్వారా దేశ విదేశాల నుంచి సంపన్నులు, ప్రముఖులు వచ్చి ఆయన సేవా మార్గాన్ని అనుసరించారు. ఎవరూ పిలవకున్నా వారంతట వారే వచ్చి బాబా సిద్ధాంతాన్ని పాటించారు. డబ్బు, పేరు, పదవి ఉన్నా ఎక్కడా లేని ప్రశాంతత పుట్టపర్తిలో లభిస్తుందని సీఎం చెప్పారు. సత్యసాయి బాబా లేకపోయినా ఆయన నింపిన స్ఫూర్తి ఉంది. ప్రశాంతి నిలయం ఒక ఎనర్జీ సెంటర్. శతజయంతితో పాటు ఈ రోజు మరో విశిష్టత ఉంది. ఈ ప్రశాంతి నిలయం నిర్మించి నేటికి 75 ఏళ్లు. ఆధ్యాత్మిక సంబరాలకు ఈ నిలయం వేదికైంది. భక్తుల బాధలకు, కష్టాలకు పరిష్కారం చూపే నిలయంగా మారింది. మానవ సేవే మాధవ సేవగా భావించే బాబా... సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ ద్వారా సేవలు మరింత విస్తరించారు. విద్య నుంచి వైద్యం వరకూ, తాగునీటి నుంచి మానసిక సంతృప్తి వరకూ అందరికీ దక్కేలా చేశారు. దేశ విదేశాల్లో ట్రస్టు ద్వారా సేవలందించారు. 102 సత్యాసాయి పాఠశాలల్లో 60 వేలమంది విద్యార్థులు చదవుకుంటున్నారు.. వారికి ఉచిత విద్య అందిస్తున్నారు. ట్రస్ట్ ఆస్పత్రుల ద్వారా 3 వేల మందికి ప్రతిరోజూ వైద్య సేవలు అందిస్తున్నారు. దాహార్తిని తీర్చడానికి రూ.550 కోట్లతో ఏపీ, తెలంగాణ, తమిళనాడులో 16 వందల గ్రామాల్లో 30 లక్షల మందికి పైగా నీరు అందిస్తున్నారు. చెన్నై డ్రికింగ్ మోడరేజేషన్కు రూ.250 కోట్లు ఖర్చు పెట్టారు. సత్యసాయి ట్రస్ట్ 140 దేశాలు, 2 వేల కేంద్రాల్లో విస్తరించింది. సత్యసాయి ఇంటర్నేషన్ ఆర్గనేజేషన్ 10 జోన్లుగా ప్రపంచ దేశాల్లో సాయి సిద్ధాంతాన్ని, సేవలను ముందుకు తీసుకెళ్తోంది. చాలా గర్వపడుతున్నా... సత్యసాయికి ఈ రోజు 7.50 లక్షల మంది సేవా సభ్యులు ఉన్నారు. బాబా సేవలను వివరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఉత్సవాలు నిర్వహిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం కూడా అధికారికంగా నిర్వహిస్తున్నందుకు ఆ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డిని అభినందిస్తున్నా. సత్యసాయి సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు బాబా అందరినీ ఇక్కడికి రప్పించారు. వేడుకలకు హాజరైన ప్రతి ఒక్కరినీ అభినందిస్తున్నా. వసుధైక కుటుంబం భారతీయులకు మూలం. సత్యసాయి బోధనల ద్వారా దాన్ని నిలబెట్టుకుందాం’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.
