రైతుల పేరుతో వైసీపీ నాటకాలు ఆపాలి
రైతుల పేరుతో వైసీపీ నాటకాలు ఆపాలి
– మంత్రి అచ్చన్నాయుడు
అమరావతి/కడప, నవంబర్ 4 (పీపుల్స్ మోటివేషన్):
రైతుల పేరు చెప్పుకొని రాజకీయ లాభం చూసే వైసీపీ నాటకాలకు ముగింపు పలకాల్సిన సమయం వచ్చిందని మంత్రి అచ్చన్నాయుడు తీవ్రంగా వ్యాఖ్యానించారు. కడప జిల్లాలో ఐదేళ్ల పాలనలో రైతుల సమస్యలు కనిపించని అవినాశ్ రెడ్డి, ఇప్పుడు ఒక్కసారిగా రైతులపై ప్రేమ ప్రదర్శించడం అంటే ప్రజలను మోసగించడం తప్ప మరేమీ కాదన్నారు.
ఉల్లి రైతుల సమస్యలపై ప్రస్తుత కూటమి ప్రభుత్వం తీసుకున్న చర్యలను వివరించిన ఆయన గతంలో ఏ ప్రభుత్వం కూడా చేయని విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఉల్లి రైతులు నష్టపోకూడదనే ఆలోచనతో హెక్టారుకు రూ.50,000 చొప్పున ఆర్థిక సహాయం ప్రకటించటం చారిత్రాత్మక నిర్ణయం అని పేర్కొన్నారు. మొత్తం రూ.104 కోట్లు 57 లక్షలు నేరుగా రైతులకు చేరాయని చెప్పారు.
ఉల్లి ధరలు పడిపోతున్న సమయంలో క్వింటాకు రూ.1200 వ్యయంతో మార్కెటింగ్, మార్క్ఫెడ్ ద్వారా కర్నూలు మార్కెట్లో రూ.17 కోట్లు 22 లక్షల విలువైన ఉల్లిని ప్రభుత్వమే కొనుగోలు చేయడంతో రైతులు భారీ నష్టాల నుంచి బయటపడ్డారని గుర్తుచేశారు.
- వైసీపీ పాలనలో రైతుల పట్ల నిజమైన చిత్తశుద్ధి లేకపోయింది
2020లో వైసీపీ పాలనలో ఉల్లి ధర పడిపోయినప్పుడు కేవలం క్వింటాకు రూ.770 మద్దతు ధర ప్రకటించడం తప్ప రైతుల కోసం ఎలాంటి ధైర్యవంతమైన చర్యలు తీసుకోలేదని అచ్చన్నాయుడు విమర్శించారు. వైసీపీ కాలంలో మార్క్ఫెడ్ ద్వారా కేవలం 129 మంది రైతుల నుంచి 970 మెట్రిక్ టన్నుల ఉల్లిని మాత్రమే కొనుగోలు చేసి, కేవలం రూ.75 లక్షలు మాత్రమే రైతులకు చెల్లించారని ఇది అవినాశ్ రెడ్డి గుర్తుంచుకోవాలని అన్నారు.
“మేం రైతుల కష్టాలు అర్థం చేసుకున్నాం. అందుకే క్వింటాకు రూ.770 నిర్ణయించిన చోట రూ.1200 ఇచ్చి కొనుగోలు చేశాం. రైతు శ్రేయస్సే మా ధ్యేయం” అని మంత్రి అచ్చన్నాయుడు తెలిపారు.
- “రైతుపై ప్రేమ ఎన్నికల సీజన్లోనేనా?”
గత ఐదేళ్లలో రైతుల సమస్యలు వైసీపీ నేతలకు ఎందుకు కనిపించలేదని ప్రశ్నించిన అచ్చన్నాయుడు, ఎన్నికలు వచ్చినప్పుడో, విపత్తులు వచ్చినప్పుడో మాత్రమే రైతుల పేరు వినిపించడం వైసీపీ నాటకమని పేర్కొన్నారు. “గత ఐదేళ్లు అవినాశ్ రెడ్డి కళ్ళకు గంతలు కట్టుకున్నారా?” అని విమర్శించారు.
నష్టపరిహారం ఫైళ్లు పెండింగ్లో పెట్టినది ప్రస్తుత కూటమి ప్రభుత్వం కాదని, గత వైసీపీ ప్రభుత్వంలోని గందరగోళ విధానాల వల్లే ఈ పరిస్థితి నెలకొన్నదని స్పష్టం చేశారు.
“రైతుల పేరుతో రాజకీయ ప్రదర్శనలు చేయడం అవినాశ్ రెడ్డి సహజ స్వభావం. సీఎం చంద్రబాబు గురించి మాట్లాడే అర్హత ఆయనకు లేదు” అని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.
కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి, రైతుల కోసం పనిచేస్తోందని, ధరలు పడిపోయినపుడు పరిహారం ఇవ్వడం, రైతులకు సకాలంలో పథకాలను అందించడం ద్వారా ప్రభుత్వం తన బాధ్యత నిర్వర్తిస్తున్నదని తెలిపారు. “రైతు క్షేమం కోసం తీసుకుంటున్న చర్యలు వైసీపీ నేతలకు కనబడకపోవడం సహజమే… ఎందుకంటే వారికి రైతుల సమస్యలంటే అసలు పట్టింపు లేదు” అని అచ్చన్నాయుడు ఎద్దేవా చేశారు.
