తుళ్లూరులో కొత్త డీఎస్పీ కార్యాలయం ఆరంభం
తుళ్లూరులో కొత్త డీఎస్పీ కార్యాలయం ఆరంభం
— డీజీపీ హరీష్ గుప్తా, హోం మంత్రి అనిత చేతుల మీదుగా ప్రారంభం
అమరావతి, నవంబర్ 4 (పీపుల్స్ మోటివేషన్):-
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పరిధిలోని తుళ్లూరులో నూతనంగా నిర్మించిన డీఎస్పీ కార్యాలయాన్ని ఈరోజు ఘనంగా ప్రారంభించారు. రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి వంగలపూడి అనిత కలిసి వేదపండితుల మంత్రోచ్చారణల మధ్య పూజలు నిర్వహించి కార్యాలయాన్ని లాంఛనంగా ప్రారంభించారు.
కార్యక్రమానికి జిల్లా పోలీసు ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. రాజధాని ప్రాంతంలో చట్టం–శాంతి పరిరక్షణ, ప్రజల భద్రత, పోలీసింగ్ వ్యవస్థను మరింత బలోపేతం చేయడంలో ఈ కొత్త డీఎస్పీ కార్యాలయం కీలక పాత్ర పోషించనుందని అధికారులు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా హోం మంత్రి అనిత మాట్లాడుతూ,, “అమరావతి పరిధిలో అభివృద్ధి వేగంగా జరుగుతున్న తరుణంలో భద్రతా చర్యలను మరింత పటిష్టం చేయడం ప్రభుత్వ లక్ష్యం. తుళ్లూరులో డీఎస్పీ కార్యాలయం ఏర్పాటు ద్వారా ప్రజలకు సులభమైన, పారదర్శకమైన, చేరువైన పోలీస్ సేవలు అందుబాటులోకి వస్తాయి” అని అన్నారు. మహిళల భద్రత, సైబర్ నేరాలు, యువతకు చట్టపరమైన అవగాహనపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు వెల్లడించారు.
డీజీపీ హరీష్ గుప్తా మాట్లాడుతూ.. “రాజధాని ప్రాంతంలో స్మార్ట్ పోలీసింగ్, ఆధునిక సాంకేతిక వసతులు, పహారా వ్యవస్థను మరింత విస్తరిస్తాం. ఈ డీఎస్పీ కార్యాలయంతో నేర నివారణ, ట్రాఫిక్ పర్యవేక్షణ, ప్రజలకు త్వరిత స్పందన సేవలు మరింత మెరుగుపడతాయి” అని తెలిపారు.
ప్రారంభోత్సవం అనంతరం హోం మంత్రి అనిత, డీజీపీ హరీష్ గుప్తా మరియు అధికారులు కలిసి కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు. పచ్చదనం, పర్యావరణ పరిరక్షణకు ఇది చిహ్నాత్మకంగా చేపట్టిన కార్యక్రమమని పోలీసులు పేర్కొన్నారు. స్థానిక ప్రజలు, మహిళా సంఘాలు, యువజన సంఘాల సభ్యులు పాల్గొన్న ఈ కార్యక్రమం సందడిగా సాగింది. కొత్త డీఎస్పీ కార్యాలయం ప్రారంభచేస్తున్నారు అమరావతి మంగళగిరి ప్రాంతాల్లో పోలీసింగ్ సేవలు మరింత సమర్థవంతం కానున్నాయని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

