వన్డే కప్ తర్వాత జెమీమా బ్రాండ్ వాల్యూ దూసుకెళ్లింది
వన్డే కప్ తర్వాత జెమీమా బ్రాండ్ వాల్యూ దూసుకెళ్లింది
ముంబై, నవంబర్ 4 (పీపుల్స్ మోటివేషన్):
భారత మహిళా జట్టు వన్డే ప్రపంచకప్ విజయంతో దేశవ్యాప్తంగా సంబరాలు నిండిపోయాయి. దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న కలను నెరవేర్చిన హర్మన్ప్రీత్ కౌర్ బృందం భారత క్రీడా చరిత్రలో స్వర్ణాక్షరాలతో నిలిచిపోయింది. ఈ విజయం కేవలం ట్రోఫీ వరకే పరిమితం కాలేదు. జట్టులోని ఆటగాళ్లకు కొత్త గుర్తింపు, కొత్త గౌరవం, కొత్త ఆదాయం తెచ్చిపెట్టింది.
ప్రపంచకప్ గెలుపుతో మహిళా క్రికెటర్ల క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. హర్మన్ప్రీత్ కౌర్, స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్, షఫాలి వర్మ, దీప్తి శర్మ వంటి ఆటగాళ్ల సోషల్ మీడియా ఫాలోవర్లు రెట్టింపయ్యారు. అదే సమయంలో వారి బ్రాండ్ విలువలు కూడా విపరీతంగా పెరిగాయి. క్రికెటర్లకు లభించే బ్రాండ్ ప్రమోషన్ ఫీజులు 25 శాతం నుంచి 100 శాతం వరకు పెరిగినట్లు మార్కెట్ విశ్లేషకులు తెలిపారు.
ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్లో అద్భుత ప్రదర్శన కనబరిచిన జెమీమా రోడ్రిగ్స్ ప్రస్తుతం మహిళా క్రికెటర్లలో అత్యధికంగా దృష్టిని ఆకర్షిస్తోంది. ఆమె బ్రాండ్ విలువ 100 శాతం పెరిగినట్లు సమాచారం. అంతకుముందు జెమీమా ఒక్కో బ్రాండ్ ప్రచారానికి రూ.75 లక్షలు తీసుకుంటుండగా, ఇప్పుడు అది రూ.1.5 కోట్లకు పెరిగిందని మార్కెట్ వర్గాలు వెల్లడించాయి. ప్రపంచకప్ అనంతరం దాదాపు 10కి పైగా కొత్త బ్రాండ్లు ఆమెను సంప్రదించాయని జేఎస్డబ్ల్యూ కమర్షియల్ విభాగం అధికారి కరణ్ యాదవ్ తెలిపారు.
ఇక దేశంలో అత్యధిక పారితోషికం పొందుతున్న మహిళా క్రికెటర్ స్మృతి మంధాన ఇప్పటికే నైక్, హెర్బాలైఫ్, హ్యుందయ్, ఎస్బీఐ, గల్ఫ్ ఆయిల్, రెక్సోనా, పీఎన్బీ మెట్లైఫ్ ఇన్సూరెన్స్ వంటి దాదాపు 16 బ్రాండ్లకు ప్రచారకర్తగా ఉన్నారు. ఒక్కో బ్రాండ్ కోసం ఆమె రూ.1.5 నుంచి 2 కోట్ల వరకు పారితోషికం పొందుతున్నట్లు సమాచారం.
వన్డే కప్ విజయం తర్వాత మహిళా క్రికెటర్లు ఇప్పుడు కేవలం క్రీడా రంగానికే పరిమితం కాకుండా బ్రాండ్ ప్రపంచంలోనూ కొత్త చరిత్ర సృష్టిస్తున్నారు.
