స్క్రబ్ టైపస్ చికిత్సకు సంబంధించిన మందులు సిద్ధం!
స్క్రబ్ టైపస్ చికిత్సకు సంబంధించిన మందులు సిద్ధం!
ల్యాబ్స్ ల్లో పరీక్షలు పెంచేందుకు చర్యలు!
రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్
వీరపాండియన్ వెల్లడి
స్క్రబ్ టైఫస్ జ్వరాలవల్ల ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరంలేదని రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండియన్ వెల్లడించారు. ఇందుకు ప్రధానంగా అవసరమైన డాక్సిసైక్లిన్, అజిత్రోమైసిన్ మాత్రలు కోటి చొప్పున ఉప ఆరోగ్య కేంద్రాల(హెల్త్ అండ్ వెల్నెస్) స్థాయిలోనే అందుబాటులోనే ఉన్నాయని తెలిపారు. విజయవాడలో గురువారం సాయంత్రం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి హాజరైన కమిషనర్ వీరపాండియన్ తనను కలిసిన విలేకర్లతో మాట్లాడారు. విజయనగరం జిల్లాలో జరిగిన ఓ మరణం స్క్రబ్స్ఫస్ కారణంగా జరిగినట్లు అనుమానిస్తున్నట్లు తెలిపారు. ప్రైవేటు ఆసుపత్రిలో టెస్టింగ్ జరిగిందని, ఎలిశా పరీక్ష చేయాల్సి ఉందన్నారు. రాష్ట్రంలోని అన్ని బోధనాసుపత్రుల్లో ఈ పరీక్షలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇందులో ఏడు వీఆర్డీఏ ల్యాబ్లు ఉన్నాయని తెలిపారు. ఇవికాకుండా. తిరుపతి స్విమ్స్, మంగళగిరి ఎయిమ్స్ పరీక్షలు జరుగుతున్నాయన్నారు. పరీక్షల సంఖ్యను పెంచేందుకు, రీయేంజట్లను ఆసుపత్రులకు పంపేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
నల్లమచ్చ కనిపించి జ్వరం వస్తే అప్రమత్తం కావాలి!
2023 నుంచి రాష్ట్రంలో స్క్రబ్ టైఫస్ కేసుల నమోదు జరుగుతుందని వీరపాండియన్ తెలిపారు. 2023లో 579, 2024లో 803 కేసులు, ఈ ఏడాది నవంబరు 30వ తేదీ వరకు 736 స్క్రబ్ టైపస్ కేసులు రికార్డయినట్లు వెల్లడించారు. "వర్షాకాలంలో ఈ కేసులు ఎక్కువగా వస్తున్నాయి. జ్వరం, తలనొప్పితోపాటు శరీరంపై కీటకం కుట్టిన చోట నల్ల మచ్చ ఏర్పడుతుంది. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కలిగిన చిగ్గర్ మైటు అనే కీటకం మనుషులను కుడుతుంది. ముఖ్యంగా ఎలుకలు సంచరించే ప్రదేశాల్లో ప్రభావితమయ్యే కీటకాలు మనుషులను కుట్టడంవల్ల స్క్రబ్ టైఫస్ జ్వరం వస్తుంది. కావిడ్లో మాదిరిగానే దీర్ఘకాలిక వ్యాధులు కలిగిన వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి దట్టమైన చెట్లు, వ్యవసాయ భూముల పక్కనే నివపించే వారిపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అధికంగా రాత్రి సమయాల్లో ఈ పురుగులను మనుషులను కుడుతుంటాయి పొలం పనులకు వెళ్లే వారు రబ్బరుతో తయారుచేసే షూలు ధరిస్తే మంచిది. నివాస పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి' అని వీరపాండియన్ వివరించారు.
