విధ్వంసం నుంచి వికాసం వైపు – రూ.3,32,205 కోట్ల ఏపీ మహా బడ్జెట్
విధ్వంసం నుంచి వికాసం వైపు – రూ.3,32,205 కోట్ల ఏపీ మహా బడ్జెట్
- సంక్షేమానికి 17 శాతం నిధులు – సామాజిక న్యాయానికి పెద్దపీట
- బీసీలకు రూ.51 వేల కోట్లు – ఎస్సీ, ఎస్టీలకు విస్తృత కేటాయింపులు
- సంపద సృష్టికి ఏపీ వెల్త్ ఫండ్ – మూలధన వ్యయం పెంపుతో అభివృద్ధి దిశ
అమరావతి, ఫిబ్రవరి 14 (పీపుల్స్ మోటివేషన్): విధ్వంసం నుంచి వికాసం దిశగా రాష్ట్రాన్ని తీసుకెళ్లాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం 2026–27 ఆర్థిక సంవత్సరానికి రూ.3 లక్షల 32 వేల 205 కోట్లతో మహా బడ్జెట్ను ప్రవేశపెట్టింది. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి–సంక్షేమ సమన్వయంతో బడ్జెట్ రూపుదిద్దుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. కేంద్రం సహకారంతో స్వయం స్వావలంబన సాధిస్తామని విశ్వాసం వ్యక్తం చేస్తూ, ఎన్ని సవాళ్లు ఎదురైనా రాష్ట్రాన్ని అగ్రపథంలో నిలబెట్టేందుకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేసింది. సామాజిక న్యాయానికి ఈ బడ్జెట్లో పెద్దపీట వేశారు. సంక్షేమానికి ఏకంగా 17 శాతం నిధులు కేటాయించారు. బీసీ సంక్షేమానికి రూ.51 వేల కోట్లకు పైగా, ఎస్సీ సంక్షేమానికి రూ.20,644 కోట్లు, ఎస్టీ సంక్షేమానికి రూ.9,190 కోట్లు కేటాయించారు. మైనారిటీల సంక్షేమ నిధులను గణనీయంగా పెంచి రూ.6,090 కోట్లుగా ప్రతిపాదించారు. ఎన్టీఆర్ భరోసా, తల్లికి వందనం, దీపం 2.0, స్త్రీశక్తి, ఉపకార వేతనాలు వంటి పథకాలకు వేల కోట్ల రూపాయలు కేటాయించడం ద్వారా వెనుకబడిన వర్గాల సాధికారతపై ప్రభుత్వం దృష్టి సారించింది.
సంపద సృష్టి లక్ష్యంగా మూలధన వ్యయాన్ని గతంతో పోలిస్తే పెంచింది. ఎకనమిక్ రీజియన్ కారిడార్ల ద్వారా మూడు ప్రాంతాల సమగ్రాభివృద్ధి సాధిస్తామని ప్రకటించింది. రూ.100 కోట్ల కార్పస్తో ఏపీ వెల్త్ ఫండ్ ఏర్పాటు చేసి పెట్టుబడులను ఆకర్షించే దిశగా అడుగులు వేస్తోంది. రాష్ట్ర ఆదాయం పెరుగుతుందని, కేంద్రం నుంచి మరిన్ని నిధులు అందుతాయని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది.
ఉద్యోగుల సంక్షేమానికి కూడా ప్రాధాన్యం ఇచ్చారు. భవిష్యనిధి, పెన్షన్ ప్రక్రియలను కాగిత రహితంగా చేసి పారదర్శకతకు ప్రాధాన్యం ఇచ్చామని తెలిపారు. పెండింగ్లో ఉన్న రూ.1,100 కోట్ల డీఏ, డీఆర్ బకాయిలను విడుదల చేశామని వెల్లడించారు. మొత్తం మీద ఈ బడ్జెట్ ఆర్థిక క్రమశిక్షణ, సంక్షేమం, అభివృద్ధి అనే మూడు స్తంభాలపై రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర దిశగా నడిపించేందుకు సిద్ధమైందని ప్రభుత్వం ప్రకటించింది.
