గిగ్ వర్కర్ల సంక్షేమమే కాంగ్రెస్ లక్ష్యం
గిగ్ వర్కర్ల సంక్షేమమే కాంగ్రెస్ లక్ష్యం
- యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో గిగ్ వర్కర్ న్యాయ్ అభియాన్ సమావేశం
- కార్మికులుగా గుర్తించాలని కేంద్రాన్ని ప్రశ్నించిన నాయకులు
- ప్రత్యేక చట్టాలు, వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్
హైదరాబాద్, ఫిబ్రవరి 21 (పీపుల్స్ మోటివేషన్): గిగ్ వర్కర్ల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి శివ చరణ్ రెడ్డి పేర్కొన్నారు. ఆయన ఆధ్వర్యంలో గిగ్ వర్కర్ న్యాయ్ అభియాన్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భువనగిరి పార్లమెంట్ సభ్యుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, రాష్ట్ర యువజన కాంగ్రెస్ కో ఇంచార్జ్ కే.ఆర్ భవ్య హాజరయ్యారు. సమావేశంలో జక్కిడి శివ చరణ్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం గిగ్ వర్కర్లను కార్మికులుగా ఎందుకు గుర్తించడం లేదని ప్రశ్నించారు. కొత్త కార్మిక కోడ్లలో గిగ్ వర్కర్లకు సంబంధించిన హామీలు ఎక్కడున్నాయని మండిపడ్డారు. ఇంధన ధరలు పెంచడం ద్వారా గిగ్ వర్కర్ల ఆదాయం తగ్గే పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు.
స్టార్ట్ అప్ ఇండియా పేరుతో కంపెనీలకు రాయితీలు ఇస్తూ, గిగ్ వర్కర్ల భద్రతను విస్మరించడం సరికాదని ధ్వజమెత్తారు. వెంటనే గిగ్ వర్కర్లకు ప్రత్యేక చట్టాలు తీసుకురావాలని డిమాండ్ చేశారు. రాష్ట్రస్థాయిలో గిగ్ వర్కర్ల వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేసి ప్రమాద బీమా, ఆరోగ్య బీమా, రైడ్ చార్జీ హామీ, ఇంధన సబ్సిడీ కార్డు అందించాలని కోరారు. అదే విధంగా సామాజిక భద్రత హక్కులుగా పీఎఫ్, ఈఎస్ఐ, పెన్షన్, బీమా సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర యువజన కాంగ్రెస్ నాయకులు, జిల్లా, నియోజకవర్గ అధ్యక్షులు, స్విగ్గి, జొమాటో, ఓలా, ఊబర్, రాపిడో వంటి సంస్థల గిగ్ వర్కర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

