ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన బండ్ల గణేష్
ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన బండ్ల గణేష్
- తిరుమలకు పాదయాత్రగా మొక్కు చెల్లింపు
- పాదయాత్ర వివరాలు అడిగి తెలుసుకున్న సీఎం
- శ్రీవారి ప్రసాదం అందజేసిన నిర్మాత
అమరావతి, ఫిబ్రవరి 12 (పీపుల్స్ మోటివేషన్): ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును సినీ నిర్మాత బండ్ల గణేష్ గురువారం అసెంబ్లీలోని ఆయన ఛాంబర్లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల తిరుమలకు పాదయాత్రగా వెళ్లి మొక్కు చెల్లించిన అనంతరం అమరావతికి చేరుకుని ముఖ్యమంత్రిని కలుసుకున్నారు. వైసీపీ ప్రభుత్వం 2023లో చంద్రబాబుపై కేసులు నమోదు చేసి జైలుకు పంపిన సమయంలో, ఆయన విడుదలై మళ్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడితే తిరుమలకు పాదయాత్రగా వెళ్తానని బండ్ల గణేష్ మొక్కుకున్న సంగతి తెలిసిందే. 2024 ఎన్నికల్లో కూటమి విజయం సాధించి చంద్రబాబు నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడంతో తన సంకల్పాన్ని నెరవేర్చేందుకు బండ్ల గణేష్ ‘సంకల్ప యాత్ర’ పేరుతో జనవరి 19న షాద్నగర్లోని తన నివాసం నుంచి పాదయాత్ర ప్రారంభించారు.
మొత్తం 23 రోజుల పాటు సుమారు 535 కిలోమీటర్ల మేర సాగిన ఈ యాత్ర ఫిబ్రవరి 10న తిరుమలకు చేరుకుంది. అక్కడ శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని మొక్కు చెల్లించారు. అనంతరం శ్రీవారి ప్రసాదాన్ని ముఖ్యమంత్రికి అందజేశారు. బండ్ల గణేష్ను ముఖ్యమంత్రి ఆత్మీయంగా పలకరించి ఆలింగనం చేసుకున్నారు. పాదయాత్ర అనుభవాలను సీఎం ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. దారి పొడవునా పార్టీ కార్యకర్తలు అండగా నిలిచి ప్రోత్సహించడంతో మరింత ఉత్సాహంగా యాత్ర పూర్తిచేశానని బండ్ల గణేష్ తెలిపారు.
