పామాయిల్ రైతులకు రికార్డు ధర – రైతు పక్షపాత విధానాల ఫలితం: మంత్రి అచ్చెన్నాయుడు
పామాయిల్ రైతులకు రికార్డు ధర – రైతు పక్షపాత విధానాల ఫలితం: మంత్రి అచ్చెన్నాయుడు
- ఏపీలోనే తొలిసారి తెలంగాణను మించిన ధర
- టన్నుకు రూ. 20,680 లభ్యతతో కొత్త రికార్డు
- సాగు విస్తరణలో దేశంలోనే అగ్రస్థానం
- రైతుల ఖాతాల్లో నేరుగా కోట్ల రూపాయల జమ
విజయవాడ, ఫిబ్రవరి 5 (పీపుల్స్ మోటివేషన్):
పామాయిల్ సాగు చరిత్రలో ఆంధ్రప్రదేశ్ సరికొత్త రికార్డు సాధించిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో కూటమి ప్రభుత్వం తీసుకున్న రైతు పక్షపాత నిర్ణయాల వల్ల, తొలిసారిగా తెలంగాణ కంటే ఏపీలోనే పామాయిల్ రైతులకు అత్యధిక ధర లభిస్తోందని మంత్రి స్పష్టం చేశారు.
రెండు వేల ఇరవై ఐదు – ఇరవై ఆరు ఆయిల్ సంవత్సరానికి గాను 20.01 శాతం ఆయిల్ ఎక్సట్రాక్షన్ రేషియోను ప్రకటించడం ద్వారా మెట్రిక్ టన్నుకు రూ. 20,680 ధర లభిస్తోందని తెలిపారు. ఇది తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ధరతో పోలిస్తే టన్నుకు రూ. 224 ఎక్కువని, గత పదేళ్లలో రైతులకు లభించిన సగటు గరిష్ఠ ధర రూ. 19,579ను ఈసారి అధిగమించినట్లు వెల్లడించారు.
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 1.97 లక్షల మంది రైతులు 2.49 లక్షల హెక్టార్లలో పామాయిల్ సాగు చేస్తూ, ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే అగ్రగామిగా నిలబెట్టారని మంత్రి తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలోనే 24,535 హెక్టార్లలో సాగు విస్తరణ జరగడం రాష్ట్రానికి గర్వకారణమన్నారు.
రైతులకు అండగా నిలుస్తూ ప్రభుత్వం ఇప్పటికే రూ. 181.28 కోట్ల నిధులు విడుదల చేసి, అందులో రూ. 137.28 కోట్లను నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. డ్రిప్ పరికరాలపై సబ్సిడీ, ఉచిత మొక్కలు, ప్రోత్సాహకాలు అందిస్తూ పంట మార్పిడికి రైతులకు పూర్తి భరోసా ఇస్తున్నామని చెప్పారు. రైతుల ముఖాల్లో కనిపిస్తున్న చిరునవ్వులే ప్రభుత్వ విజయానికి నిదర్శనమని, “రైతే రాజు” అనే లక్ష్యంతో వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేస్తామని మంత్రి స్పష్టం చేశారు.
