ఏజెన్సీలో భారీ శబ్దంతో కుప్పకూలిన డ్రోన్
ఏజెన్సీలో భారీ శబ్దంతో కుప్పకూలిన డ్రోన్
గిరిజనుల్లో కలకలం
మొదట హెలికాప్టర్ అనుకున్న గ్రామస్థులు
ట్రయల్ సమయంలో సాంకేతిక లోపం కారణం
అల్లూరి సీతారామరాజు జిల్లా, మార్చి 27 (పీపుల్స్ మోటివేషన్): ఏజెన్సీ ప్రాంతంలో ఆకాశం నుంచి భారీ శబ్దంతో ఓ వింత వస్తువు కుప్పకూలడంతో గిరిజనులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. జి.మాడుగుల మండలం బొయితిలి గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఒక్కసారిగా పెద్ద శబ్దం వినిపించడంతో గ్రామస్థులు భయంతో పరుగులు తీశారు. మొదట ఇది హెలికాప్టర్ లేదా యుద్ధ విమానం కూలిపోయిందని భావించిన గిరిజనులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అనంతరం అది వైద్య సేవలకు వినియోగించే భారీ డ్రోన్ అని తెలిసి ఊపిరి పీల్చుకున్నారు. డ్రోన్ పరిమాణం సాధారణ డ్రోన్ల కంటే పెద్దగా ఉండటంతో మొదట అందరూ అయోమయానికి గురయ్యారు. ప్రభుత్వం ‘రెడ్ వింగ్’ సంస్థ సహకారంతో ఏజెన్సీలోని మారుమూల గ్రామాలకు అత్యవసర మందులు చేరవేసేందుకు డ్రోన్ సేవలను పరీక్షిస్తోంది. ఈ ట్రయల్ రన్లో భాగంగా పంపిన డ్రోన్లో సాంకేతిక లోపం తలెత్తడంతో అది చెట్లపై కూలిపోయింది.
డ్రోన్ మినీ హెలికాప్టర్ ఆకారంలో ఉండటంతో ప్రజలు మరింత భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటన గురించి సమాచారం తెలిసిన వెంటనే చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో ఘటనాస్థలానికి చేరుకున్నారు. ప్రాంతంలో కొంతసేపు గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. అయితే డ్రోన్ జనసంచారం లేని అటవీ ప్రాంతంలో పడటంతో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. అదే ఇది గ్రామంలో పడితే పెద్ద ప్రమాదం జరిగి ఉండేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. భద్రతపై వారు ప్రశ్నలు లేవనెత్తారు. సమాచారం అందుకున్న సంస్థ ప్రతినిధులు అక్కడికి చేరుకుని డ్రోన్ శకలాలను స్వాధీనం చేసుకున్నారు. సాంకేతిక లోపం వల్లే ఈ ఘటన జరిగిందని తెలిపారు. ఆధునిక సాంకేతికతను వినియోగించడం మంచిదే అయినప్పటికీ, భద్రతా ప్రమాణాలను మరింత కట్టుదిట్టం చేయాలని ప్రజలు కోరుతున్నారు.
