విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులకు ప్రభుత్వ లక్ష్యం
విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులకు ప్రభుత్వ లక్ష్యం
ఎడ్యుకేషన్ అవార్డ్స్లో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
విద్యకు భారీ బడ్జెట్ కేటాయింపు
ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రణాళికలు
హైదరాబాద్, మార్చి 28 (పీపుల్స్ మోటివేషన్): హాన్స్ ఇండియా, హెచ్ఎమ్టీవీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎడ్యుకేషన్ అవార్డ్స్ కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే ఇలాంటి కార్యక్రమాలు సమాజానికి ఎంతో అవసరమని ఆయన పేర్కొన్నారు. విద్యా రంగంలో ప్రతిభను ప్రోత్సహించడం ద్వారా సమాజ అభివృద్ధికి దోహదం జరుగుతుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖకు రూ. 26 వేల కోట్ల భారీ బడ్జెట్ను కేటాయించిందని మంత్రి వెల్లడించారు. ఈ నిధులతో విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేయడం, విద్యార్థులకు మెరుగైన అవకాశాలు కల్పించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా యంగ్ ఇండియా మోడల్ స్కూళ్లను నిర్మిస్తూ, ఒకే చోట వెయ్యి మంది విద్యార్థులకు అత్యాధునిక వసతులు అందించేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.
విద్యార్థుల జీవితంలో 8వ తరగతి నుండి 12వ తరగతి వరకు అత్యంత కీలక దశగా ఉంటుందని మంత్రి అన్నారు. ఈ సమయంలో వారు మొబైల్ ఫోన్లు, సోషల్ మీడియా ఆకర్షణలకు దూరంగా ఉండి చదువుపై దృష్టి పెట్టాలని సూచించారు. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటేనే భవిష్యత్తులో విజయాలు సాధించవచ్చని తెలిపారు. కార్పొరేట్ విద్యా సంస్థల ఒత్తిడి కారణంగా విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడటం బాధాకరమని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేట్ పాఠశాలల దోపిడీని అరికట్టేందుకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసి, అందులో చదివే విద్యార్థులకు కూడా సమాన అవకాశాలు కల్పించడం ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.
కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇప్పటికే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తరగతులను ప్రారంభించినట్లు మంత్రి వెల్లడించారు. సాంకేతిక విద్యను ప్రోత్సహించడం ద్వారా విద్యార్థులను భవిష్యత్తు అవసరాలకు సిద్ధం చేయాలని ప్రభుత్వం భావిస్తున్నదని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు ఐఏఎస్, డాక్టర్లు వంటి ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. వచ్చే ఐదేళ్లలో తెలంగాణ విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడమే ప్రభుత్వ సంకల్పమని స్పష్టం చేశారు.
