గుంటూరు పశ్చిమలో టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
గుంటూరు పశ్చిమలో టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- ఎమ్మెల్యే గళ్ళా మాధవి చేతుల మీదుగా జెండా ఆవిష్కరణ
- ఎన్టీఆర్కు ఘన నివాళులు – కార్యకర్తలకు సత్కారం
- పార్టీ సేవలపై నేతల ప్రశంసలు
గుంటూరు, మార్చి 29 (పీపుల్స్ మోటివేషన్): గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గళ్ళా మాధవి ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో ఉత్సాహభరితంగా నిర్వహించారు. పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని సంబరాలను జరుపుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గళ్ళా మాధవి పార్టీ జెండాను ఆవిష్కరించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంపిణీ చేశారు. పార్టీ నినాదాలతో కార్యాలయ ప్రాంగణం మారుమోగింది. కార్యక్రమం ప్రారంభంలో పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. పార్టీ అభివృద్ధికి కృషి చేసిన సీనియర్ నాయకులను సత్కరించి వారి సేవలను గుర్తించారు.
తరువాత జరిగిన మీడియా సమావేశంలో గళ్ళా మాధవి మాట్లాడుతూ, మార్చి 29 తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన చారిత్రాత్మక రోజు అని పేర్కొన్నారు. 44 సంవత్సరాలు పూర్తి చేసుకున్న టీడీపీ 45వ వసంతంలోకి అడుగుపెడుతోందని తెలిపారు.
“సమాజమే దేవాలయం – ప్రజలే దేవుళ్లు” అనే సిద్ధాంతంతో పార్టీని స్థాపించిన ఎన్టీఆర్ సేవలను కొనియాడారు. బడుగు బలహీన వర్గాల అభివృద్ధి, మహిళా సాధికారత కోసం ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్న నారా చంద్రబాబు నాయుడు, పార్టీని బలోపేతం చేస్తున్న నారా లోకేశ్ నాయకత్వాన్ని అభినందించారు. కార్యకర్తల అంకితభావం వల్లే పార్టీ బలంగా నిలుస్తోందని, ప్రజా సేవే లక్ష్యమని గళ్ళా మాధవి స్పష్టం చేశారు.
