అక్రమ మైనింగ్పై సీబీసీఐడీ విచారణకు ఆదేశాలు
అక్రమ మైనింగ్పై సీబీసీఐడీ విచారణకు ఆదేశాలు
- హరీష్ రావు కుటుంబంపై ఆరోపణలు
- పలువురు నేతలపై విచారణకు ప్రభుత్వం సిద్ధం
- 2014 నుంచి అక్రమాలపై సమగ్ర దర్యాప్తు
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
హైదరాబాద్, మార్చి 28 (పీపుల్స్ మోటివేషన్): రాష్ట్రంలో అక్రమ మైనింగ్ వ్యవహారాలపై సీబీసీఐడీ ద్వారా సమగ్ర విచారణ జరపాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి శాసనసభ వేదికగా ప్రకటించారు. గత కొన్ని సంవత్సరాలుగా జరిగిన అక్రమ తవ్వకాలపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టి నిజాలను బయటకు తీసుకురావాలని ఆయన ఆదేశించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు కుటుంబానికి చెందిన మైనింగ్ కార్యకలాపాలపై కూడా ఆరోపణలు వెలువడ్డాయి. ఆయన తమ్ముడు మహేష్ రావుకు సంబంధించిన మైనింగ్ కంపెనీపై సీబీసీఐడీ విచారణ జరుగనున్నట్లు తెలిపారు. అధికారంలో ఉన్న సమయంలో అక్రమంగా మైనింగ్ క్వారీల కేటాయింపులు జరిగాయన్న ఆరోపణలపై దర్యాప్తు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. అదేవిధంగా సిరిసిల్ల ప్రాంతంలో ఇసుక మాఫియా కార్యకలాపాలపై కూడా విచారణ జరపనున్నట్లు ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఈ కేసులో సంతోష్ రావు, ఆయన తండ్రి రవీందర్ రావుపై వచ్చిన ఆరోపణలను పరిశీలించి, దళితుల ప్రాణనష్టానికి కారణమైన ఘటనలపై నిజాలు వెలికితీయాలని నిర్ణయించారు.
కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కు సంబంధించిన ఇల్లీగల్ గ్రానైట్ మైనింగ్ అంశంపై కూడా విచారణకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. అక్రమ తవ్వకాల వల్ల ప్రభుత్వానికి, ప్రజలకు జరిగిన నష్టాన్ని అంచనా వేసే పనిని కూడా చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఇక రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర కు చెందిన కంపెనీలపై కూడా విచారణ జరుగనున్నట్లు ప్రకటించారు. రాఘవ కన్స్ట్రక్షన్ సహా అనేక సంస్థలపై వచ్చిన ఆరోపణలను సీబీసీఐడీ సమగ్రంగా పరిశీలించనుంది. 2014 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు జరిగిన అన్ని మైనింగ్ కార్యకలాపాలను పరిశీలించి, ఎవరెవరు అక్రమంగా తవ్వకాలు నిర్వహించారో నిగ్గు తేలుస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
