పీపుల్ ఫ్రెండ్లీ ప్రభుత్వం.. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం
పీపుల్ ఫ్రెండ్లీ ప్రభుత్వం.. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం
- ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధికి ప్రాధాన్యత
- గిరిశిఖర గ్రామాల్లో 18 నెలల్లో 460 కిలోమీటర్ల రోడ్లు
- నందిగరువు ‘మాట–మంతి’ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
పాడేరు, మార్చి 14 (పీపుల్స్ మోటివేషన్):
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజలతో మమేకమై పనిచేసే పీపుల్ ఫ్రెండ్లీ ప్రభుత్వం అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. ప్రజల కష్టాలు వినేందుకు, సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని అన్నారు. గత ప్రభుత్వంలో ప్రజలు తమ సమస్యలు చెప్పుకోవడానికి కూడా భయపడే పరిస్థితి ఉండేదని, ఇప్పుడు మాత్రం ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి ప్రభుత్వ యంత్రాంగమే వారి వద్దకు వెళ్లేలా పాలనను మార్చామని పేర్కొన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు నియోజకవర్గంలోని నందిగరువు గ్రామంలో గిరిజనులతో నిర్వహించిన ‘మాట–మంతి’ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. గ్రామస్థులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. కొన్ని సమస్యలను అక్కడికక్కడే అధికారులతో మాట్లాడి పరిష్కరించేలా చర్యలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన పవన్ కళ్యాణ్ ప్రభుత్వం సంక్షేమంతో పాటు అభివృద్ధికి కూడా సమాన ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. చిన్న గ్రామమైన నందిగరువుకు దాదాపు రెండు కోట్ల రూపాయల వ్యయంతో రహదారి నిర్మాణం చేపట్టామని తెలిపారు. గిరిశిఖర ప్రాంతాల్లో గర్భిణీలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని డోలీ మోతలు కనిపించకుండా ప్రతి గ్రామానికి రోడ్లు నిర్మించే పనులు వేగంగా చేపట్టామని చెప్పారు. గత ప్రభుత్వ కాలంలో ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధి నిర్లక్ష్యానికి గురైందని పవన్ కళ్యాణ్ విమర్శించారు. ప్రజలు ఓట్లు వేసి గెలిపించిన ఎమ్మెల్యేలు కూడా గ్రామాలకు రావడం లేదని, ప్రజల సమస్యలను పట్టించుకోలేదని అన్నారు. అభివృద్ధి పనులు చేయాల్సింది పోయి నిధులను మళ్లించడమే జరిగిందని పేర్కొన్నారు. ముఖ్యంగా జలజీవన్ మిషన్ పథకంలో వేల కోట్ల రూపాయల దుర్వినియోగం జరిగిందని ఆరోపించారు.
ప్రస్తుతం ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన తర్వాత గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి పనులకు ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలిపారు. కేవలం 18 నెలల్లోనే గిరిశిఖర గ్రామాల్లో 460 కిలోమీటర్ల మేర రహదారులు నిర్మించామని చెప్పారు. ఇంకా పలు గ్రామాలకు రోడ్లు, తాగునీరు, పాఠశాల భవనాలు వంటి మౌలిక సదుపాయాలు కల్పించాల్సి ఉందని తెలిపారు. జలజీవన్ మిషన్ ద్వారా ప్రతి గ్రామానికి రక్షిత తాగునీరు అందించే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని పవన్ కళ్యాణ్ చెప్పారు. గిరిజన ప్రాంతాల్లో తాగునీటి సమస్యను పూర్తిగా పరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని తెలిపారు. రాబోయే రోజుల్లో ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధిని మరింత వేగవంతం చేస్తామని పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో కూటమి అభ్యర్థులు గెలవకపోయినా ప్రభుత్వం ఎక్కడా వివక్ష చూపలేదని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ప్రభుత్వం ప్రజలు ఎవరికి ఓటు వేశారనే విషయం చూడదని, ప్రజల అభివృద్ధి మాత్రమే లక్ష్యంగా పనిచేస్తుందని అన్నారు. ప్రతి గ్రామానికి అభివృద్ధి చేరేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పెద్ద నగరాల్లో కాకుండా మారుమూల గిరిజన గ్రామంలో నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందని పవన్ కళ్యాణ్ అన్నారు. అరణ్య ప్రాంతంలో ఉన్న చిన్న గ్రామంలో పార్టీ వేడుకలు జరపడం ద్వారా గిరిజనులతో అనుబంధాన్ని మరింత బలపరచాలని భావించామని చెప్పారు.
70 ఏళ్లుగా రోడ్డు సౌకర్యం లేని గ్రామానికి ఇప్పుడు రహదారి నిర్మించడం ప్రభుత్వానికి సంతృప్తినిచ్చిందని తెలిపారు. గ్రామానికి స్వయంగా వచ్చి రోడ్డు నాణ్యతను పరిశీలించినట్లు చెప్పారు. ప్రజలు, యువత ప్రభుత్వం పట్ల విశ్వాసంతో అండగా నిలిస్తే అభివృద్ధిని మరింత వేగంగా సాధించగలమని పేర్కొన్నారు. మావోయిస్టు ప్రభావం ఉన్న మారుమూల ప్రాంతాలకు రావడానికి చాలా మంది నాయకులు వెనుకాడుతారని, కానీ ప్రజల కోసం పనిచేయడమే తన లక్ష్యమని పవన్ కళ్యాణ్ చెప్పారు. ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు ఎలాంటి ప్రాంతానికైనా వెళ్లడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. గిరిజనుల హక్కులకు భంగం కలగకుండా అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని ఆయన స్పష్టం చేశారు.
