ప్రజావాణి ఫిర్యాదులపై హైడ్రా క్షేత్రస్థాయి పరిశీలన
ప్రజావాణి ఫిర్యాదులపై హైడ్రా క్షేత్రస్థాయి పరిశీలన
- లేఅవుట్లలో ఆక్రమణలపై అధికారులకు ఆదేశాలు
- పార్కులు, రహదారులను రక్షించాలన్న కమిషనర్
- వరద కాలువల పునరుద్ధరణకు చర్యలు వేగవంతం
సంగారెడ్డి, మార్చి 25 (పీపుల్స్ మోటివేషన్): ప్రజావాణి ఫిర్యాదులపై హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలను పరిశీలించారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలంలోని పాటిఘనాపూర్ గ్రామం ఆనందనగర్ లేఔట్లో రహదారులు, పార్కులు, ప్రజా అవసరాలకు కేటాయించిన స్థలాలపై జరిగిన ఆక్రమణలను ప్రత్యక్షంగా పరిశీలించారు. బాధితులు పెద్ద సంఖ్యలో హాజరై తమ సమస్యలను కమిషనర్కు వివరించారు, 1980లో గ్రామపంచాయతీ అనుమతితో 92 ఎకరాల్లో 1109 ప్లాట్లతో లేఔట్ రూపొందించగా, తరువాత కొంతభాగానికి ఎల్ఆర్ఎస్ కూడా వచ్చినట్లు అధికారులు తెలిపారు. అయితే ఈ లేఔట్ హద్దులను చెరిపేసి వ్యవసాయ భూమిగా చూపించి, ధరణి ద్వారా పాస్బుక్స్ సృష్టించి అక్రమాలు జరుగుతున్నాయని వచ్చిన ఫిర్యాదులపై కమిషనర్ స్పందించారు. లేఔట్ ప్రకారం పార్కులు, రహదారులను గుర్తించి ఆక్రమణలను తొలగించాలని అధికారులను ఆదేశించారు.
అమీన్పూర్ మండలం బీరంగూడ గ్రామంలోని ఇండస్ట్రియల్ ఎంప్లాయీస్ కోపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీకి చెందిన లేఔట్ను కూడా కమిషనర్ పరిశీలించారు. 1982లో 180 ఎకరాల్లో దాదాపు 1650 ప్లాట్లతో ఏర్పాటు చేసిన ఈ లేఔట్లో కొంతమంది అక్రమంగా భూములను ఆక్రమించి 100 గజాల చొప్పున విక్రయిస్తున్నారని సొసైటీ ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. లేఔట్లో పార్కులు, రహదారులు కాపాడాలని వారు విజ్ఞప్తి చేశారు. కొత్తగా ఆక్రమణలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కమిషనర్ రంగనాథ్ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ భూముల చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని సూచించారు. ఇప్పటికే ఇళ్లు నిర్మించుకున్న వారు లేదా ప్లాట్లు కొనుగోలు చేసిన వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని హామీ ఇచ్చారు.
అనంతరం బీరంగూడ గ్రామంలోని శంభుని కుంట అవుట్లెట్లను పరిశీలించిన కమిషనర్, వరద నీటి సమస్యపై స్థానికుల ఫిర్యాదులను స్వీకరించారు. అవుట్లెట్ నాలాను మూసివేసి నిర్మాణాలు చేపడుతున్న సంస్థపై చర్యలు తీసుకోవాలని సూచించారు. వరద కాలువలను పునరుద్ధరించి బాధ్యులపై కేసులు నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని తక్షణ చర్యలు తీసుకోవాలని కమిషనర్ స్పష్టం చేశారు. ప్రజావాణి ఫిర్యాదులకు వేగంగా స్పందిస్తూ, అక్రమాలను అరికట్టడమే లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.
