భవిష్యత్తు అభివృద్ధి దిశగా చంద్రబాబు దార్శనికత…
భవిష్యత్తు అభివృద్ధి దిశగా చంద్రబాబు దార్శనికత…
- ఐఎస్బీ వేదికగా కీలక ప్రసంగం
- హైదరాబాద్ అభివృద్ధి ప్రయాణం గుర్తుచేసిన సీఎం
- స్వర్ణాంధ్ర లక్ష్యంగా విజన్ 2047
- అమరావతి, పోలవరం పై స్పష్టమైన ప్రణాళికలు
హైదరాబాద్, మార్చి 22 (పీపుల్స్ మోటివేషన్): హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్లో నిర్వహించిన సౌత్ ఏషియా లెర్నింగ్ సమ్మిట్–2026లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రసంగం చేశారు. ‘ది ఫ్యూచర్ ఆఫ్ ఎవ్రీథింగ్’ అంశంపై మాట్లాడిన ఆయన, అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన మూడు ప్రధాన స్తంభాలుగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. హైదరాబాద్ అభివృద్ధి గురించి మాట్లాడుతూ, ఒకప్పుడు బంజరు భూమిగా ఉన్న ప్రాంతాన్ని ప్రపంచ ఐటీ కేంద్రంగా మార్చిన ప్రస్థానాన్ని వివరించారు. సైబరాబాద్ ప్రాంతం పాములు, ముళ్లపొదలతో నిండిన భూమి నుంచి హైటెక్ సిటీగా ఎలా మారిందో వివరించారు. పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్య పద్ధతిలో కేవలం 15 నెలల్లో హైటెక్ సిటీ నిర్మాణం పూర్తి చేశామని తెలిపారు. బిల్ గేట్స్తో జరిగిన సమావేశం ద్వారా మైక్రోసాఫ్ట్ కేంద్రాన్ని హైదరాబాద్కు తీసుకురావడం కీలక మలుపుగా నిలిచిందన్నారు. అలాగే ఐఎస్బీ, శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వంటి ప్రాజెక్టులను తీసుకురావడంలో తన పాత్రను గుర్తుచేశారు. ఫార్చ్యూన్ 500 కంపెనీలను ఒప్పించి హైదరాబాద్ను విద్యా, పారిశ్రామిక కేంద్రంగా తీర్చిదిద్దినట్లు తెలిపారు. అభివృద్ధి చేసినప్పటికీ రాజకీయంగా ఎదురుదెబ్బలు తగిలిన విషయాన్ని అంగీకరిస్తూ, అభివృద్ధితో పాటు రాజకీయ సమతుల్యత కూడా అవసరమని తన అనుభవాలు నేర్పాయని పేర్కొన్నారు.
విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ను తిరిగి అభివృద్ధి దిశగా తీసుకెళ్లడమే తన లక్ష్యమని చంద్రబాబు తెలిపారు. గత 21 నెలల్లో రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించామని, 20 లక్షల ఉద్యోగాలు సృష్టించడమే లక్ష్యమని చెప్పారు. గూగుల్, రిలయన్స్ వంటి సంస్థలు డేటా సెంటర్లు ఏర్పాటు చేస్తున్నాయని, భారీ స్టీల్ ప్లాంట్కు శంకుస్థాపన చేయనున్నట్లు వెల్లడించారు. 2047 నాటికి రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామి ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే విజన్ను వివరించారు. అమరావతి, పోలవరం ప్రాజెక్టులను రాష్ట్ర భవిష్యత్తుకు కీలకంగా అభివర్ణించిన ఆయన, అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా నిర్మిస్తామని స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని ప్రకటించారు. సంపద సృష్టితో పాటు సామాజిక బాధ్యత కూడా ముఖ్యమని పారిశ్రామికవేత్తలకు సూచిస్తూ, పీపీపీ మోడల్కు తోడు పీపీ4 (పీపుల్-పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యం) విధానాన్ని ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు.
