ఒలింపిక్స్ లక్ష్యంగా తెలంగాణలో స్పోర్ట్స్ యూనివర్సిటీ
ఒలింపిక్స్ లక్ష్యంగా తెలంగాణలో స్పోర్ట్స్ యూనివర్సిటీ
- అంతర్జాతీయ ప్రమాణాలతో క్రీడా వసతులు ఏర్పాటు
- గచ్చిబౌలి స్టేడియం పునరుద్ధరణకు ఆదేశాలు
- పలు స్టేడియంల ఆధునీకరణపై సమీక్ష
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
హైదరాబాద్, 9 మార్చి (పీపుల్స్ మోటివేషన్): ఒలింపిక్స్ లక్ష్యంగా తెలంగాణలో క్రీడాకారులకు అత్యుత్తమ శిక్షణ అందించేందుకు అన్ని సౌకర్యాలతో స్పోర్ట్స్ యూనివర్సిటీ నిర్మించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశించారు. రాష్ట్రం నుంచి అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరచే క్రీడాకారులు ఎదగాలని, భవిష్యత్తులో ఒలింపిక్స్ మరియు కామన్వెల్త్ క్రీడలకు తెలంగాణ ఆతిథ్యమిచ్చేలా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. క్రీడాశాఖకు సంబంధించిన అంశాలపై జరిగిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి ఈ మేరకు అధికారులతో చర్చించారు. రాష్ట్రంలో ప్రతిపాదించిన యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీకి అంతర్జాతీయ ప్రమాణాల మైదానాలు, శిక్షణ సదుపాయాలు, వసతి గృహాలు వంటి అన్ని సౌకర్యాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. యూనివర్సిటీ నిర్మాణానికి సంబంధించిన పలు నమూనా రూపకల్పనలను పరిశీలించి అధికారులు పలు సూచనలు అందించారు.
గచ్చిబౌలి అవుట్డోర్ స్టేడియాన్ని పునరుద్ధరించడంతో పాటు అక్కడే ఇండోర్ స్టేడియం, యూనివర్సిటీ సముదాయం, హాస్టల్ భవనాలు, వివిధ క్రీడా మైదానాలు మరియు శిక్షణకు అవసరమైన ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి తెలిపారు. ఈ చర్యలతో రాష్ట్రంలో క్రీడా మౌలిక సదుపాయాలు మరింత బలోపేతం అవుతాయని పేర్కొన్నారు. అలాగే నగరంలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం, ఎల్బీ స్టేడియం, సరూర్నగర్ స్టేడియంలను ఆధునీకరించి భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో మంత్రులు వాకిటి శ్రీహరి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, క్రీడా ప్రాధికార సంస్థ అధ్యక్షుడు శివసేనారెడ్డి, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఉపకులపతి డాక్టర్ జి. కిషోర్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
