తాడేపల్లి రిటైనింగ్ వాల్ నిర్మాణానికి లోకేశ్ శంకుస్థాపన
తాడేపల్లి రిటైనింగ్ వాల్ నిర్మాణానికి లోకేశ్ శంకుస్థాపన
- రూ.294 కోట్లతో వరద రక్షణ గోడ నిర్మాణం
- ఆధునిక సాంకేతికతతో ప్రాజెక్టు అమలు
- 50 వేల మందికి వరద సమస్యలకు శాశ్వత పరిష్కారం
మంగళగిరి, 9 మార్చి (పీపుల్స్ మోటివేషన్): ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ తన నియోజకవర్గం మంగళగిరి ప్రజలకు ఇచ్చిన మరో కీలక హామీని నెరవేర్చారు. దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న తాడేపల్లి వరద రక్షణ గోడ నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. రూ.294.20 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టును చేపడుతున్నట్లు తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఏడాదిలోనే పరిపాలన అనుమతులు, టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి పనులు ప్రారంభించడం గమనార్హమని పేర్కొన్నారు. ప్రకాశం బ్యారేజీకి దిగువన కృష్ణా నది కుడి వైపున 0.9 కిలోమీటరు నుంచి 2.610 కిలోమీటరు వరకు ఈ వరద రక్షణ గోడను నిర్మించనున్నారు. సాధారణ గోడలా కాకుండా భూమిలోకి 26 నుంచి 38 మీటర్ల లోతు వరకు 1,920 పైల్స్ వేసి ఆధునిక పైల్-రాఫ్ట్ సాంకేతికతతో నిర్మాణం చేపడతారు. భవిష్యత్తులో భారీ వరదలు వచ్చినా, భూకంపాలు సంభవించినా తట్టుకునేలా దీన్ని రూపొందించారు.
ఈ గోడ నిర్మాణం పూర్తయితే తాడేపల్లి పరిధిలోని సుందరయ్య నగర్, మహానాడు కాలనీతో పాటు పలు లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న సుమారు 50 వేల మంది ప్రజలకు వరద సమస్యల నుంచి శాశ్వత ఉపశమనం లభించనుంది. అలాగే అమరావతి పరిసర ప్రాంతాలు మరియు జాతీయ రహదారి 65కు కూడా ఈ గోడ రక్షణగా నిలుస్తుందని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేశ్ నులకపేటలో నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ హాల్ను కూడా ప్రారంభించారు. శ్రీరంగం ఫౌండేషన్ సహకారంతో రూ.65 లక్షల కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధులతో ఈ భవనాన్ని నిర్మించారు. మంగళగిరి నియోజకవర్గంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టనున్నట్లు మంత్రి వెల్లడించారు.
