మంత్రి అచ్చెన్నాయుడు రాజీనామా చేయాలి: గడికోట శ్రీకాంత్ రెడ్డి
మంత్రి అచ్చెన్నాయుడు రాజీనామా చేయాలి: గడికోట శ్రీకాంత్ రెడ్డి
- మండలి చైర్మన్పై వ్యాఖ్యలు చేయడం హేయమని విమర్శ
- సభలో అడుగుపెట్టకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్
- టీడీపీ నుంచి సస్పెండ్ చేయాలని వైఎస్సార్సీపీ డిమాండ్
తాడేపల్లి, మార్చి 4 (పీపుల్స్ మోటివేషన్): రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తన పదవికి తక్షణమే రాజీనామా చేయాలని వైఎస్సార్సీపీ జనరల్ సెక్రటరీ గడికోట శ్రీకాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన, మండలి చైర్మన్పై కులమతాల ప్రస్తావన తీసుకురావడం దారుణమని విమర్శించారు.
రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న మండలి చైర్మన్కు మతం, పార్టీ ఆపాదిస్తూ మాట్లాడటం సిగ్గుచేటని శ్రీకాంత్ రెడ్డి అన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం దేవుడిని రాజకీయాల్లోకి లాగుతూ ఆలయ ప్రతిష్ఠను దెబ్బతీసేలా కూటమి నేతలు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. సభలో చర్చించాల్సిన అసలు అంశాన్ని పక్కనబెట్టి మండలి చైర్మన్ను వివాదంలోకి లాగడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. టీటీడీ నిధుల అంశంపై సభలో ప్రశ్నలు వస్తున్న సమయంలో ప్రభుత్వం వాటికి సమాధానం చెప్పలేక చర్చను పక్కదారి పట్టించే ప్రయత్నం చేసిందని శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. సభలో లేని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేరును ప్రస్తావిస్తూ మండలి చైర్మన్కు పార్టీని ఆపాదించడం దారుణమని అన్నారు. ఈ ఘటనతో మండలి చైర్మన్ తాను క్రిస్టియన్ కాదని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు.
అధికార పార్టీ సభ్యులు సభలో అనైతికంగా ప్రవర్తించారని ఆయన ఆరోపించారు. వైఎస్సార్సీపీ సభ్యులు మాట్లాడుతుండగా పదేపదే అడ్డుకోవడంతో పాటు మంత్రులు పోడియం చుట్టూ చేరి ఆందోళన చేయడం సభ గౌరవాన్ని తగ్గించిందని అన్నారు. పరిస్థితులు అనుకూలంగా లేకపోతే కులమతాల పేరుతో రాజకీయాలు చేయడం కూటమి నేతల ధోరణిగా మారిందని విమర్శించారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెంటనే జోక్యం చేసుకుని మంత్రి అచ్చెన్నాయుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని శ్రీకాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆయనను రాబోయే మూడేళ్లపాటు సభలో అడుగుపెట్టకుండా నిషేధించాలని, మంత్రి పదవికి రాజీనామా చేయించాలని కోరారు. అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ నుంచి కూడా అచ్చెన్నాయుడిని సస్పెండ్ చేయాలని ఆయన స్పష్టం చేశారు. శ్రీవారిని రాజకీయాల్లోకి లాగి ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం జరుగుతోందని శ్రీకాంత్ రెడ్డి అన్నారు. ఇలాంటి దిగజారుడు రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారని, ప్రజాస్వామ్య వ్యవస్థలను కాపాడే బాధ్యత అందరిపై ఉందని పేర్కొన్నారు.
