నిర్భయ నిధి కింద ములుగు జిల్లా ఎంపిక
General News
Latest news
Fast telugu news
Telugu short news
Telugu intresting news
Intresting facts
Telugu daily updates
Andhra Pradesh
Telangana news
By
Mounikadesk
నిర్భయ నిధి కింద ములుగు జిల్లా ఎంపిక
- కేంద్ర మంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపిన మంత్రి సీతక్క
- మహిళలు, బాలికల భద్రత కోసం ప్రత్యేక ప్రాజెక్టు
- క్రెచ్ వర్కర్ల వేతనాల పెంపు కోరిన మంత్రి
న్యూఢిల్లీ, మార్చి 14 (పీపుల్స్ మోటివేషన్): కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నిర్భయ నిధి పథకం కింద ‘మహిళలు, బాలికల కోసం సమ్మిళిత నగరాలు’ కార్యక్రమానికి తెలంగాణలోని ములుగు జిల్లాను ఎంపిక చేయడం పట్ల రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అన్నపూర్ణ దేవిని ఢిల్లీలో కలిసి ధన్యవాదాలు తెలిపారు. ములుగు జిల్లాను ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి ఎంపిక చేయడం మహిళల భద్రత, సాధికారతకు పెద్ద అడుగుగా నిలుస్తుందని ఆమె పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా ములుగు జిల్లాలో మహిళలు మరియు బాలికల భద్రత, గౌరవం, రాకపోకల సౌకర్యాలను మెరుగుపరిచే చర్యలు చేపట్టనున్నారు. జెండర్ స్పందన కలిగిన మౌలిక వసతులు, ఆధునిక నిఘా వ్యవస్థలు, అత్యవసర ప్రతిస్పందన వ్యవస్థలు ఏర్పాటు చేయడం ద్వారా మహిళలకు మరింత భద్రత కల్పించాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్టును అమలు చేయనున్నారు. ములుగులో ఈ ప్రాజెక్టును విజయవంతంగా అమలు చేసేందుకు అవసరమైన డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారీలో జిల్లా యంత్రాంగంతో సమన్వయం చేసుకుంటూ రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ పూర్తి సహకారం అందిస్తుందని మంత్రి సీతక్క కేంద్రమంత్రికి తెలిపారు. మహిళా సాధికారత, భద్రత విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను మంత్రి సీతక్క అభినందించారు. తెలంగాణలో ఈ కార్యక్రమాన్ని అమలు చేయడం ద్వారా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మహిళల రక్షణను మరింత బలోపేతం చేయవచ్చని ఆమె పేర్కొన్నారు. మహిళలు మరియు బాలికలు భయపడకుండా స్వేచ్ఛగా సంచరించే వాతావరణం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఇదే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘పాలనా’ పథకం కింద పనిచేస్తున్న క్రెచ్ వర్కర్లు, హెల్పర్ల వేతనాలను పెంచాలని మంత్రి సీతక్క కేంద్ర మంత్రిని కోరారు. ప్రస్తుతం క్రెచ్ వర్కర్లకు నెలకు రూ.5,500, హెల్పర్లకు రూ.3,000 మాత్రమే గౌరవ వేతనం ఇస్తున్నారని, ఇది వారు నిర్వహిస్తున్న బాధ్యతలకు సరిపోదని ఆమె వివరించారు. ఒక క్రెచ్లో దాదాపు 25 మంది పిల్లల సంరక్షణ బాధ్యతను నిర్వహించడం ఎంతో కీలకమని, ప్రస్తుత జీవన వ్యయాలను దృష్టిలో ఉంచుకుని వేతనాలను పెంచడం అవసరమని ఆమె తెలిపారు.
పనిచేసే తల్లులకు అండగా నిలిచే ఈ పథకం విజయవంతంగా కొనసాగాలంటే సిబ్బందికి సరైన గౌరవ వేతనాలు అందించాల్సిన అవసరం ఉందని మంత్రి సీతక్క పేర్కొన్నారు. మహిళా సాధికారత, శిశు సంక్షేమం కోసం పనిచేస్తున్న సిబ్బంది ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
Comments
